Rapido Cab Service క్యాబ్ సర్వీసులోకి ర్యాపిడో.. డ్రైవర్లకు బంపర్ ఆఫర్.. ఓలా, ఉబర్కు షాక్.!!
ప్రముఖ బైక్ టాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడో.. క్యాబ్ సర్వీసుల్లోకి ప్రవేశించింది. ఇప్పటివరకూ ప్రయాణికులకు బైక్తో పాటు ఆటో సేవలందిస్తున్న ర్యాపిడో(Rapido) ఇక నుంచి క్యాబ్ సేవలను కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మొదటి దశలో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ర్యాపిడో క్యాబ్ సేవలను ప్రారంభించింది.
మెట్రో పాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ లేదా ఇతరత్రా కారణాల దృష్ట్యా క్యాబ్ సర్వీస్ లేకుండా బయటకు వెళ్లడం కష్టం. వీటిని దృష్టిలో ఉంచుకునే కస్టమర్ల కోసం ఆన్లైన్ క్యాబ్ సర్వీసులు మొదలయ్యాయి. వీటికి ఆదరణ కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఆన్లైన్ క్యాబ్ సర్వీసులు ఉబర్, ఓలాలకు పోటీగా ర్యాపిడో కూడా క్యాబ్ సర్వీసు రంగంలోకి అడుగుపెట్టింది.

ఇప్పటివరకూ బైక్, ఆటోల ద్వారా ప్రయాణికులకు సర్వీసును అందించిన ర్యాపిడో.. ఇప్పుడు క్యాబ్(Rapido Cab Service) సర్వీసులోకి కూడా అడుగుపెట్టింది. మొదటి దశగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుల్లో నగరాల్లో క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి రాగా.. త్వరలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు సర్వీసును విస్తరిస్తామని ర్యాపిడో తెలిపింది.
కాగా ప్రస్తుతం తమ ప్లాట్ఫామ్పై లక్షా 20 వేల క్యాబ్ సేవలను ప్రారంభించినట్లు ర్యాపిడో కో ఫౌండర్ పవన్ గుంటుపల్లి తెలిపారు. 2024 నాటికి దేశవ్యాప్తంగా 35 నగరాల్లో ఈ సేవలను విస్తరిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అతి తక్కువ సమయంలో మార్కెట్ను విస్తరించడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం క్యాబ్ సర్వీసులో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్లకు ర్యాపిడో క్యాబ్ సర్వీస్తో గట్టి పోటీ ఇవ్వనుంది.

కాగా క్యాబ్ సేవల్లోకి ప్రవేశించిన ర్యాపిడో మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇది డ్రైవర్ ఫ్రెండ్లీగా ఉండనుంది. ఇప్పటివరకూ బైక్, ఆటో సర్వీస్తో డ్రైవర్ల నుంచి కమిషన్ తీసుకుంటున్న ర్యాపిడో.. క్యాబ్ డ్రైవర్లకు దాని నుంచి ఉపశమనం కలిగించనుంది. కొత్తగా క్యాబ్ మార్కెట్లోకి రావడంతో.. అత్యధిక మంది డ్రైవర్లను ఆకర్షించడమే లక్ష్యంగా జీరో కమీషన్ పాలసీని ప్రవేశపెట్టింది.
గతంలో ఉబర్ కూడా ఇలాంటి జీరో కమీషన్ పాలసీతోనే ఆన్లైన్ క్యాబ్ సర్వీస్లో టాప్లో నిలిచింది. ఆ తర్వాత ఆదాయాన్ని బట్టి డ్రైవర్లను నుంచి కమీషన్ తీసుకుంటోంది. కాగా బైక్ టాక్సీ సెగ్మెంట్లో ర్యాపిడో 60 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది.
ఈ క్రమంలో మిగతా ట్యాక్సీ అగ్రిగేటర్లు ఉపయోగించే కమిషన్ విధానం మాదిరిగా కాకుండా.. తమ క్యాబ్ సర్వీసులో డ్రైవర్ల నుంచి తక్కువ మొత్తంలో సాఫ్ట్వేర్ వినియోగ ఛార్జీలను వసూలు చేస్తామని ర్యాపిడో తెలిపింది. ఈ విధానం ద్వారా, డ్రైవర్కు ఎక్కువ మొత్తంలో ఆదాయం మిగులుతుందని వెల్లడించింది. సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా నామమాత్రంగానే వసూలు చేస్తామని తెలిపింది. అంతేకాకుండా కస్టమర్లకు కూడా 'లోయెస్ట్ ప్రైస్ గ్యారెంటీ'ని ఇస్తామని స్పష్టం చేసింది.
ర్యాపిడో ఆన్లైన్ ట్యాక్సీ సర్వీసును 2015లో ప్రారంభించారు. ఇది దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ నగరాల్లో సేవలందిస్తోంది. కాగా 2022 లో వివిధ సోర్స్ల నుంచి ర్యాపిడో 130 మిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకురాగా.. ఈ కంపెనీకి ప్రస్తుతం 2.5 కోట్ల మంది కస్టమర్లు, 15 లక్షల మంది పార్ట్నర్ డ్రైవర్లు ఉన్నారు.


Click it and Unblock the Notifications








