తల్లికి అదిరిపోయే గిఫ్ట్ అందించిన రాశి ఖన్నా: ఖరీదు రూ. 1.40 కోట్లకు పైమాటే..!!
ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారాన్ని 'అంతర్జాతీయ మాతృ దినోత్సవం'గా జరుపుకోవడం చాలా దేశాల్లో ఆనవాయితీ. మన దేశంలో కూడా ఈ రోజును చాలా వేడుకగా జరుపుకుంటారు. ఈ భూమి మీద తల్లిని మించిన దైవం లేదు అంటారు. ఈ మాట అక్షర సత్యం.
మాతృ దినోత్సవం రోజున చాలామంది తమ తల్లులకు అదిరిపోయే గిఫ్ట్స్ అందించి చాలా సంతోషాన్ని కలిగిస్తారు. ఇందులో భాగంగానే ప్రముఖ నటి 'రాశి ఖన్నా' (Raashii Khanna) తన తల్లికి చాలా ఖరీదైన గిఫ్ట్ అందించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు, అంతర్జాతీయ మాతృ దినోత్సవం రోజున తన తల్లికి ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వడానికి స్వస్థలానికి వెళ్లి తన తల్లికి లగ్జరీ బహుమతిని అందజేసి చాలా ఆశ్చర్యపరిచింది. రాశి ఖన్నా జర్మన్ బ్రాండ్ అయిన 'బిఎండబ్ల్యు 740ఎల్ఐ' (BMW 740li) కారును కొనుగోలు చేసి తల్లికి గిఫ్ట్ గా ఇచ్చింది. రాశి ఖన్నా కొనుగోలు చేసిన ఈ కారు ధర అక్షరాలా రూ. 1.40 కోట్లకు పైమాటే.

బిఎండబ్ల్యు కారును కొనుగోలు చేసి తన తల్లికి ఇవ్వడానికి సంబందించిన ఫోటోలను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇంత గొప్ప గిఫ్ట్ తో తన తల్లిని ఆశ్చర్యపరిచినందుకు రాశి ఖన్నా కూడా ఎంతగానో ఉప్పొంగిపోయింది. 'బిఎండబ్ల్యు 740ఎల్ఐ' అనేది బిఎండబ్ల్యు (BMW) 7 సిరీస్లో అత్యుత్తమ విలాసవంతమైన సౌకర్యాలు కలిగిన అత్యంత ప్రీమియం సెడాన్ లలో ఒకటి.

'బిఎండబ్ల్యు 740ఎల్ఐ' అనేది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి లగ్జరీ సెడాన్. ఇది చాలావరకు ఆకర్షణీయంగా కనిపించడానికి అద్భుతమైన ఇంటీరియర్ కలిగి ఉంటుంది. రాశి ఖన్నా కొనుగోలు చేసిన బిఎండబ్ల్యు కారు క్లాసిక్ బ్లూ మెటాలిక్ కలర్ లో ఉంది. ఇందులో ఇంటీరియర్ డార్క్ బ్రౌన్ కలర్లో చూడ చక్కగా ఉంది.

'బిఎండబ్ల్యు 740ఎల్ఐ' 2998 సిసి 6 సిలిండర్ ఇన్లైన్ సిలిండర్ కలిగి ఉంటుంది. ఇది 5,500 ఆర్పిఎమ్ వద్ద 335 బిహెచ్పి పవర్ మరియు 1,500 ఆర్పిఎమ్ వద్ద 450 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

బిఎండబ్ల్యు 740ఎల్ఐ సెడాన్ 6 ఎయిర్ బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్ మరియు సీట్ బెల్ట్ వార్నింగ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్దారిస్తాయి.

ఇక రాశి ఖన్నా సినీ ప్రయాణం విషయానికి వస్తే, ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీరంగంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాప్ కథానాయికల జాబితాలో చేరిపోయి చాలా బిజీగా ఉంది. ఇప్పటివరకు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న రాశి ఖన్నా, ధర్మ ప్రొడక్షన్స్ 'యోధ'తో బాలీవుడ్లో అడుగుపెట్టనుంది. రాశి ఖన్నా నటించిన ఈ 'యోధ' ఈ ఏడాది నవంబర్ 11న విడుదల కానుంది.

అంతే కాకుండా, తెలుగులో గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ సినిమాతో తెరమీదికి రాబోతోంది. అదే సమయంలో నాగ చైతన్య 'థ్యాంక్యు' సినిమాలో కూడా నటిస్తుంది. రాశి ఖన్నా ఫర్జీ అనే ప్రాజెక్ట్ తో ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద సినిమాలతో 24 గంటలూ చాలా బిజీగా గడిపేస్తోంది.


Click it and Unblock the Notifications








