ఈనెల 30న భారత్కు ఎయిర్బస్ ఏ380 సేవలు: ఎస్ఐఏ
ఎయిర్బస్ ఏ380 విమానాలను భారతదేశంలో అనుమతించేందుకు మన దేశ సర్కారు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ ఎయిర్బస్ ఏ380 విమాన సేవలను ఇండియాకు తీసుకువచ్చేందుకు ఆరాటపడుతున్నాయి.
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానమైన ఎయిర్బస్ ఏ380 విమాన సేవలను సింగపూర్ ఎయిర్లైన్స్ తొలిసారిగా భారత్కు పరిచయం చేయనుంది. ఈ నెల 30వ తేది నుంచి ఈ విమానాలను భారత్కు నడుపుతామని సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది.
ఈ ఎయిర్బస్ ఏ380 విమానంలో ఒకేసారి 471 మంది ప్రయాణికులు కూర్చోవచ్చని, సూపర్జంబోలుగా పిలిచే ఈ విమానాలను భారత్లో తొలిసారిగా ఢిల్లీ, ముంబై నగరాలకు నడుపుతామని సింగపూర్ ఎయిర్లైన్స్ తెలిపింది. వీటితో పాటుగా హైదరాబాద్, బెంగళూరు నగరాలకు కూడా ఈ విమానాలను నడిపేందుకు కేంద్రం గడచిన జనవరిలో అనుమతి ఇచ్చిన సంగతి తెలిసినదే.

ప్రస్తుతం ఢిల్లీ, ముంబై నగరాలకు రోజూ రాకపోకలు సాగిస్తున్న బోయింగ్ 777 విమానాల స్థానంలో ఏ-380లను ప్రవేశపెడుతున్నామని సింగపూర్ ఎయిర్లైన్స్ జనరల్ మేనేజర్ (ఇండియా) డేవిడ్ లౌ వివరించారు. ఏ-380 విమానంలో ఫస్ట్క్లాస్ సూట్స్, బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాస్లలో మొత్తం 471 సీట్లుంటాయని వివరించారు.
భారత్కు ఎయిర్బస్ ఏ-380 విమాన సర్వీసులు నడపాలని తాము ఎంతో ఆసక్తితో ఎదురుచూశామనీ, ఇప్పుడు తమకు అనుమతి లభించిందని ఆన అన్నారు. ఢిల్లీ, ముంబైల నుంచి సింగపూర్ ఎయిర్లైన్స్లో వారానికి 6000 సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మరోవైపు ఇంకో 20 రోజుల్లో సింగపూర్కు ఎయిర్బస్ ఏ380 విమాన సేవలు ప్రారంభించనున్న నేపథ్యంలో, సింగపూర్ ఎయిర్లైన్స్ ఇప్పటి నుంచే కస్టమర్లను ఆకట్టుకునేందుకు డిస్కౌంట్ల వర్షం కురిపిస్తోంది.


Click it and Unblock the Notifications








