స్కూల్లో సదుపాయాలు లేవంటూ విద్యార్థినుల నిరసన.. ఏకంగా విద్యాధికారి కారు అద్దాలు ధ్వంసం చేసిన బాలికలు
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నేటికీ విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేని పరిస్థితి ఉంది. అరకొర సౌకర్యాలతో పలు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉందనే చెప్పవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో నాడు- నేడు, మన బడి కార్యక్రమాల ద్వారా వాటిని మోడిఫై చేస్తున్నారు.
కాగా ఇటీవల, బీహార్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడం.. ఆ పాఠశాలకు చెందిన బాలికల నిరసకు దారి తీసింది. ఇది తీవ్రరూపం దాల్చి.. విద్యాశాఖకు చెందిన అధికారి కారును బాలికలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఘటనకు సంబంధించిన వీడియోను X ( Twitter)లో PTI షేర్ చేసింది. ఈ సంఘటన బీహార్లోని వైశాలి జిల్లా మహనార్లో చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం మహనార్ ప్రభుత్వ పాఠశాలలో కుర్చీలు, స్థలంతో పాటు సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థినులు నిరసన చేపట్టారు. విద్యార్థులపై మహిళా పోలీసు అధికారి దాడి చేయడంతో నిరసన హింసాత్మకంగా మారినట్లు సమచారం.
వీడియోలో స్కూల్ యూనిఫాంలో ఉన్న బాలికల గుంపు మహీంద్రా స్కార్పియో SUVని ధ్వంసం చేయడాన్ని స్పష్టంగా చూడవచ్చు. అధికారుల తీరుకు నిరసనగా బాలికలు కర్రలు పట్టుకుని కారును ధ్వంసం చేసేందుకు యత్నించారు. అంతే కాకుండా కారు ముందు నిలబడిన వారిలో ఒకరు బండరాయిని తీసుకుని మహీంద్రా స్కార్పియో ముందు భాగంలో విండ్షీల్డ్పైకి విసిరారు.

బాలికల దాడిలో కారు విండ్షీల్డ్ దెబ్బతినడాన్ని వీడియోలో చూడవచ్చు. ఇంకా విద్యార్థినులు చేతికి అందినవాటితో కారుపై దాడికి పాల్పడ్డారు. కాగా ఈ దృశ్యాన్ని అక్కడున్న స్థానికులు చోద్యంలా చూస్తున్నారు తప్ప వారిని అడ్డుకోవడం లేదు. కాగా ఘటనా స్థలంలో పోలీసు అధికారులు లేకపోవడం గమనార్హం. బాలికల ఆరోపణల ఆధారంగా వారి పట్ల అనుచితంగా ప్రవర్తించిన మహిళా పోలీసు అధికారి తనకు బాగా లేదని, తన ఆరోగ్యం క్షీణిస్తోందని పేర్కొంది.
తమ పాఠశాలలో మౌలిక సౌకర్యాల కొరతతో మదన్ చౌక్, పటేల్ చౌక్ సమీపంలోని మహనార్ మొహియుద్దినగర్ ప్రధాన రహదారిని విద్యార్థినులు పూర్తిగా దిగ్బంధించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా ఈ ఘటనపై విద్యాశాఖ అధికారి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ప్రస్తుతం బాలికలపైనా, వారిపై దాడికి పాల్పడిన మహిళా పోలీసు అధికారిపైనా చర్యలు తీసుకున్నారా లేదా అనేది స్పష్టంగా తెలియదు. కాగా సోషల్ మీడియాలో ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు విద్యార్థినులు ప్రతిస్పందించిన తీరును సమర్థించగా.. మరికొందరు ఇది హింసాత్మక ప్రదర్శన అని. కారు విధ్వంసానికి పాల్పడాల్సింది కాదని కామెంట్ చేశారు.
విద్యాశాఖ అధికారి కారుపై బాలికల చర్య ద్వారా ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వస్తుందని ఆశిద్దామని ఓ నెటిజన్ కామెంట్లో పేర్కొన్నారు. మరొకరు నిరసన చేపట్టడానికి ఇది సరైన మార్గం కాదు. నిజమైన విద్య ఇలాంటి పనులు చేయమని బోధించదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అహింసా పద్ధతిలో సమస్యను ఎలా పరిష్కరించాలో విద్య నేర్పుతుందని నెటిజన్ పేర్కొన్నారు.
ఘటనకు పాల్పడిన వారిలో చాలా మంది బాలికలు మైనర్లు కావడంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదో తెలియదు. ఈ విషయంపై అధికారులు కూలంకషంగా చర్చించి పాఠశాలలో ఈ విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని ఆశిద్దాం. కాగా ప్రభుత్వంపైనా, అధికార యంత్రాంగంపైనా ఇలాంటి నిరసనలు జరగడం ఇదే మొదటిసారి కాదు.
కొన్నేళ్ల క్రితం, ఉత్తరాఖండ్ నుంచి యమహా రే జెడ్ ఆటోమేటిక్ స్కూటర్ను యువకులు 8 కిలోమీటర్ల మేర తమ భుజాలపై మోసుకెళ్లిన వీడియో వైరల్గా మారింది. వారు ఉండే ప్రాంతంలో సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా ఇలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








