‘నమో భారత్' రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. 180 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ ట్రైన్ ప్రత్యేకతలివే.!!
దేశంలో తొలి 'నమో భారత్' రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు(అక్టోబర్ 20) ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్- దూహై డిపో మధ్య ఈ రైలు సర్వీస్ అందించనుంది.
భారతీయ రైల్వేలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్ల తర్వాత తొలిసారి ర్యాపిడ్ ఎక్స్ సెమీ హై స్పీడ్ రైళ్లు పట్టాలెక్కాయి. ఈ రైలును ప్రధాని మోదీ నేడు ప్రారంభించారు. సాహిబాబాద్, దూహే డిపో మధ్య 17 కి.మీ కారిడార్లో ప్రయాణించే రైలును మోదీ పచ్చా జెండా ఊపి ప్రారంభించారు.

RAPIDX సెమీ హై స్పీడ్ రైలు(నమో భారత్)ను ప్రారంభించిన అనంతరం మోదీ ఆ రైలులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. మోదీ రైల్లో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ఈ RRTS(Regional Rapid Transit System) రైలు సర్వీసు గురించి ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.
యూపీలోని సాహిబాబాద్, దూహై డిపోల మధ్య మొత్తం 17 కి.మీ ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS కారిడార్లో ప్రయాణించే రైలును ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. దీనిని జాతికి అంకితం చేశారు. కాగా మొత్తం 82.15 కి.మీ RRTS కారిడార్ను జూన్ 2025 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.

అక్టోబర్ 21 నుంచి నమో భారత్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ RRTS రైళ్లను 'నమో భారత్'గా పిలవాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. కాగా ఇంతకుముందు ఈ రైళ్లకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) 'RAPIDX' అని నామకరణం చేసింది.
కేంద్ర ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ RRTS రైళ్లలో హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. ఒక్కో రైలులో ప్రీమియం కోచ్తో సహా ఆరు కోచ్లు ఉంటాయి. ప్రీమియం కోచ్కు ఆనుకుని మహిళల కోసం ఒక కోచ్ను ప్రత్యేకంగా కేటాయించారు. ఇంకా ఇతర కోచ్లలో మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా సీట్లు రిజర్వ్ చేశారు.
ఇక ప్రీమియం కోచ్ల విషయానికొస్తే ఈ కోచ్లలో సీట్లు వేర్వేరు రంగు కోడ్లతో ఉంటాయి. భవిష్యత్తులో వీటిలో వెండింగ్ మెషీన్ను ఇన్స్టాల్ చేసే విధంగా రూపొందించారు. ఇంకా రిక్లైనింగ్ సీట్లు, కోట్ హుక్స్, మ్యాగజైన్ హోల్డర్లు మరియు ఫుట్రెస్ట్లు వంటి అధునాతన ఫీచర్లను ప్రవేశపెట్టారు.
ఇంకా ఎవరైనా అనారోగ్యం బారిన పడినా, లేదంటే వృద్ధులు, వికలాంగుల కోసం ప్రతి రైలులో ఒక సాధారణ కోచ్లో మెడికల్ స్ట్రెచర్, వీల్ ఛైర్ కోసం స్థలం కేటాయించారు. రైళ్లలో సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ మెకానిజం, కమ్యూనికేట్ చేసేందుకు బటన్ను ఇలా సేఫ్టీ ఫీచర్లను చేర్చారు. ఇంకా ప్లాట్ఫారమ్ స్క్రీన్ డోర్లు (PSDలు) మరో ప్రత్యేకత.
ఈ రైలు డోర్లపై పుష్ బటన్ ఉంటుంది. స్టేషన్లో రైలు ఆగిన తర్వాత ఈ పుష్ బటన్ యాక్టివేట్ అవుతుంది. కాగా సాహిబాబాద్- దూహై డిపోల మధ్య ఐదు స్టేషన్లు ఉన్నాయి. సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధార్, దూహై, దూహై డిపో. ఛార్జీల విషయానికొస్తే స్టాండర్డ్ క్లాస్కు ఛార్జీ రూ. 50 కాగా.. ప్రీమియం క్లాస్ టికెట్ రూ. 100.
ఈ RAPIDX రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. ప్రతి 15 నిమిషాలకు రైలు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైళ్లు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 180 కి.మీ వేగంతో నమో భారత్ రైలు దూసుకెళ్తుంది. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్గా ఈ రైళ్లను రూపొందించారు.


Click it and Unblock the Notifications








