Petrol Diesel Price వాహనదారులకు శుభవార్త.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.!
గత కొన్ని నెలలుగా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి వాహనదారులకు ఆర్థికంగా ఇబ్బందిగా మారింది. తాజా వార్త వాహనదారులకు ఉపశమనం కలిగించనుంది. త్వరలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం తదితర కారణాలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదలతో కుదేలైన ఆయిల్ ట్రేడింగ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి. ఈ త్రైమాసికంలో ఆయిల్ కంపెనీలు నష్టాల బారి నుంచి కోలుకున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. దీంతో మరికొద్ది రోజుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టి వినియోగదారులకు లాభం చేకూరే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే రష్యా సహా ఇతర దేశాల నుంచి చమురు సరఫరా ఎక్కువగా ఉండటంతో భారత్లో పెట్రోలు, డీజిల్కు కొరత ఉండదని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా దేశంలో కాలుష్యరహిత వాతావరణాన్ని నెలకొల్పేందుకు 'గ్రీన్ హైడ్రోజన్ మిషన్'పై కేంద్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అందుకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో లేవు.
పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (OPEC)లో అగ్రగామి సభ్యదేశంగా ఉన్న సౌదీ అరేబియా.. జూలై నుంచి చమురు ఉత్పత్తిని మరింత తగ్గించనున్నట్లు వెల్లడించింది. కానీ ఈ ప్రభావంతో భారత్లో మళ్లీ ఇంధన ధరలు పెరుగుతాయన్న భయం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

అంతేకాకుండా ఫ్యూయెల్తో నడిచే వాహనాల్లో 20 శాతం ఇథనాల్ ఇంధనాన్ని ఉపయోగించాలనే ప్రణాళికను సక్రమంగా అమలు చేస్తున్నట్లు కేంద్రం చెప్పినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కొన్ని రకాల వాహనాల్లో 80 శాతం పెట్రోల్ మరియు 20 శాతం ఇథనాల్ వాడతారు.
పెట్రోలు, డీజిల్ ధరలు అధికంగా ఉండటంతో సామాన్యులు సొంత వాహనాలు కొనగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. క్యాబ్లు లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టుపై ఆధారపడుతున్నారు. ఈ ప్రభావం ఆటో మొబైల్ రంగంపై కూడా తీవ్రంగా పడుతోంది. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనతో కొంచెం ఉపశమనం కలగనుంది.
ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే.. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 గా ఉంది. డీజిల్ ధర రూ.89.62 గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా డీజిల్ ధర రూ.94.27గా ఉంది.
ఇక హైదరాబాద్లో చూసుకుంటే లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66 గా ఉంది. పెట్రోల్ రేట్ గత పదిరోజులుగా నిలకడగానే ఉంది. ఇక డీజిల్ ధర 97.82 గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.80 కాగా, డీజిల్ ధర రూ. 99.52 గా ఉంది.
ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.5 నుంచి రూ.10 తగ్గుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫ్యూయెల్ ధరల తగ్గింపు కోసం వాహనదారులే కాదు, ద్విచక్ర వాహనాలు, కార్ల తయారీదారులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇంధన ధరలు తగ్గితే వాహన విక్రయాల జోరు మరింత పెరగే అవకాశాలు ఉన్నాయి. ధరల తగ్గింపునకు సంబంధించిన అధికారిక సమాచారం మరికొద్ది రోజుల్లో తెలియనుంది.


Click it and Unblock the Notifications








