Petrol Diesel Price : సామాన్యుడి జేబుకు చిల్లు.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel Price : నాలుగేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం సామాన్యుడికి పెద్ద షాక్గా మారింది. ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోవడంతో కేంద్రం చివరకు ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభావం కూరగాయల నుంచి క్యాబ్ ఛార్జీల వరకు ప్రతిచోటా కనిపించబోతోందనే ఆందోళన మొదలైంది.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ.3 వరకు పెరగడంతో వాహనదారులు షాక్కు గురయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. గత నాలుగేళ్లలో రిటైల్ వినియోగదారులకు ఇది మొదటి పెద్ద పెంపుగా మారింది. ఇదే సమయంలో సీఎన్జీ ధరలు కూడా కిలోకు రూ.2 పెరగడం మరో దెబ్బగా మారింది.

ధరల పెంపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.97.77కి చేరింది. డీజిల్ ధర రూ.90.67 అయింది. ముంబైలో పెట్రోల్ రూ.106.68, డీజిల్ రూ.93.14గా నమోదైంది. కోల్కతాలో పెట్రోల్ రూ.108.74 దాటగా, చెన్నైలో కూడా ధరలు భారీగా పెరిగాయి.
హైదరాబాద్లో ఇప్పుడు ఎంతంటే?
హైదరాబాద్లో ఇప్పటికే దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఉండగా, తాజా పెంపుతో మరింత భారం పడింది. గత ధరల ప్రకారం నగరంలో పెట్రోల్ సుమారు రూ.107.45 ఉండేది. ఇప్పుడు కొత్త పెంపుతో అది రూ.110 దాటే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డీజిల్ కూడా రూ.98కు చేరువ కావొచ్చని అంచనా.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందు బ్యారెల్ ధర సుమారు 69 డాలర్ల వద్ద ఉండగా, ఇప్పుడు 110 డాలర్లకు పైగా చేరినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఈ ఒత్తిడిని ప్రభుత్వ చమురు కంపెనీలు ఎక్కువకాలం భరించలేక చివరకు వినియోగదారులపై మోపాయి.
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ చమురు సంస్థలు రోజుకు వేల కోట్ల నష్టాలు ఎదుర్కొంటున్నాయని సమాచారం. పెరిగిన ముడి చమురు ధరలకు సరిపడా రిటైల్ ధరలు పెంచకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

సామాన్యుడికి ఇక డబుల్ షాక్
ఇంధన ధరల పెంపు ప్రభావం కేవలం బంక్ దగ్గరే ఆగదు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరగడంతో కూరగాయలు, పాలు, సరుకు రవాణా, క్యాబ్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రజలకు సూచించారు. వీలైతే ఇంటి నుంచే పని చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం అయితే ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో రెండు రోజుల వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల పెంపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై భారీ చర్చ జరుగుతోంది. కొందరు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలవైపు వెళ్లాల్సిందేనంటుంటే, మరికొందరు మధ్యతరగతి కుటుంబాలపై ఇది పెద్ద భారం అంటున్నారు.


Click it and Unblock the Notifications