దేశంలోనే అతి పొడవైన వంతెన 'అటల్ సేతు'ను ప్రారంభించిన మోదీ.. ఈ బ్రిడ్జిలో ఏ టెక్నాలజీ ఉపయోగించారో తెలుసా.??
దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన 'అటల్ సేతు'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబయిలో రూ. 17,840 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను జనవరి 12 న శుక్రవారం ఆయన ప్రారంభోత్సవం చేశారు. దీనిని ముంబయి ట్రాన్స్హార్బర్ లింక్(Mumbai Trans Harbour Link) అని పిలుస్తారు.
ముంబయిలో అటల్ సేతును ప్రారంభించిన మోదీ.. ఈ బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. భూకంపాలను సైతం తట్టుకునేలా దీని నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికను ఉపయోగించారు. ఈ వంతెన ద్వారా కేవలం 20 నిమిషాల్లో ముంబయి నుంచి నవీ ముంబయికి చేరుకోవచ్చు. ఈ వంతెన గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో..

2016 డిసెంబర్లో సముద్రపు వంతెనకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi Inaugurates Atal Setu Bridge) శంకుస్థాపన చేశారు. భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన కృషికి గౌరవసూచకంగా ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేశారు. ఇది దేశంలోనే అత్యంత పొడవైన వంతెన.
ఈ ముంబయి ట్రాన్స్హార్బర్ లింక్ (Atal Setu Bridge) రాయగడ జిల్లాలోని సెవ్రి మరియు నవా షెవా ప్రాంతాలను కలుపుతుంది. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం.. 2 గంటలు ఉండేది. వంతెన నిర్మాణంతో 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇది మహారాష్ట్రలోని రెండు అతిపెద్ద నగరాలను కలిపే ముంబయి- పుణే ఎక్స్ప్రెస్వేకి కూడా అనుసంధానించబడి ఉంది.

అంతే కాకుండా అటల్ సేతు బ్రిడ్డి.. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుందని అధికారులు తెలిపారు. కాగా ముంబయి నుంచి గోవాతో సహా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి కూడా ఈ బ్రిడ్జి లాభదాయకంగా ఉంటుంది.
అటల్ సేతు బ్రిడ్జి 22 కి.మీ పొడవు, 6 లేన్ల రహదారిని కలిగి ఉండగా.. సముద్రం పైన 16.50 కిలోమీటర్ల, భూభాగంపై 5.50 కి.మీ నిర్మించారు. అయితే ముంబయి ట్రాన్స్హార్బర్ లింక్ (అటల్ సేతు) మీదుగా ప్రయాణించే వాహనాలకు స్పీడ్ లిమిట్ను నిర్దేశించారు.
కార్లు, టాక్సీలు, తేలికపాటి మోటారు వాహనాలు, మినీ బస్సులు, 2 యాక్సిల్ బస్సులు ఈ వంతెనపై గరిష్ఠంగా గంటకు 100 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణించాలి. కాగా వంతెన ప్రారంభంలో మరియు చివరిలో వాహనాల వేగ పరిమితి గంటకు 40 కి.మీగా నిర్ణయించారు.

కాగా ప్రమాదాల నివారణను దృష్టిలో ఉంచుకుని ఈ వంతెనపై బైక్లు, స్కూటర్లు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్లు వెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు సమాచారం. ఈ వంతెన మీదుగా రోజుకు 70 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జిపై వాహనాలు చెడిపోవడం వల్ల జరిగే ప్రమాదాన్ని నివారించేందుకు కృత్రిమ మేధ (Artificial Intelligence) కెమెరాలను అమర్చినట్లు తెలుస్తోంది.
ఈ బ్రిడ్జిపై సౌండ్, వైబ్రేషన్లను తగ్గించడానికి, సముద్ర జీవులను రక్షించడానికి రివర్స్ సర్క్యులేషన్ రిగ్స్(Reverse Circulation Rigs) టెక్నాలజీని ఉపయోగించారు. ఇంకా నాయిస్ సైలెన్సర్లు, శబ్ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ టెక్నాలజీ పనిచేయనుంది. వంతెనపై లైటింగ్ సిస్టమ్ ద్వారా జల పర్యావరణానికి అంతరాయం కలగకుండా ఎకో ఫ్రెండ్లీ లైటింగ్(Eco Friendly Lighting) సిస్టమ్ను ఏర్పాటు చేశారు.
అటల్ సేతు వంతెనపై ప్రయాణించే వాహనాల డ్రైవర్లకు సమాచారాన్ని అందించడానికి బ్రిడ్జిపై నిర్దిష్ట వ్యవధిలో డిస్ప్లేలను అమర్చారు. తద్వారా వారు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్లు, ఇంకా ప్రమాదాల గురించి సమాచారం అందిస్తుంది. కాగా ఈ వంతెనపై ప్రయాణించే వాహనాలకు నిర్దిష్ట ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కార్లకు రూ.250, మినీ బస్సులకు రూ.560, బస్సులు, 2-యాక్సిల్ ట్రక్కులకు రూ.1180, 3-యాక్సిల్ ట్రక్కులకు రూ.1290గా ప్రభుత్వం నిర్ణయించింది. 4-6 యాక్సిల్ వాహనాలకు రూ.1850 వసూలు చేయనున్నారు. ప్రారంభంలో, కార్లకు రూ.500 టోల్ వసూలు చేయాలని మహారాష్ట్ర మెట్రోపాలిటన్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదించింది.


Click it and Unblock the Notifications








