పైలట్స్ లేకపోవడంతో ఫ్లైట్లోనే రెండు గంటలు వెయిట్ చేసిన ప్రయాణికులు
ఎయిర్ ఇండియా(Air India) విమానంలో పైలట్ టైమ్కి రాకపోవడంతో ప్రయాణికులను 2 గంటల పాటు విమానంలోనే ఉంచిన ఘటన ఇటీవల ఢిల్లీలో చోటుచేసుకుంది. దీంతో విమానంలోని ప్రయాణికులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎయిర్ ఇండియాపై విమర్శలు గుప్పించారు.
దేశంలో ప్రతిరోజూ వేలాది మంది దేశీయ, అంతర్జాతీయ విమానాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. వీటిలో ఎయిర్ ఇండియా ప్రముఖ విమానయాన సంస్థ. అయితే బస్సు, కారు నడిపినంత తేలిక కాదు విమానాలను నడపడమనేది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని నడపడానికి హై స్కిల్స్ కలిగిన పైలట్తో పాటు టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషస్తుంది. అయితే ఈ క్రమంలో ఎక్కడైనా చిన్నపాటి సమస్య తలెత్తినా ఫ్లైట్లోని సిస్టమ్పై ప్రభావం పడుతుంది.

ఈ క్రమంలో ఎయిర్ ఇండియా విమానం(Air India Pilot Late) ఏఐ 853 శుక్రవారం రాత్రి ఢిల్లీ నుంచి పుణె వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం ప్రయాణికులందరూ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అనంతరం షెడ్యూల్ ప్రకారం విమానాన్ని బోర్డింగ్ ప్లేస్కు తీసుకువచ్చి నిలిపారు. సదరు విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లు కూడా జారీ చేశారు.
దీని తరువాత, దాదాపు 100 మంది ప్రయాణికులందరూ సేఫ్టీ తనిఖీలు ముగిసిన అనంతరం ఫ్లైట్ ఎక్కారు. అనంతరం తమ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చున్నారు. సరిగ్గా శుక్రవారం రాత్రి 7:10 గంటలకు ఢిల్లీ నుంచి విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉంది. ఫ్లైట్ టేకాఫ్ అయ్యే ముందు విమానంలోని సిబ్బంది ప్రయాణికులను అప్రమత్తం చేస్తారు.

అయితే సమయం దాటినా కూడా ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంతే కాకుండా స్టాఫ్, విమాన పైలట్ నుంచి కూడా ప్రయాణికులకు ఎటువంటి సమాచారం అందలేదు. దీంతో విమానంలో ఉన్న కొందరు ప్రయాణికులు విమానం ఎందుకు టేకాఫ్ అవ్వడం లేదు సిబ్బందిని అడిగారు. దానికి స్టాఫ్ సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది.
దీంతో కోపోద్రిక్తులైన కొందరు ప్రయాణికులు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాతే విమానంలోకి పైలట్ ఇంకా రాలేదని సమాచారం అందింది. పైలట్ లేకుండానే బోర్డింగ్ పాస్ ఎలా జారి చేశారని, ఫ్లైట్లోకి ఎలా ఎక్కించారని ప్రయాణికులకు సందేహం కలిగింది.
ఈ క్రమంలో ప్రయాణికులను దాదాపు రెండు గంటలపాటు విమానంలోనే ఉంచారు. రాత్రి 9:10 గంటలకు పైలట్ రావడంతో అప్పుడు టేకాఫ్ అయింది. సరిగ్గా 11 గంటలకు పుణేలో విమానం ల్యాండ్ అయింది. దాదాపు 2 గంటల ఆలస్యం తర్వాత విమానం గమ్య స్థానానికి చేరుకుంది.
ఎయిరిండియా పైలట్లు ఇలా సమయానికి రాకపోవడం ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితం బెంగళూరు నుంచి ముంబయి వెళ్లాల్సిన విమానం కూడా ఇలాగే 9 గంటల ఆలస్యంగా టేకాఫ్ అయింది. మొదటగా ఒక గంట ఆలస్యం మాత్రమే అవుతున్నట్లుగా ప్రకటించింది. ఆ తర్వాత ఎలాంటి కారణం లేకుండా 9 గంటల ఆలస్యంగా మారింది.
9 గంటల పాటు విమానంలోని ప్రయాణికులకు ఆహారం, నీళ్లు సహా ఏమీ ఇవ్వడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఈ వార్త వెలువడిన కొద్ది రోజులకే ఢిల్లీ నుంచి పుణె వెళ్లాల్సిన విమానం కారణం లేకుండా ఆలస్యం అయింది. ఇదేంటని ప్రశ్నిస్తే ఎయిర్ ఇండియాలో పైలట్ల కొరత తీవ్రంగా ఉందని సమాధానమిచ్చారు.
పైలట్ల సంఖ్య తక్కువగా ఉండడంతో వారికి విమానాలు కేటాయించడం కష్టమని, కొన్నిసార్లు పైలట్లు సెలవు పెడితే దాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పైలట్లే లేరని సమాచారం. ఇలా పైలట్ కారణంగానే కాకుండా గతంలోనూ సాంకేతిక కారణాలతో ఎయిరిండియాలో ప్రయాణికులు ఇబ్బందులకు గురైన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎయిర్లైన్స్లో ఎయిర్ ఇండియా ఒకటి. ఎయిరిండియా ప్రస్తుతం టాటా గ్రూప్ నిర్వహణలో ఉంది. ప్రస్తుతం కంపెనీ తన ఖర్చులను తగ్గించుకునేందుకు పైలట్ల సంఖ్యను తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా, పైలట్లు లేకుండా ఎయిర్ ఇండియా విమానాలు తరచుగా ఆలస్యం అవుతున్నాయి. ప్రయాణికుల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications








