Gaganyaan గగన్యాన్ వ్యోమగాములు వీళ్లే.. ఆ నలుగురి పేర్లు ప్రకటించిన ప్రధాని మోదీ
గగన్యాన్(Gaganyaan) ప్రాజెక్ట్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మానవసహిత అంతరిక్ష యాత్ర పేరిట త్వరలో ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ఈ మిషన్ను చేపట్టనుంది. ఈ క్రమంలో ఈ మిషన్లో పాల్గొనే ఆస్ట్రోనాట్స్ను కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని పరిచయం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత అంతరిక్ష రంగంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1 సక్సెస్ల తర్వాత ఇస్రో(Indian Space Research Organisation) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మరో మిషన్ మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్(Gaganyaan). ఈ మిషన్ కోసం ఇస్రో నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసింది. ఈ నలుగురూ గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి ప్రయాణించనున్నారు.

కేరళలోని తిరువనంతపురం(Gaganyaan Astronauts)లో జరిగిన ఓ కార్యక్రమంలో వారి పేర్లను ప్రధాని మోదీ ప్రకటించి.. దేశానికి పరిచయం చేశారు. వారిని స్టాండింగ్ ఒవేషన్తో సత్కరించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా గగన్యాన్లో పాల్గొననున్నారు.
భారత గడ్డపై నుంచి స్వదేశీ స్పేస్క్రాఫ్ట్(వ్యోమనౌక) ద్వారా రోదసీలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా ఈ నలుగురూ నిలవనున్నారు. ఈ మేరకు ఈ నలుగురు కెప్టెన్లను దేశానికి పరిచయం చేస్తూ ప్రధాని మోదీ ప్రసంగించారు. త్వరలో విక్రమ్ సారాభాయ్ స్సేస్ సెంటర్ నుంచి మరో చారిత్రక ప్రయాణాన్ని వీక్షించనున్నామని మోదీ అన్నారు. ఇవి నాలుగు పేర్లు కాదు.. నాలుగు శక్తులని.. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చనున్నారని కొనియాడారు.

40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడని ప్రధాని మోదీ(PM Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ సారి కౌంట్ డౌన్ మనదే.. రాకెట్ మనదే అని ప్రధాని వెల్లడించారు. త్వరలోనే భారత్.. ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమయంలో గగన్యాన్ ద్వారా భారత అంతరిక్ష రంగం సరికొత్త శిఖరాలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత అంతరిక్ష రంగంలో మహిళా శాస్త్రవేత్తల పాత్ర కీలకమని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. చంద్రయాన్, గగన్యాన్ మిషన్లలో వారి కృషి ఎంతో ఉందన్నారు. కాగా గతంలో భారత్ తరపున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రాకేశ్ శర్మ రికార్డు సృష్టించగా.. ఆయన రష్యా ప్రయోగ కేంద్రం నుంచి వ్యోమనౌకలో వెళ్లారు.
త్వరలో గగన్యాన్ మిషన్లో భాగంగా(Gaganyaan Mission Astronauts Names,) రోదసీలోకి వెళ్లనున్న ఈ వ్యోమగాముల బృందం కొద్దికాలం రష్యాలో శిక్షణ తీసుకున్నారు. ఇస్రోతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ వారికి శిక్షణనిచ్చింది. కాగా ప్రస్తుతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఈ నలుగురు కెప్టెన్లు ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
2025 లో గగన్యాన్ మిషన్ ప్రారంభం కానుంది. వారిని అంతరిక్షంలోకి పంపి మూడు రోజుల తర్వాత భూమికి తీసుకురావడం ఈ మిషన్లో కీలకం అని గతంలో ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ప్రాజెక్టు సమయంలో ఎలాంటి అస్వస్థత కలగకుండా శారీరక ధృడత్వంతో పాటు సాంకేతిక విభాగాల్లో వారు పట్టు సాధించారు.
గగన్యాన్ 3 రోజుల మిషన్లో భాగంగా వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెడతారు. దీని ద్వారా భారతదేశ మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని ఇస్రో ప్రపంచానికి చాటి చెప్పనుంది. మూడు రోజుల తర్వాత భారత సముద్ర జలాల్లో ల్యాండింగ్తో వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకువస్తారు.


Click it and Unblock the Notifications








