Amrit Bharat Train: ఈ నెల 30 న ‘అమృత్ భారత్ రైలు' ప్రారంభం.. కొత్త ఫీచర్లు అదరహో, వీడియో షేర్ చేసిన మంత్రి
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువస్తున్న 'అమృత్ భారత్' రైలు త్వరలో పట్టాలెక్కనుంది. ఈ మేరకు అమృత్ భారత్ రైలు(Amrit Bharat Train)కు సంబంధించిన తొలి వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ షేర్ చేశారు. అందులో కల్పిస్తున్న అధునాతన సౌకర్యాల గురించి ఆయన వివరించారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..
అమృత్ భారత్ రైలు ఈ(డిసెంబర్) నెల 30న ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో 'అమృత్ భారత్' రైలులోని సౌకర్యాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోను తన X(గతంలో ట్విట్టర్)లో షేర్ చేశారు. 'అమృత్ కాల్ కి అమృత్ భారత్ ట్రైన్' అని మంత్రి ఎక్స్లో పేర్కొన్నారు.

హై స్పీడ్ వందే భారత్ రైళ్లకు స్లీపర్ వెర్షన్గా వస్తున్న ఈ రైళ్లకు అమృత్ భారత్ రైళ్లుగా కేంద్రం నామకరణం చేసింది. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. అమృత్ భారత్ రైలులోని లోకో పైలట్ క్యాబిన్తో పాటు ఇతర సౌకర్యాలను ఆయన పరిశీలిస్తూ స్వయంగా ఆయన వివరించారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్ తరహాలోనే వేగంగా ప్రయాణించే ఈ రైలులో రాత్రి వేళ పడుకునే సౌకర్యంతోపాటు ఇంకా అనేక ప్రత్యేకతలను రైల్వే మంత్రి వీడియోలో వివరించారు. లోకో పైలట్ క్యాబిన్, ట్రైన్లోని సౌకర్యవంతమైన సీట్లు, టాయిలెట్లు, ఇతర సౌకర్యాల గురించి ఆయన వెల్లడించారు.

అమృత్ భారత్ రైళ్లను అధునాతన సాంకేతికతతో రూపొందించడంతో.. ఈ రైలులో ప్రయాణించడం ద్వారా సుమారు రెండు గంటల సమయం ఆదా అవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అంతేకాకుండా అమృత్ భారత్ ట్రైన్ పుష్-పుల్(Push- Pull Technology) టెక్నాలజీ కలిగి ఉందని తెలిపారు. ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్తో పాటు, వికలాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు ఉన్నాయన్నారు.
వీటితో పాటు ప్రయాణికులు తక్కువ నీరు వినియోగించేలా టెక్నాలజీ, విశాలమైన తలుపులతో పాటు ప్రత్యేక ర్యాంప్ సౌకర్యం వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయని మంత్రి వైష్ణవ్ తెలిపారు. అమృత్ భారత్ రైలు ఇంజన్లలో మొత్తం కొత్త టెక్నాలజీనే ఉపయోగించినట్లు చెప్పారు. వందే భారత్ మాదిరిగానే, అమృత్ భారత్ రైలులో కూడా సంపూర్ణ లోకోమోటివ్ క్యాబ్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అమృత్ భారత్ ట్రైన్ను మొదటగా అయోధ్య నుంచి దర్భంగా వరకు ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ట్రైన్లో సాధారణ తరగతి నుంచి సెకండ్ క్లాస్ ఏసీ వరకు బోగీలుంటాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను అయోధ్య వేదికగా డిసెంబర్ 30న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఎక్కువ దూరాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లక్ష్యం. ఇందులో ఏసీ, నాన్- ఏసీ పుష్- పుల్ టెక్నాలజీలు ఉంటాయి. అంతే కాకుండా.. ముందూ వెనుక ఇంజిన్లు ఉంటాయి. ఈ రైలు గంటకు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

కాగా అమృత్ భారత్ రైలులో ఒకేసారి 1800 మంది వరకు ప్రయాణించేలా సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైల్వే లైన్లు 800 కి.మీ.కుపైగా దూరంగా ఉన్న నగరాల్ని కలుపుతూ ప్రయాణికులకు సేవలందిస్తాయి. అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఉండే వైఫై సేవలు, ఆటోమేటిక్ డోర్స్, కదిలే సీట్లు, ఆన్బోర్డ్ క్యాటరింగ్ వంటి సౌకర్యాలను కల్పించడం లేదు.


Click it and Unblock the Notifications








