రెండేళ్ల తర్వాత గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.!
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో సామాన్యులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊరటనిచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్(Petrol Diesel Prices Cut) ధరలను తగ్గిస్తూ శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి తగ్గింపు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్పై రూ. 100 తగ్గించిన కొద్దిరోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై తగ్గింపు నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులకు ఉపశమనం కలగనుంది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 2 తగ్గిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ గురువారం తన 'X' ఖాతాలో పోస్ట్ చేశారు. సవరించిన ధరలు నేటి నుంచి(మార్చి 15) ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు.

ఈ మేరకు హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 చొప్పున తగ్గించడం ద్వారా కోట్లాది మంది భారతీయుల కుటుంబ సంక్షేమం, సౌలభ్యమే ఎల్లప్పుడూ తన లక్ష్యమని ప్రధాని మోదీ మరోసారి నిరూపించారని ఆయన ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు ప్రకటించాయని చెప్పారు.
కాగా మే 2022 తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం ఇదే తొలిసారి కావడంతో.. వాహనదారులకు ఊరట కలగనుంది. దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అనేవి.. సరుకు రవాణా ఛార్జీలు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT) మరియు స్థానిక పన్నుల వంటి ప్రభావాలకు లోబడి నిర్ణయించబడతాయి. ఫలితంగా ఒక్కో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా ఉంటాయి.

దేశవ్యాప్తంగా నేటి నుంచి పెట్రోల్-డీజిల్ ధరల తగ్గింపుతో 58 లక్షల భారీ వస్తువుల వాహనాలు, 6 కోట్ల కార్లు, 27 కోట్ల ద్విచక్ర వాహనదారులకు లబ్ధి చేకూరుతుంది. కాగా.. మే 21, 2022న కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ మరియు లీటర్ డీజిల్పై వరుసగా ఎక్సైజ్ సుంకాన్ని రూ.8 మరియు రూ.6 తగ్గించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధరల్లో ఎప్పుడూ తగ్గుదల జరగలేదు.
ధరల తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.72 కి చేరింది. ముంబయిలో రూ.104.21 వద్ద ఉండగా.. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.100.75 గా ఉంది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.87.62 కు పడిపోగా.. ముంబయిలో రూ. 92.15 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా: ఇక చమురు ధరల తగ్గింపుతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిద్దాం. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.41 గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 95.65 వద్ద స్థిరపడింది. వరంగల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.99 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 95.25 వద్దకు చేరింది.
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు తర్వాత ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.31 కు దిగివచ్చింది. లీటర్ డీజిల్ ధర రూ. 97.17 గా ఉంది. వైజాగ్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.29 కాగా లీటర్ డీజిల్ ధర రూ. 96.17 కు చేరింది.


Click it and Unblock the Notifications








