తిరుమల ఘాట్ రోడ్డులో ఒక్కసారిగా భయపడిన భక్తులు.. రన్నింగ్ కారు నుంచి గట్టిగా కేకలు, వేలాడుతూ సెల్ఫీలు..
ఇటీవల కాలంలో కొంత మంది యువకులు రోడ్లపై తమ వాహనాలతో ఇష్టం వచ్చినట్లు స్టంట్లు వేస్తూ, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడో ఒకచోట ఇవి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా దేశంలోనే అత్యంత ప్రసిద్ధ దేవస్థానం అయినటువంటి తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో కొంతమంది యువకులు తమ కారుతో నిర్లక్ష్యంగా, ప్రమాదకరమైన స్థితిలో డ్రైవింగ్ చేస్తూ అదే ఘాట్ రోడ్డులో వెళ్తున్న ఇతర వాహనాదారులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టగా అది తెగ వైరల్ అవుతుంది. ఎంతో పవిత్రమైన ప్రాంతంలో ఈ యువకులు చేసిన హంగామాకు వారిని కఠినంగా శిక్షించాలని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఘటన ఆదివారం నాడు చోటు చేసుకుంది. తిరుమల ఘాట్ రోడ్లో అలిపిరి నుంచి వెళ్లే మార్గంలో ఆరుగురు యువకులు మహీంద్రా XUV700 SUVలో ప్రయాణిస్తున్నారు. అయితే అలా వెళ్తున్న క్రమంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో హరిణి సమీపంలో ఈ కారులోంచి ఐదుగురు విండోలు, కారు పై భాగంలో సన్రూఫ్ గుండా బయటకు కనిపించేలా నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ, గట్టిగా అరుస్తూ వేగంగా కారును పోనిచ్చారు.

మొత్తం ఆరుగురు ఉన్న కారులో ఒక వ్యక్తి వేగంగా డ్రైవింగ్ చేస్తుండగా, మిగతావారు వర్షంలోనే కారుకు వేలాడుతూ, ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఇతర వాహనాదారులు ఒక్కసారిగా వీరి చేష్టలు చూసి అవాక్కయ్యారు. ఘాట్ మార్గంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన చోట ఇలా నిర్లక్ష్యంగా అవతలి వారిని ఇబ్బంది పెట్టేలా కారును కొండపైకి పోనిచ్చారు. ఒకవేళ కారు అదుపుతప్పితే మాత్రం పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.
ఆ యువకులు చేసిన హంగామాను వెనుక వాహనాదారులు రికార్డ్ చేయడంతో ఈ ఘటన జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ఘాట్ రోడ్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ, ప్రమాదకరమైన స్టంట్లు వేసిన యువకులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటేనే మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని పలువురు భక్తులు పేర్కొంటున్నారు. అయితే వీరి చేష్టల వీడియో టీటీడీ సిబ్బందికి చేరింది.

దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ సిబ్బంది నందకం విశ్రాంతి భవనం వద్ద ఈ కారును సీసీటీవీలో గుర్తించి వీరిని తిరుమల టూ టౌన్ పోలీసులకు అప్పజెప్పారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎంవి నరసింహారావు ఘటన జరిగిన అదే రోజు పవిత్రమైన ఘాట్ రోడ్డులో హంగామా సృష్టించినందుకు, ఇతరకు ఇబ్బంది కలిగించినందుకు గాను ఆ యువకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీరిపై వచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేస్తున్నారు. వీరంతా హైదరాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆ ఆరుగురు యువకులను సుశీల్, వికాస్, ఆదర్శ్, రమేష్, సుమన్,ప్రభంజన్గా పోలీసులు గుర్తించారు. ఎంతో జాగ్రత్తగా వెళ్లాల్సిన ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించి, ఇతర వాహనాదారులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినందుకు గాను వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








