చైనాకు చుక్కలే..ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల తయారీలో భారత్ సంచలనం..ఇక దిగుమతులకు గుడ్ బై
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో దక్షిణ భారతదేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పారిశ్రామికంగా పెను మార్పులు రాబోతున్నాయని స్పష్టమవుతోంది. "భారతదేశాన్ని చైనా తరహాలో తయారీ రంగంలో అగ్రగామిగా మార్చడమే" లక్ష్యంగా ఈసారి బడ్జెట్లో అదిరిపోయే ప్లాన్ వేశారు. ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విదేశాలపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధి సాధించేందుకు భారీ నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్ వల్ల మన ప్రాంతం ఎలా మారబోతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సెమీకండక్టర్ విప్లవం..రూ.40,000 కోట్ల భారీ కేటాయింపు
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కార్ల నుంచి ఫోన్ల వరకు అన్నింటినీ వేధిస్తున్న సమస్య సెమీకండక్టర్ చిప్ల కొరత. దీని కోసం మనం జపాన్, తైవాన్, చైనా వైపు చూడాల్సి వస్తోంది. ఈ ఆధిపత్యాన్ని తొలగించడానికి నిర్మలమ్మ బడ్జెట్లో భారీ మాస్టర్ ప్లాన్ ప్రకటించారు.

గతంలో ఈ రంగానికి రూ.22,000 కోట్లు కేటాయించగా, ఈసారి దాన్ని దాదాపు రెట్టింపు చేసి రూ.40,000 కోట్లకు పెంచారు. దీనివల్ల దేశీయంగా సెమీకండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు అవుతాయి. మన వాహన తయారీకి కావలసిన చిప్లను మనమే తయారు చేసుకుంటాం. దీనివల్ల భవిష్యత్తులో వాహనాల ధరలు తగ్గడమే కాకుండా, వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గుతుంది.
ఎలక్ట్రిక్ వాహనాల కోసం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. ఈ ఈవీ మోటార్ల తయారీలో అత్యంత కీలకమైనది పర్మనెంట్ మ్యాగ్నెట్. దీనిని తయారు చేయడానికి అరుదైన ఖనిజాలు (Rare Earth Elements) అవసరం. ఇప్పటివరకు వీటి కోసం మనం చైనాపైనే ఆధారపడుతున్నాం.

కానీ ఈ బడ్జెట్లో తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాలను రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో లభించే ఖనిజాలను ఉపయోగించి దేశీయంగానే ఈవీ మోటార్లను తయారు చేస్తారు. ఇది ఈవీ పరిశ్రమలో ఒక గేమ్ ఛేంజర్ కానుంది. ఈ రాష్ట్రాల్లో కొత్త పరిశ్రమలు రావడం వల్ల లక్షలాది మంది యువతకు ఉపాధి లభిస్తుంది.
ఆటోమొబైల్ హబ్గా సౌతిండియా
తమిళనాడు ఇప్పటికే ఆసియా డెట్రాయిట్గా పేరు పొందింది. తాజా బడ్జెట్ కేటాయింపులతో ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల తయారీ యూనిట్లు భారీగా పెరగనున్నాయి. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా దీని ప్రభావం పాకుతుంది.

సెమీకండక్టర్లు, మ్యాగ్నెట్ల తయారీ ఇక్కడ ప్రారంభమైతే, తయారీ వ్యయం తగ్గి కార్లు, బైకులు చౌకగా లభిస్తాయి. చైనా తన తయారీ రంగంతో ఎలాగైతే ప్రపంచాన్ని శాసిస్తోందో, అదే తరహాలో దక్షిణాది రాష్ట్రాల ద్వారా ప్రపంచ మార్కెట్ను చేజిక్కించుకోవాలని భారత్ భావిస్తోంది.
మెరుగైన మౌలిక సదుపాయాలు, సరుకు రవాణా
పరిశ్రమలు రావడమే కాకుండా, తయారైన వస్తువులను వేగంగా ఓడరేవులకు తరలించడానికి ఈ బడ్జెట్లో భారీగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. హై-స్పీడ్ రైల్ కారిడార్లు, ఎక్స్ప్రెస్వేల అనుసంధానం వల్ల సరుకు రవాణా వ్యయం తగ్గి, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో చైనా వస్తువులతో పోటీ పడగలవు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందని నిపుణులు చెబుతున్నారు.
స్వావలంబన దిశగా అడుగులు
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ కాదు.. ఇది ఒక దీర్ఘకాలిక వ్యూహం. సెమీకండక్టర్లు, మ్యాగ్నెట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ సొంత కాళ్లపై నిలబడటమే కాకుండా, ప్రపంచానికి సరఫరా చేసే స్థాయికి చేరుకోనుంది. దక్షిణ భారత రాష్ట్రాలు ఈ పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహించబోతున్నాయి.


Click it and Unblock the Notifications








