అయోధ్య రైల్వే స్టేషన్, అమృత్ భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఏపీలో ఈ స్టేషన్ల మీదుగానే.!!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం(డిసెంబర్ 30) అమృత్ భారత్ రైళ్లతో పాటు పలు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. త్వరలో రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలో పునర్నిర్మించిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం అమృత్ భారత్ రైలుకు పచ్చజెండా ఊపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత్లో మరో కొత్త రైలు సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వందే భారత్ రైళ్లకు స్లీపర్ వెర్షన్లో అమృత్ భారత్(Amrit Bharat Train) రైలు సర్వీస్ను శనివారం.. ప్రధాని మోదీ అయోధ్య వేదికగా ప్రారంభించారు. ఈ రైలులో కాసేపు ప్రయాణించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు.

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని అయోధ్య రైల్వే స్టేషన్ను అధునాతన హంగులతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. సుమారు రూ. 240 కోట్ల ఖర్చుతో ఈ స్టేషన్ను పునర్నిర్మించారు. మూడు అంతస్థుల్లో ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ సరికొత్తగా తీర్చిదిద్దారు. ఈ రైల్వే స్టేషన్కు 'అయోధ్య ధామ్ జంక్షన్(Ayodhya Dham Junction)'గా మోదీ నామకరణం చేశారు.
ప్రధాని మోదీ(PM Modi) అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రారంభించిన అనంతరం అమృత్ భారత్ రైలును ప్రారంభించారు. మొత్తంగా ఆయన రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందే భారత్ రైళ్ల(Vande Bharat Trains)ను ప్రారంభించారు. కొత్త రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. కాగా అమృత్ భారత్ రైళ్లలో ఒకటి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి అయోధ్య మీదుగా బీహార్లోని దర్బంగా వరకు ప్రయాణిస్తుంది.

మరో అమృత్ భారత్ రైలు వెస్ట్ బెంగాల్లోని మాల్దా టౌన్ నుంచి బెంగళూరులోని ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ మీదుగా సేవలందిస్తుంది. అయితే ఈ రైలు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. అయితే ఏయే స్టేషన్లలో ఆగుతుందనే ఖచ్చితమైన సమాచారంపై స్పష్టత లేదు.
కాగా ఈ సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు అమృత్ భారత్ ట్రైన్లో 22 కోచ్లు ఉంటాయి. వీటిలో 12 నాన్ ఏసీ స్లీపర్ క్లాస్లు కాగా, 8 జనరల్ అన్రిజర్వ్డ్ కోచ్లు ఉన్నాయి. రెండు గార్డ్ కంపార్ట్మెంట్లు ఉండగా.. వీటిలో కొంత భాగాన్ని మహిళలకు, దివ్యాంగులకు కేటాయించారు.

అమృత్ భారత్ నాన్ ఏసీ పుష్- పుల్ రైలు. దీనికి ముందూవెనుక ఇంజిన్లు ఉంటాయి. ఈ కారణంగా ఈ రైలు తక్కువ సమయంలోనే వేగాన్ని అందుకుంటుంది. దీని వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. ఈ రైళ్లు గరిష్ఠంగా గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రైళ్లలో సౌకర్యవంతమైన సీట్లు, లగేజీ రాక్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లతో పాటు ఇతర అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
ఈ రైళ్లలో 50 కి.మీ లోపు దూరానికి కనీస టికెట్ ధర రూ. 35 గా రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇతర మెయిల్, ఎక్స్ప్రెస్ల కంటే ఈ టికెట్ ఛార్జీలు 15 నుంచి 17 శాతం ఎక్కువ. అయితే వీటికి రిజర్వేషన్ ఫీజు, ఇతర ఛార్జీలు అదనంగా ఉంటాయని రైల్వే బోర్డు తెలిపింది. కాగా ఏసీ తరగతుల టికెట్ ఛార్జీలను ఇంకా ప్రకటించలేదు.

కాగా అయోధ్య రైల్వే స్టేషన్ను శ్రీరాముడి స్ఫూర్తి ప్రతిబింబించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. శిఖరం, విల్లు బాణంతో పలు కట్టడాలను ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా నిర్మించారు. 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు ఎత్తైన గోపురాలతో ఈ రైల్వే స్టేషన్ను పునర్నిర్మించారు. ఫుడ్ ప్లాజాలు, పూజా సామాగ్రి షాపులు, చైల్డ్ కేర్ రూమ్లు, వెయిటింగ్ హాల్స్, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, క్లోక్ రూమ్లను ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications








