కరోనా వ్యాక్సిన్ వేసుకో 1 లీటర్ పెట్రోల్ తీసుకో.. ఎక్కడనుకుంటున్నారా?
భారతదేశంలో కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ తీవ్రత ఎంత ప్రభావం చూపిందో అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ మహమ్మారి వ్యాప్తి చాలా తగ్గిపోయిందని నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే సెకండ్ వేవ్ నాశనమవుతున్న ఈ తరుణంలో తార్డ్ వేవ్ (మూడవ దశ) గురించి కూడా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరో సారి ఈ మహమ్మారి వ్యాప్తిని పూర్తిగా తగ్గించడానికి తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కరోనా గురించి బాగా అవగాహన ఉన్న వారికి ఈ వ్యాక్సిన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
కానీ కొంతమందికి ఈ వ్యాక్సిన్ గురించి ఇప్పటికి అపోహలు మరియు అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను వారినుంచి పారద్రోలటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల మరో కొత్త పద్దతి అవలంభించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ పద్దతి ప్రకారం వ్యాక్సిన్ వేసుకున్న వారికీ గిఫ్ట్స్ ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు.

ఇంతకుముందు రష్యా రాజధాని మాస్కోలో వ్యాక్సిన్ గ్రహీతలకు లక్కీ డ్రా ద్వారా కొత్త కారు బహుమతిగా ఇవ్వబడుతుందని ప్రకటించారు. ఇందులో ప్రతి వారం 5 మందిని ఎన్నుకుని విజేతకు కొత్త కారు బహుమతిగా ఇవ్వబడింది. అయితే ఇటీవల పుదుచ్చేరిలో వ్యాక్సిన్ వేసుకున్నవారికి మరో కొత్త రకమైన గిఫ్ట్ ఇస్తామని తెలిపారు.

పుదుచ్చేరిలో కరోనా యొక్క ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకున్నవారికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పుదుచ్చేరిలోని విల్లినూర్ వద్ద ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఇక్కడ టీకా గురించిన ప్రచారం జూన్ 26 న జరుగుతోంది. ఈ ప్రచారంలో పాల్గొనే వారికి ఉచిత పెట్రోల్ లభిస్తుందని ఒక ప్రైవేట్ పెట్రోల్ బంక్ ప్రకటించింది.

టీకా పొందిన వారందరికీ జూన్ 26 న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర లీటరు పెట్రోల్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ బహుమతి ఫస్ట్ టైం వ్యాక్సిన్ వేసుకున్నవారికి లభిస్తుందని వారు తెలిపారు. అంతే కాకుండా ఆటో డ్రైవర్లతో సహా ఫ్రంట్లైన్ కార్మికులకు టీకాలు వేసుకుంటే వారికి 1 లీటర్ పెట్రోల్ను ఉచితంగా ఇస్తామని తెలిపారు.

భారతదేశంలో ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానంటుతున్నాయా అన్నట్లు ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ. 100 దాటేసింది. దీనిపై వాహనదారులు చాలా ఆందోళన చెందుతున్నారు. అమాంతం పెరిగిపోయిన పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్య మానవునిపై పెనుభారాన్ని మోపాయి.

పెట్రోల్ ధరలు పెరిగిపోయిన కారణంగా వాహనదారులు మాత్రమే కాదు, గృహిణులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఎందుకంటే పెరుగుతున్న పెట్రోల్ ధరలు నిత్యావసర ధరల మీద కూడా ప్రభావాన్ని చూపుతాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఏమి చేయలేమని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల స్పష్టం చేశారు.
Note: Images used are for representational purpose only.


Click it and Unblock the Notifications








