రాంచీలో మహిళల కోసం 'పింక్ లైన్ ఆటో రిక్షాలు'
మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువైపోతున్న నేపథ్యంలో, జార్ఖండ్ ట్రాఫిక్ పోలీసులు రాంచీలో మహిళల భద్రత కోసం ఓ సరికొత్త ప్రణాళికను ప్రారంభించారు. ఇందుకోసం 'పింక్ లైన్' అనే ఆటో రిక్షా సేవలను కేవలం ప్రత్యేకించి మహిళల కోసం ప్రారంభించారు. ఈ ఆటోలు పింక్ కలర్ రూఫ్ను కలిగి ఉండి, మహిళలకు మాత్రమే అనే బోర్డును కలిగి ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి 200 ప్రత్యేక ఆటో రిక్షాలను పరిచయం చేయాలని పోలీసులు యోచిస్తున్నారు.
పింక్ లైన్ ఆటో రిక్షాలను మహిళలే డ్రైవ్ చేస్తారు. ఒకవేళ మహిళా ఆటో డ్రైవర్లు అందుబాటులో లేని నేపథ్యంలో, పురుష ఆటో డ్రైవర్లను ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేసి, వారికి ఐఢి కార్డులను జారీ చేస్తారు. అంతేకాకుండా, ఇలాంటి ఆటో పింక్ లైన్ ఆటో రిక్షాలు జిపిఎస్ ద్వారా శాటిలైట్కు అనుసంధానం చేయబడి ఉంటాయి. ఈ సదుపాయం వలన సదరు ఆటో రిక్షాలు ఏ రూట్లో ప్రయాణిస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయనే సమాచారన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది.

పింక్ లైన్ ఆటో రిక్షాలలో జిపిఎస్ కెనెక్టివిటీతో పాటుగా, మహిళా ప్యాసింజర్ల కోసం ప్యానిక్ బటన్ కూడా ఉంటుంది. అత్యవసర సమయాల్లో మహిళా ప్రయాణికులు ఈ బటన్ ప్రెస్ చేసినట్లయితే ట్రాఫిక్ అధికారులకు సందేశం వెళ్లి ఈ ఆటో ట్రాక్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా, పింక్ లైన్ ఆటో రిక్షాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను కూడా ఏర్పాటు చేయాలని అధికాలు భావిస్తున్నారు.
మహిళల కోసం ప్రత్యేకించి ఇలా స్పెషల్ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయటం ఇదేం మొదటిసారి కాదు, బెంగుళూరులో మహిళల కోసం పింక్ బిఎమ్టిసి బస్సులు, హైదరాబాద్ ఎమ్ఎమ్టిఎస్ ట్రైన్లలో మహిళల కోసం ప్రత్యేక కోచ్లు ఇప్పటికే అమల్లో ఉన్న సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








