జోరువానలో నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. జేసీబీ సాయంతో వాగు దాటించిన గ్రామస్థులు
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు కాలువలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించి ఇళ్లలోకి వరదనీరు చేరడమే కాకుండా.. కొన్ని ఊళ్లు మునిగిపోయాయి. తాజాగా తెలంగాణలో ఓ మహిళ ప్రసవ వేదనకు గురైంది. వరద ప్రవాహంలో నిండు గర్భిణిని జేసీబీ ద్వారా ఆస్పత్రికి తరలించారు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాజలింగంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వైపు జిల్లాలో ఎడతెరిపి లేని వాన కురవడంతో రోడ్లన్నీ నదిని తలపిస్తున్నాయి. బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు మొదల్యయాయి. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు సమీపంలోని కోరుట్ల ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.

అయితే భారీ వర్షం కారణంగా గ్రామ సమీపంలోని రోడ్డు జలమయమైంది. రోడ్డుపై వరదలా నీరు ప్రవహించడంతో రహదారి దాటే అవకాశం లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. తమ బిడ్డను రోడ్డు దాటించి ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లాలా అని ఆవేదన చెందుతున్నారు.
అనంతరం గ్రామ సర్పంచ్ను సంప్రదించి పరిస్థితి విన్నవించారు. రోడ్డుపై వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సర్పంచ్ జేసీబీ ద్వారా గర్భిణీని ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. అనంతరం జేసీబీ సాయంతో రోడ్డు దాటారు. రోడ్డు దాటిన తర్వాత, అవతలివైపున అంబులెన్స్ సిద్ధంగా ఉండటంతో ఆమెను కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద ఉద్ధృతికి కొందరు గల్లంతయ్యారు. అంతేకాకుండా వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. రోడ్లపై భారీ వరదల్లో లగ్జరీ కార్లు నీట మునగడంతో వాటి మరమ్మతులకు రూ. లక్షల్లో ఖర్చు అవుతోంది.
వర్షాకాలంలో డ్రైవింగ్ చేయడం అనేది సవాలుతో కూడుకున్న పని. అంతేకాకుండా ప్రమాదకరం కూడా. వర్షాలకు రోడ్లు సరిగా కనిపించకపోవడం, తడి రోడ్లు, వరద నీరు ప్రవహిస్తున్న రోడ్లపై డ్రైవింగ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. కాబట్టి, వర్షాకాలంలో వాహనం సురక్షితంగా నడపడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
రోడ్డుపై నీటి లోతును అంచనా వేయడం కష్టం కాబట్టి, వరదలు ఉన్న రోడ్లపై ప్రయాణం చేయకపోవడం ఉత్తమం. మీ కారును వరదలు ఉన్న రోడ్డుపై పార్క్ చేసినట్లయితే ఇంజిన్ను పునరుద్ధరించడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే నీరు ఇంజిన్లోకి ప్రవేశించి తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఏదైనా సమస్య ఏర్పడితే మరమ్మతుకు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఒకవేళ వరద ప్రవాహం ఉన్న రహదారిపై ప్రయాణించాల్సి వస్తే.. స్లోగా వెళ్లాలి. మీరు వేగాన్ని తగ్గించినప్పుడు కూడా మీ పాదాలను యాక్సిలరేటర్ పెడల్పై ఉంచాలి. మరికొందరికి రోడ్డుపై నీరు కనిపిస్తే, స్పీడ్ వెళ్లడం ద్వారా థ్రిల్గా అనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా కారు అడుగున ఎక్కువ దుమ్ము చేరే అవకాశం ఉంది.
అంతే కాకుండా వర్షాకాలంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్ బ్రేక్ వేయకండి. ఇలా సడన్గా బ్రేక్ వేసినప్పుడు వెనుక నుంచి వచ్చే వాహనం మీ కారును ఢీకొట్టే అవకాశాలున్నాయి. ఇంకా నీరు ఉంటే, ఎగ్జాస్ట్ పైపు ద్వారా నీరు ఇంజిన్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. సడన్ బ్రేక్ వేస్తే కారు బోల్తా పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో కారు జారే అవకాశమూ ఎక్కువగా ఉంటుంది.
వర్షాకాలంలో ఎక్కువగా తెలియని రోడ్లపై ప్రయాణించవద్దు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం మరియు వరదలు ఎక్కువగా సంభవిస్తాయి. అలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండండి. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో వెళ్లడం చాలా ప్రమాదకరం. ఎంత అనుభవం ఉన్న డ్రైవర్ అయినా వర్షంలో నిదానంగా నడపడం మంచిది.


Click it and Unblock the Notifications








