కారులో 6 ఎయిర్ బ్యాగులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. ఏమన్నారంటే.!!
కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రతిపాదించిన రహదారి భద్రతా కార్యక్రమాల్లో ఒకటి, అన్ని ప్రయాణీకుల వాహనాలకు 6 ఎయిర్బ్యాగ్లను తప్పనిసరి చేయడం. కార్లలో 6 ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి నిబంధన అక్టోబర్ 01, 2023 నుండి అమల్లోకి రావలసి ఉంది. అయితే తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనిపై వెలువరించిన ప్రకటన కీలకంగా మారింది.
కార్లకు ఆరు ఎయిర్బ్యాగ్లు లేకపోతే భారత్ NCAP టెస్ట్లో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందలేమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల చెప్పారు. భారత్లో తయారయ్యే కార్లకు 6 ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి అని ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు అమలు చేయని కేంద్ర మంత్రి ఓ కీలక ప్రకటన చేశారు.

సెప్టెంబర్ 2022 లో, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అక్టోబర్ 2023 నుండి భారతదేశంలో తయారయ్యే కార్లలో ఆరు ఎయిర్బ్యాగులు తప్పనిసరి అని ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చట్టం ప్రస్తుతం పరిశీలనలో ఉంది మరియు ఇంకా అమలులోకి రాలేదు.
అయితే ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ.. కార్లలో 6 ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి చేసే ఉద్దేశం లేదని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ACMA) 63వ వార్షిక సెషన్లో ఆయన మాట్లాడారు. ప్రయాణికుల కార్లలో 6 ఎయిర్బ్యాగ్లను తప్పనిసరి నిర్ణయాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అందుకు గల కారణాన్ని గడ్కరీ వివరించారు.

చాలా మంది కార్ల తయారీదారులు ఇప్పటికే 6 ఎయిర్బ్యాగ్లను ప్రామాణికంగా అందించడం ప్రారంభించారు. అయితే కొన్ని కార్ల తయారీ కంపెనీల నుంచి మాత్రమే దీనిపై వ్యతిరేకత ఉంది. మారుతి తన చిన్న కార్ల ద్వారా అత్యధిక సేల్స్ నమోదవుతుండటంతో ఈ కంపెనీ 6 ఎయిర్బ్యాగ్లను తప్పనిసరి చేయాలనే ఆలోచనను వ్యతిరేకిస్తోంది.
చిన్న కార్లలో 6 ఎయిర్బ్యాగ్లను అందిస్తే వాటి ధర పెరగడంతో పాటు అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 2 ఎయిర్బ్యాగ్లకు 4 ఎయిర్బ్యాగ్లను జోడించడం వల్ల కారు ధర రూ.6000 వరకు పెరుగుతుందని లెక్కలు వేసింది. అయితే 6 ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి అయినప్పుడు కారు ధర రూ.19000 వరకు పెరుగుతుందని కొన్ని ప్రైవేట్ కంపెనీలు తెలిపాయి.
అయితే ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ ప్రవేశపెట్టిన భారత్ NCAP క్రాష్ టెస్ట్ ద్వారా కార్ల తయారీదారులు తమ వాహనాలను క్రాష్ టెస్ట్ కోసం విదేశాలకు పంపించకుండా ఇక్కడే నిర్వహించవచ్చుననే విషయం మీకు తెలిసిందే. కాగా ఇప్పటికే క్రాష్ టెస్ట్లు ప్రారంభమయ్యాయని, తొలి సెట్ ఫలితాలు త్వరలో వెల్లడిస్తామని గడ్కరీ తెలిపారు.
ఈ నేపథ్యంలో 6 ఎయిర్బ్యాగ్లను ప్రామాణికంగా కలిగి ఉన్న కార్లు భారత్ NCAP క్రాష్ పరీక్షల్లో అదనపు పాయింట్లకు అర్హత సాధిస్తాయని గడ్కరీ వెల్లడించారు. దీని ద్వారా కస్టమర్లు కార్ల ఎంపికపై సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కస్టమర్లు తమంతట తాముగా ఎక్కువ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లను ఎంచుకుంటారు కాబట్టి, 6 ఎయిర్బ్యాగ్లను తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదన్నారు.
ప్రస్తుతం భారత్లో తయారయ్యే కార్లకు రెండు ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి అనే నిబంధన ఉంది. ఫ్రంట్ డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లకు రెండు ఎయిర్బ్యాగ్లు తప్పనిసరి. ప్రస్తుతం ప్రీమియం కార్లకు మాత్రమే కాకుండా రూ. 20 లక్షల లోపు కార్లలో కూడా పలు కంపెనీలు 6 ఎయిర్ బ్యాగ్లను అందిస్తున్నాయి. ప్రజలు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో కార్ల కంపెనీలు కూడా తగు ప్రమాణాలను పాటిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








