పెట్రోల్ బంకుల్లో కొత్త రకం మోసం..రూ.500 పెట్రోల్ కొట్టమంటే సిబ్బంది ఏం చేశాడో చూశారా ?
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో.. పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలు వాహనదారులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో అనుజ్ అగ్నిహోత్రి అనే యూజర్ షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది.. ఒక బైక్ నడిపే వ్యక్తి బంకులో రూ.500 పెట్రోల్ కొట్టమని చెబితే, అక్కడి ఉద్యోగి అతడిని నమ్మించి చాలా తెలివిగా పెట్రోల్ దొంగతనం చేశాడు.. ఈ మోసమంతా బంకులోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో అసలు విషయం బయటపడింది.
ఈ నేపథ్యంలో ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NCIB) రంగంలోకి దిగి కొన్ని సంచలన మార్గదర్శకాలను విడుదల చేసింది.. మరి ఆ ఘరానా చోరీ ఎలా జరిగింది?, మనం మోసపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో పెట్రోల్ బంకుల మోసాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుజ్ అగ్నిహోత్రి పోస్ట్ చేసిన ఒక వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో ప్రకారం ఒక కస్టమర్ తన బైక్లో రూ. 500 విలువైన పెట్రోల్ పోయమని బంక్ సిబ్బందికి చెప్పాడు. అయితే, అక్కడ పని చేసే ఉద్యోగి కస్టమర్ను మాటల్లో పెట్టి, పెట్రోల్ మిషన్ మీటర్లో మెయిన్ అమౌంట్ను సెట్ చేయకుండా కేవలం కొన్ని బటన్లు మాత్రమే నొక్కాడు.
ఆ మిషన్లో అంతకుముందే ఎవరో కొట్టించుకున్న రూ.100 రీడింగ్ అలాగే ఉంది. ఆ ఉద్యోగి వెంటనే పెట్రోల్ నోజిల్ను బైక్ ట్యాంక్లో పెట్టి, కేవలం వంద రూపాయల పెట్రోల్ పడగానే చటుక్కున బయటకు తీసేసి, రూ.500 పెట్రోల్ కొట్టేసినట్లు కస్టమర్ను నమ్మించాడు. ఈ మోసమంతా అక్కడే ఉన్న కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. ఆ తర్వాత కస్టమర్ నిలదీయడంతో బంక్ మేనేజర్ వచ్చి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

ఈ తరహా మోసాలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతుండటంతో నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NCIB) స్పందించింది. వాహనదారులు మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన ముందస్తు జాగ్రత్తలతో కూడిన మార్గదర్శకాలను జారీ చేసింది. మీరు ఎప్పుడు, ఏ పెట్రోల్ బంకుకు వెళ్లినా.. ఉద్యోగి పెట్రోల్ నోజిల్ చేతిలోకి తీసుకోకముందే డిజిటల్ స్క్రీన్ పై రీడింగ్ 0 ఉందో లేదో కచ్చితంగా చెక్ చేసుకోవాలని ఎన్సీఐబీ స్పష్టం చేసింది. ఎవరైనా మిమ్మల్ని మాటల్లో పెట్టినా లేదా పక్కకు పిలిచినా మీ చూపును మాత్రం మీటర్ రీడింగ్ నుండి అస్సలు తిప్పవద్దని సూచించింది.
ఇంధనం నింపేటప్పుడు ఈ విషయాలు గమనించండి
పెట్రోల్ లేదా డీజిల్ మీ వాహనంలో పడుతున్నంత సేపు మీ పూర్తి శ్రద్ధ మిషన్ రీడింగ్ పై, సదరు ఉద్యోగి పట్టుకున్న నోజిల్ ట్రిగ్గర్ పైనే ఉండాలి. చాలామంది ఉద్యోగులు నోజిల్ ట్రిగ్గర్ను పదే పదే నొక్కుతూ వదులుతూ ఉంటారు, దీనివల్ల ఇంధన ప్రవాహం తగ్గి తక్కువ పెట్రోల్ పడుతుంది. కాబట్టి మీరు రూ.50 లీటర్ల తక్కువ ఇంధనం కొట్టించినా సరే.. మిషన్లో ఆటో-కట్ మోడ్ను సెట్ చేయమని ఉద్యోగిని డిమాండ్ చేయండి. ఆటో-కట్ మోడ్ వల్ల ఇంధనం కచ్చితమైన పరిమాణంలో వాహనంలోకి చేరుతుంది.
బిల్ రశీదు, డెన్సిటీ చెకింగ్
వాహనంలో ఇంధనం నింపడం పూర్తయిన తర్వాత బంక్ నుంచి ప్రింటెడ్ రశీదును తప్పకుండా తీసుకోవడం అలవాటు చేసుకోండి. రశీదులో ఉన్న అమౌంట్, లీటర్ల వివరాలు, మిషన్ స్క్రీన్ పై ఉన్న రీడింగ్లు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దీనితో పాటు పెట్రోల్ కొట్టించేటప్పుడు స్క్రీన్ పై వచ్చే డెన్సిటీని కూడా గమనించాలి. నాణ్యమైన పెట్రోల్ కోసం డెన్సిటీ రేటింగ్ 730-775 మధ్య ఉండాలి, అలాగే డీజిల్ కోసం 820-860 మధ్య ఉండాలి. దీనివల్ల కల్తీ పెట్రోల్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
ఒకవేళ మోసపోతే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?
పెట్రోల్ బంకుల్లో ఎలాంటి మోసం లేదా తూకంలో తేడాలు జరిగినట్లు మీకు అనుమానం వస్తే, ఏమాత్రం భయపడకుండా చట్టపరమైన సహాయం పొందవచ్చు. లీటరు కొలతల్లో మోసాలు జరగకుండా ప్రతి మిషన్ పై ప్రభుత్వ లీగల్ మెట్రాలజీ విభాగం అధికారిక సీల్ వేస్తుంది.
ఒకవేళ బంక్ యాజమాన్యం మీతో మోసానికి పాల్పడితే, మీరు నేరుగా నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారిక హెల్ప్లైన్ నంబర్ 9792580000కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ జేబు ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.


Click it and Unblock the Notifications