వర్షంలో బైక్పై ప్రయాణ కష్టాలను చూసి రూ.లక్షకే టాటా నానో కారును తెచ్చిన మహనీయుడు
భారతదేశంలో సామాన్య పేద, మధ్య తరగతి ప్రజలకు అన్ని రకాల సేవలను అందించడానికి ఎంతగానో కృషి చేసి, అలాగే అందరి చేత విజయవంతమైన బిజినెస్మెన్గా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకున్న 86 ఏళ్ల రతన్ టాటా(Ratan Tata) అనారోగ్యంతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్థరాత్రి కన్నుమూశారు. ఆయన మొదలుపెట్టిన అన్ని వ్యాపారాల ద్వారా పేదలకు లాభదాయక ఫలాలు అందించేవారు. ఆయన ఎక్కడ ఏ వ్యాపారం మొదలు పెట్టిన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు కంపెనీ నుంచి వచ్చే ఆదాయాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించేవారు.
అలాంటి గొప్ప వ్యక్తి అయిన రతన్ టాటా(Ratan Tata), ధనవంతులు మాత్రమే కార్లను కొనుగోలు చేయగలరు అనే భావన నుంచి బయటపడేలా ప్రతి సామాన్యుడు సైతం కారును కలిగి ఉండాలనే బలమైన కోరికతో ఆటోమొబైల్ రంగ చరిత్రలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, కేవలం ఒక లక్ష రూపాయల ధరలో సంచలన నానో కారును(Nano Car) తీసుకొచ్చారు.

దీంతో ఇటు భారత్లోనే కాకుండా ప్రపంచదేశాల్లో ఈ కారు గురించే మాట్లాడుకునేలా చేశారు. ముఖ్యంగా రతన్ టాటా ఈ కారును తీసుకురావడానికి ప్రధాన కారణం, 2003లో రతన్ టాటా తన కారులో రోడ్డుపై వెళ్తున్నారు. ఆ టైం లో బాగా వర్షం కురుస్తోంది. ఆయన ప్రయాణిస్తున్న రోడ్డుపై భార్యాభర్తలు, పిల్లలు ఒకే బైక్(Bike)పై వెళ్తున్నారు. బాగా వర్షం కురుస్తున్న వేళ వర్షంలో వారు తడుస్తూ ప్రయాణిస్తున్నారు.
దీనిని కళ్లారా చూసిన ఆయన దేశ ప్రజలు తమ రోజు ప్రయాణాల కోసం ఇంత కష్టపడుతున్నారు. వర్షం, ఎండ వంటి వాటి సమస్యలను భారతీయ కుటుంబాలు సులభంగా ఎదుర్కోడానికి ఏదైనా చేయాలని ధృడంగా నిర్ణయించుకుని తక్కువ ధరలో నానో కారును 10 జనవరి, 2008లో ఇండియాలో ఘనంగా లాంచ్ చేశారు.

మొదట్లో లక్ష రూపాయల కంటే తక్కువ ధరకు కారును విక్రయించబోతున్నామని టాటా (Tata)నుంచి ప్రకటన వచ్చినప్పుడు, భారత్తో పాటు ఇతర దేశాల కార్ల తయారీ కంపెనీలు, ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. దీంతో కారు కొనుక్కోవాలని కలలు కన్న చాలా మంది తమ కలను నెరవేర్చుకునే సమయం వచ్చిందని భావించారు.
కారు లాంచ్ అయిన వెంటనే చాలా మంది బుక్ చేసి కొనుగోలు చేశారు. అయితే కారును ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేయడానికి ఎక్కువ ఖర్చు అయినప్పటికీ, ఇతర వ్యాపారవేత్తల కంటే భిన్నమైన ఆలోచనా విధానాన్ని కలిగి ఉన్న టాటా, నష్టాలను అన్నింటిని భరిస్తూ, దేశ ప్రజలకు లక్ష రూపాయలకే కారును అందించాలనే ధృడ సంకల్పంతో కార్ల ఉత్పత్తిని మాత్రం ఆపలేదు.
డిమాండ్ మేరకు టాటా మోటార్స్(Tata Motors) మొదట్లో ఏడాదికి 2,50,000 కార్ల ఉత్పత్తిని అంచనా వేసింది. అయితే, ఇది సాధ్యపడలేదు. దీనికి ప్రధాన కారణం ప్రారంభంలో నానోకు మంటలు అంటుకోవడం, నానో సురక్షితం కాదని, తక్కువ ధరలో అందించాలని చూసినప్పటికి, కారు నాణ్యతపై కంపెనీ దృష్టి పెట్టలేదని చాలా మంది భావించడం వలన అనుకున్నంత అమ్మకాల లక్ష్యాన్ని సాధించలేదు.
కారు లాంచ్ సమయంలో దేశంలోని చాలా మంది కారును కొనుగోలు చేసినప్పటికి, మొదట్లో లభించిన ఆదరణ తర్వాతి రోజుల్లో చాలా వరకు తగ్గిపోయింది. దీంతో కొత్త బుకింగ్స్ క్షీణించాయి. మార్కెట్లో అమ్మకాలు తగ్గడంతో కార్ల తయారీని టాటా గ్రూప్ నిలిపివేసింది. కానీ సామాన్యులు చాలామంది ఇప్పటికీ ఈ కారును వాడుతున్నారు.
కారు అమ్మకాలు తగ్గడంతో రతన్ టాటా చాలా బాధపడినప్పటికి, అతి త్వరలోనే రెండు లక్షల రూపాయల లోపు ఎలక్ట్రిక్ కార్లను తీసుకువచ్చే దిశగా టాటా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఈ కారుకు సంబంధించిన ఫొటోలు సైతం సోషల్మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ కారును లాంచ్ చేయకుండానే ఆయన కన్నుమూయడం చాలా బాధాకరం.


Click it and Unblock the Notifications








