ఒకేసారి 70కి పైగా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ కాన్సిల్.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం!!
ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థకు సీనియర్ ఉద్యోగులు షాక్ ఇచ్చారు. ఒకేసారి 300 మంది ఉద్యోగులు సెలవు పెట్టడంతో 70 కిపైగా విమానాలు రద్దయ్యాయి. అనుకోని ఈ పరిణామానికి సదరు ఎయిర్లైన్స్ సంస్థతో పాటు ప్రయాణికులు అవాక్కయ్యారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అసలు ఇలా ఒకేసారి ఇంతమంది ఉద్యోగులు సెలవు పెట్టడానికి గల కారణాలేంటంటే..
సాధారణంగా ఏ సంస్థ అయినా.. ఉద్యోగులకు సాధారణ సెలవులతో పాటు కొన్ని ప్రత్యేక సెలవులను కేటాయిస్తుంది. అత్యవసర సందర్భాలు, పర్సనల్ పనుల దృష్ట్యా ఆ లీవ్స్ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఎక్కడైనా సరే ఒకేసారి కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరూ సెలవు పెట్టుకోవడానికి కుదరదు. కానీ ఇక్కడ మాత్రం ప్రముఖ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఒకేసారి 300 మంది ఉద్యోగులు మాస్ సిక్ లీవ్ పెట్టారు.

దీంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్(Air India Express) సమస్యలో పడింది. సిబ్బంది అంతా మూకుమ్మడిగా సిక్ లీవ్ పెట్టడంతో విమానాలు నడపలేకపోతున్నామని ప్రయాణికులకు వెల్లడించింది. అనుకోని పరిణామంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు దేశీయంగా, అంతర్జాతీయంగా 70కి పైగా విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రయాణికులు చిక్కుల్లో పడ్డారు.
అయితే ఇక్కడ మరో సమస్య వచ్చి పడింది. ఉద్యోగులంతా ఒకేసారి సిక్ లీవ్ పెట్టడమే కాదు.. కంపెనీ యాజమాన్యానికి స్పందించకుండా.. తమ ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారు. చివరి నిమిషంలో అందరూ ఒకేసారి సిక్ లీవ్ పెట్టి.. సెల్ ఫోన్లను స్విచాఫ్ చేసుకోవడంతో కంపెనీ యాజమాన్యం షాక్కు గురైంది.

ఈ సంఘటనతో ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్షమాపణలు చెప్పింది. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగులను సంప్రదించేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. అయితే సిబ్బంది ఇలా ఒకేసారి మాస్ సిక్ లీవ్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే.. గత కొన్ని రోజులుగా ఎయిరిండియా యాజమాన్యంపై సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం.
ఇటీవల ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. దీంతో యాజమాన్యం పూర్తిగా టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీనిపై సీనియర్ ఉద్యోగులు మండిపడుతున్నారు. కొత్త ఎంప్లాయ్మెంట్ నియమనిబంధనలు సరిగా లేవని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎయిరిండియాను టాటా గ్రూపులో కలిపేసిన తర్వాత సీనియర్ ఉద్యోగులపై యాజమాన్యంపై పక్షపాతం ప్రదర్శిస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా సీనియర్ ఉద్యోగులకు కొత్తగా ఇంటర్వ్యూలు పెడుతున్నారని.. ఇంటర్వ్యూల్లో పాసయిన వాళ్లకి తక్కువ స్థాయి ఉద్యోగాలు ఇస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో ఇప్పటికే దీనిపై సంస్థలో ఉద్యోగుల నుంచి అసహనం వ్యక్తం అవుతుండటంతో.. ఈ సారి ఏకంగా సీనియర్ ఉద్యోగులంతా కలిసి సిక్ లీవ్లు పెట్టినట్లుగా సమాచారం.
సిబ్బంది సిక్ లీవ్తో విమానాలు రద్దు కావడంతో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు రీఫండ్ చేస్తామని ఎయిరిండియా వెల్లడించింది. అంతేకాకుండా మరో రోజు ఇదే ఫ్లైట్ను బుక్ చేసుకునే అవకాశం కూడా ఇస్తామని తెలిపింది. అయితే విమానాల రద్దుపై ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు. అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
విమానాల రద్దుతో.. అప్పుడే వచ్చిన ప్రయాణికులు, టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులతో విమానాశ్రయాలు కిక్కిరిసిపోయాయి. ఫ్లైట్స్ రద్దుపై తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్యాసింజర్స్ మండిపడ్డారు. మరికొందరు సమాచారం తెలియగానే ప్రయాణికులు విమానాశ్రయాలకు చేరుకున్నారు. ఉద్యోగుల నిరసనపై యాజమాన్యం త్వరితగతిన స్పందించి మున్ముందు ఇలాంటి సమస్య రాకుండా చూడాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications








