కదులుతున్న వందే భారత్ రైలు ఎక్కుతూ పట్టాలపై పడబోయిన వ్యక్తి.. కాపాడిన రైల్వే పోలీసు, వైరల్ అవుతున్న వీడియో
కదులుతున్న వందేభారత్(Vande Bharat Express) రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు జారి పట్టాలపై పడిపోతుండగా.. గమనించిన ఓ రైల్వే పోలీసు అధికారి అతడి ప్రాణాలను కాపాడిన సంఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండగా.. రైల్వే పోలీసుల సాహసానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
దేశంలోని వివిధ ప్రధాన నగరాలను కలుపుతూ వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ విస్తరిస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులను వేగవంతమైన ప్రయాణంతో గమ్యస్థానానికి చేరుస్తోంది. వందే భారత్ రైళ్లలో ప్రత్యేకత ఏంటంటే.. వీటిలో ఆటోమేటిక్ డోర్లు ఉన్నాయి. అంటే మెట్రో రైళ్ల లాగానే రైలు బయల్దేరే ముందు తలుపులు వాటంతట అవే మూసుకుపోతాయి.

ఆ తర్వాత రైలులో నుంచి ఎవరూ బయటకు రాలేరు. బయటి నుంచి ఎవరూ రైలు ఎక్కలేరు. ఆ తర్వాతే రైలు ప్లాట్ ఫాం మీద నుంచి కదలడం మొదలుపెడుతుంది. అయితే ఈ విషయంపై చాలా మందికి అవగాహన లేదు. అందుకే ఓ వ్యక్తి ట్రైన్ను(Man Trying To Catch Vande Bharat Train) క్యాచ్ చేయాలనే ఉద్దేశంతో కదులుతున్న రైలు వెంట పరుగెత్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
వెస్ట్ బెంగాల్లో హౌరా-పూరీ(Howrah- Puri Vande Bharat Train) వందే భారత్ రైలు షెడ్యూల్ ప్రకారం హౌరా రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు పట్టాలపై నుంచి రైలు బయల్దేరడాన్ని తన మొబైల్లో వీడియో తీస్తున్నాడు. అదే సమయంలో రైలు ఎక్కాల్సిన ఓ ప్రయాణికుడు రైలు మిస్సయ్యాడు. సాధారణ రైళ్లలో రైలును ఎక్కేందుకు కొంతమంది పరుగెత్తి క్యాచ్ చేస్తారు.

వందే భారత్ రైలు కూడా అదే మాదిరిగా అనుకొని ఓ ప్రయాణికుడు రైలు మిస్సవడంతో క్యాచ్ చేసేందుకు దాని వెనుకాల పరిగెత్తుతాడు. ఇది గమనించిన అక్కడున్న ఓ రైల్వే పోలీసు ఒకరు అతడిని ఆపేందుకు వెనకాలే పరుగెత్తాడు. వ్యక్తి రైలును అందుకొని డోర్ తీసేందుకు యత్నిస్తుండగా ఆటోమేటిక్ డోర్లు కావడంతో అవి తెరుచుకోలేదు. దీంతో అదుపుతప్పి కిందపడిబోయాడు.
ప్లాట్ఫామ్కి వందేభారత్ రైలుకు మధ్య వ్యక్తి ఇరుక్కుపోగా.. వెంటనే వెనకాలే పరిగెత్తిన రైల్వే పోలీసు అధికారి అతడిని పట్టుకుని వెనక్కి లాగాడు. దీంతో వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. ఇదంతా వీడియో తీస్తున్న వ్యక్తి సెల్ఫోన్లో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇక్కడ రైల్వే పోలీసు కాపాడటంతో వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. లేదంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే ప్రయాణికులు ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. వందేభారత్ రైలు బయలుదేరిందంటే, రైలు తలుపులు ఆటోమేటిక్గా మూసుకుపోయినట్లు అర్థం చేసుకోవాలి. కాబట్టి కదులుతున్న వందే భారత్ రైలులో ఎక్కేందుకు ప్రయత్నించకండి. అది చాలా ప్రమాదకరం. వందే భారత్ రైలు గురించి సరైన అవగాహన లేని చాలా మంది ఇలా రైలు బయట ఇరుక్కుపోతుంటారు.
వందేభారత్ రైలును మిస్సయిన వారు ఇలా కదులుతుండగా ఎక్కేందుకు ప్రయత్నించిన వారు చాలా మంది ఉన్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీనిపై అవగాహన కల్పించేందుకు, ఆటోమేటిక్ డోర్లు ఉన్నందున వందేభారత్ రైళ్లను ఎక్కడానికి అనుమతించబోమని రైల్వే యంత్రాంగం ఎప్పటికప్పుడు నోటీసు జారీ చేయడం అవసరం.


Click it and Unblock the Notifications








