చిల్లర కోసం గొడవలు పడకండి..ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు ఇక చెల్లదు
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద చిల్లర కష్టాలు, క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షణకు కాలం చెల్లిపోనుంది. 2026, ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డిజిటల్ ఇండియాలో భాగంగా టోల్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం.
ప్రస్తుతం దేశంలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద 98 శాతం లావాదేవీలు ఫాస్ట్ట్యాగ్ (Fastag) ద్వారానే జరుగుతున్నాయి. అయినప్పటికీ, ఇంకా 2 శాతం మంది నగదు రూపంలో టోల్ చెల్లిస్తున్నారు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద అనవసరమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడటమే కాకుండా, సిబ్బందికి కూడా పని భారం పెరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 1 నుంచి క్యాష్ కౌంటర్లను పూర్తిగా మూసివేసి, 100 శాతం డిజిటల్ పేమెంట్లను అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఒకవేళ ఫాస్ట్ట్యాగ్ లేకపోతే ప్రస్తుతం రెట్టింపు రుసుము వసూలు చేస్తున్నారు, కానీ కొత్త నిబంధనల ప్రకారం డిజిటల్ పద్ధతిలో చెల్లిస్తే అదనంగా 125 శాతం ఛార్జీలు పడే అవకాశం ఉందని సమాచారం.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టోల్ ప్లాజాల వద్ద అసలు వాహనం ఆపాల్సిన అవసరం లేని సరికొత్త వ్యవస్థను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. దేశంలోని 25 టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికే ఈ ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ పద్ధతిలో టోల్ గేట్ల వద్ద హై-స్పీడ్ కెమెరాలు ఉంటాయి.

కారు గేటు దాటుతున్నప్పుడు ఆ కెమెరాలు కారు నంబర్ ప్లేట్ను స్కాన్ చేస్తాయి. ఆ నంబర్ ప్లేట్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ లేదా ఫాస్ట్ట్యాగ్ వాలెట్ నుండి టోల్ అమౌంట్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గుతుంది.
టోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఏళ్లుగా వినిపిస్తున్న ఫిర్యాదులకు కేంద్రం ఒక చక్కని పరిష్కారం చూపింది. గతేడాది ఆగస్టు నుంచి అమలులోకి వచ్చిన యాన్యువల్ పాస్(Annual Pass) విధానం సాధారణ ప్రజలకు ఎంతో లాభదాయకంగా ఉంది.

మీరు ఏడాదికి రూ.3,000 ముందే చెల్లించి పాస్ తీసుకుంటే, ఏడాదిలో 200 సార్లు టోల్ గేట్లు దాటవచ్చు. అంటే సగటున ఒకసారి టోల్ దాటడానికి మీరు కేవలం రూ. 15 మాత్రమే ఖర్చు చేస్తున్నారన్నమాట. అయితే, ఈ వెసులుబాటు కేవలం ప్రైవేట్ వాహనదారులకు మాత్రమే ఉంటుంది. కమర్షియల్ వాహనాలకు ఇది వర్తించదు.
డిజిటల్ పేమెంట్లు బాగున్నప్పటికీ, నెట్వర్క్ సమస్యలు లేదా సర్వర్ డౌన్ అయినప్పుడు పరిస్థితి ఏంటన్నది వాహనదారుల ఆందోళన. సర్వర్ మొరాయించి ఫాస్ట్ట్యాగ్ స్కాన్ అవ్వకపోతే వాహనాలను గంటల తరబడి నిలిపివేసే అవకాశం ఉందని కొందరు భయపడుతున్నారు.
దీనిపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంది. వచ్చే ఏడాదిలోగా దేశంలోని ప్రతి టోల్ బూత్ను పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్ వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications








