యుద్ధ సైనికుడిలా ‘తేజస్'లో ప్రయాణించిన ప్రధాని మోదీ.. గర్వంగా ఉందంటూ ట్వీట్.!!
ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. భారత సైన్యంలో కీలకంగా ఉన్న ఈ యుద్ధ విమానంలో మోదీ ఆర్మీ డ్రెస్లో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అంతే కాకుండా భారత రక్షణ ప్రమాణాలను ప్రపంచానికి చాటిచెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, తన అనుభవాన్ని తన X(గతంలో ట్విట్టర్)లో పంచుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అత్యాధునిక సాంకేతికత, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన సరికొత్త యుద్ధ విమానాలతో భారత సైన్యం ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని శక్తిగా మారుతోంది. ఇటీవల సైన్యం కోసం తేజస్ విమానాలను కొనుగోలు చేసిన భారత ప్రభుత్వం.. త్వరలో Su-30MKI యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. ఈ యుద్ధ విమానాలను సుఖోయ్ సహాయంతో భారతదేశంలో తయారు చేయబోతోంది.

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi Tejas Fighter Jet) తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించి భారత్ దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(HAL)ను మోదీ సందర్శించారు. అక్కడ ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని యుద్ధ విమానంలో ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. యుద్ధ విమానంలో ప్రయాణ అనుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. తన X (ట్విట్టర్) పోస్ట్లో, "తేజస్(Tejas Fighter Jet)లో విమానయానం చాలా అద్భుతంగా ఉంది. ఈ విమానయానం ద్వారా స్వదేశీ సామర్థ్యాలపై నా విశ్వాసాన్ని గణనీయంగా పెంచింది. మన దేశ సామర్థ్యంపై గర్వంగా ఉంది' అని పేర్కొన్నారు.

తేజస్ యుద్ధ విమానంలో గగనతలంలో మోదీ(Narendra Modi) ప్రయాణిస్తూ.. చేతులు ఊపుతూ అక్కడున్న వారికి అభివాదం చేశారు. ప్రధానితో పాటు ఏరోనాటికల్ సంస్థకు చెందిన పలువురు సిబ్బంది కూడా ప్రయాణించారు. లైట్ గ్రీన్ కలర్ డ్రెస్, కళ్లకు నల్లటి కూలింగ్ గ్లాసెస్ ధరించి చేతిలో హెల్మెట్తో ఈ ఫొటోస్తో చాలా స్టైలిష్గా కనిపించారు మోదీ.
కాగా తేజస్ యుద్ధ విమానం విషయానికొస్తే.. ఇది సింగిల్-సీట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. కానీ ప్రధాని కోసం పర్యటనలో తేజస్ విమానంలో 2-సీటర్ ట్రైనర్ వేరియంట్ను ఉపయోగించారు. తేజస్ ఫైటర్లోని ఈ వేరియంట్ కూడా వైమానిక దళం కంట్రోల్లోనే పనిచేస్తుంది. అయితే ఈ రకమైన తేజస్ యుద్ధ విమానాలను శిక్షణ సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

భారత వైమానిక దళంలోనే కాకుండా నౌకాదళంలోనూ 2-సీటర్ తేజస్ యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నారు. 4.5-తరాలకు చెందిన తేజస్ అనేది భారత సైన్యంతో సేవలో ఉన్న తేలికపాటి & కాంపాక్ట్ యుద్ధ విమానం. అంతే కాకుండా తేజస్ యుద్ధ విమానం మల్టీ రోల్ ఫైటర్.

తేజస్ యుద్ధ విమానం పరిమాణంలో చిన్నదిగా ఉండటం, బరువు తక్కువగా ఉండటం వల్ల.. ఏ అవసరానికైనా వీటిని సులభంగా అమర్చవచ్చు. అయితే, తేజస్ యుద్ధ విమానాలను భారత సైన్యం యుద్ధ సమయంలో ఎయిర్ సపోర్ట్ మరియు గ్రౌండ్ అటాక్ ఆపరేషన్ల కోసం మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

అద్భుతమైన భద్రతా ఫీచర్లతో రూపొందిన తేజస్ యుద్ధ విమానాలు ఎటువంటి ప్రమాదాలు లేకుండా సులభంగా ఆకాశంలో ప్రయాణిస్తాయి. కాగా ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద 40 తేజస్ MK-1 విమానాలు, 83 తేజస్ MK-1A యుద్ధ విమానాలు ఉన్నాయి. మొత్తం రూ.36,468 కోట్ల పెట్టుబడితో వీటిని భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది.



Click it and Unblock the Notifications








