నాలాగే మీరు కూడా మారిపోండి అని ఎంకరేజ్ చేస్తున్న ప్రముఖ రియాల్టీ షో జడ్జ్!
భగ్గుమంటున్న ఇంధన ధరల నేపథ్యంలో, దేశంలోని ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆశగా చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా, ఇంధన ధరాఘాతం నుండి కూడా ప్రజలకు ఉపశమనం కలిగించనున్నాయి. దీంతో సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. తాజాగా, షార్క్ ట్యాంక్ ఇండియా (Shark Tank India) రియాల్టీ షో జడ్జ్ మరియు మామాఎర్త్ (MamaEarth) బ్రాండ్ వ్యవస్థాపకురాలు గజల్ అలగ్ (Ghazal Alagh) ఓ ఖరీదైన జర్మన్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు.

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా (Audi India) అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు ఆడి ఇ-ట్రోన్ (Audi e-Tron) ను గజల్ అలగ్ కొనుగోలు చేశారు. గజల్ అలగ్ ఆడి ఇ-ట్రాన్ ఈవీలో టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్ అయిన ఆడి ఇ-ట్రోన్ స్పోర్ట్బ్యాక్ 55 (Audi e-Tron Sportback 55) ను కొనుగోలు చేశారు. భారతదేశంలో కంపెనీ ఈ ట్రిమ్ను రూ. 1.17 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో విక్రయిస్తోంది. తన కొత్త ఎలక్ట్రిక్ కారుతో దిగిన ఫొటోలను గజల్ అలగ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన చిత్రాలను చూస్తే, ఆ రెడ్ కలర్ లో ఉండే ఆడి ఇ-ట్రోన్ స్పోర్ట్బ్యాక్ 55 ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోతో పాటుగా ఆమె ఈ కొత్త ఈవీతో స్థిరమైన భవిష్యత్తు కోసం తన కొత్త 'జర్నీ'ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మార్పు కోసం తనపాటుగా ఇతరలు కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపుకు మారాలని ఆమె అభిప్రాయపడ్డారు. సోనీ టెలివిజన్ లో ప్రసారమవుతున్న షార్క్ ట్యాంక్ ఇండియాకు గజల్ అలఘ్ న్యాయనిర్ణేతగా ఉన్నారు.

ఈ షోలో గజల్ అలఘ్తో సహా ఏడుగురు జడ్జ్లు ఉన్నారు. వీరిలో అష్నీర్ గ్రోవర్, వినీతా సింగ్, పెయూష్ బన్సల్, నమితా థాపర్, అనుపమ్ మిట్టల్ మరియు అమన్ గుప్తాలు ఉన్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా రియాలిటీ షోలో కనిపించిన తర్వాత గజల్ అలగ్ దేసంలో మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఈ షో అమెరికన్ రియాల్టీ షో "షార్క్ ట్యాంక్" నుండి ప్రేరణ పొందిన ఇండియన్ వెర్షన్ గా ఉంటుంది. అమెరికన్ షార్క్ ట్యాంక్ 9 ఆగస్టు 2009న ABC (అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ)లో ప్రసారం చేయబడింది.

ఆడి ఇ-ట్రోన్ (Audi e-Tron) ఎలక్ట్రిక్ కారు గురించి క్లుప్తంగా..
జర్మన్ కార్ బ్రాండ్ ఆడి ఈ ఎలక్ట్రిక్ కారును గడచిన జులై 2021లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV మొత్తం మూడు వేరియంట్లలో విక్రయించబడుతోంది. వీటిలో, దాని బేస్-స్పెక్ వేరియంట్ ఇ-ట్రోన్ 50, దీని ధర రూ. 99.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, రెండవ వేరియంట్ ఆడి ఇ-ట్రోన్ 55 ధర రూ. 1.16 కోట్లు (ఎక్స్-షోరూమ్) మరియు మూడవ వేరియంట్ అయిన ఆడి ఇ-ట్రోన్ స్పోర్ట్బ్యాక్ 55 ధర రూ. 1.17 కోట్లు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ను బట్టి దాని బ్యాటరీ, పవర్ మరియు రేంజ్ లు మారుతూ ఉంటాయి.

ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ పూర్తిగా విదేశాల్లో తయారు చేసి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియూ) రూట్లో భారతదేశానికి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి, ఈ కారు ధర కూడా సాధారణం కన్నా రెట్టింపుగా ఉంటుంది. ఆడి ఇ-ట్రోన్ 50 క్వాట్రో వేరియంట్లో 71.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ను ఉపయోగించారు. ఉంటుంది. ఇది గరిష్టంగా 312 బిహెచ్పి శక్తిని మరియు 540 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 359 కి.మీల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇందులో మరింత శక్తివంతమైన వేరియంట్ ఆడి ఇ-ట్రోన్ 55 క్వాట్రో ఇది పవర్ఫుల్ 95 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో పనిచేస్తుంది. ఈ వేరియంట్ లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 402 బిహెచ్పి శక్తిని మరియు 664 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 484 కిమీ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆడి ఇ-ట్రాన్ స్పోర్ట్బ్యాక్ 55 మోడల్ కూడా ఇదే రకమైన ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది.

ఈ రెండు వేరియంట్లలో (ఇ-ట్రోన్ 55, ఇ-ట్రోన్ స్పోర్ట్బ్యాక్ 55) కొన్ని ఫీచర్లు స్టాండర్డ్గా అందిస్తున్నారు. వీటిలో పర్మినెంట్ ఆల్-వీల్-డ్రైవ్, ప్రోగ్రెసివ్ స్టీరింగ్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు మ్యాట్రిక్స్ ఎల్ఈడి హెడ్ల్యాంప్లు మొదలైనవి ఉన్నాయి. చార్జింగ్ సమయం విషయానికి వస్తే, 150 కిలోవాట్ల డిసి ఛార్జర్ను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో ఈ కారు బ్యాటరీలను 0-80 శాతం వరకూ ఛార్జ్ చేయవచ్చని ఆడి ఇండియా పేర్కొంది. అదే 11 కిలోవాట్ల ఏసి ఛార్జర్ను ఉపయోగించినట్లయితే, 0-80 శాతం చార్జ్ సుమారు 8.5 గంటల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








