యువకులకు కూడా కష్టమయ్యే ఫీట్ను సాధించిన 77 ఏళ్ల వ్యక్తి.. బైక్పై వయసును ఓడించిన హీరో
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లంటే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. చిన్నప్పటి నుండి పెద్దవాళ్ల వరకు వీటికి ఉన్న అభిమానమే వేరుగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ బైక్లు కేవలం వాహనాలు మాత్రమే కాదు, ఒక భావోద్వేగం, ఒక జీవనశైలి. వీటి ఇంజిన్ కెపాసిటీ బలంగా ఉండటం వల్ల నగర ప్రయాణాలకే కాకుండా, దూర ప్రయాణాలకు కూడా ఇవి అద్భుతంగా సరిపోతాయి. ఎప్పుడూ కొత్త కొత్త అనుభవాలను వెతికే రైడర్లకు రాయల్ ఎన్ఫీల్డ్ ఓ నమ్మకమైన తోడు. ఇలాంటి బైక్లను నడపడానికి కొంచెం ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం అవుతుంది. మొదట్లో ఇవి కొంచెం హెవీగా అనిపించవచ్చు కానీ, అలవాటు పడిపోయాక మాత్రం ఈ బైక్పై ప్రయాణించడం ఒక మాంత్రిక అనుభవంలా ఉంటుంది.
మీరు దూరంగా ప్రయాణిస్తున్నప్పుడు, వంకర తిరుగుల గుట్టలపై ఎక్కుతున్నప్పుడు లేదా దూర రోడ్లపై ఒంటరిగా వెళ్తున్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఇచ్చే ఫీలింగ్కు సమానం మరొకటి ఉండదు. అందుకే యువత నుంచి వయస్సు పైబడిన వారు వరకు అందరూ వీటిని నడపడానికి ఆసక్తి చూపుతారు. ఇటీవల కాలంలో ఒంటరిగా ఎన్ఫీల్డ్ బైకులపై లాంగ్ జర్నీలు చేయడం చాలా అలవాటు అయిపోయింది. ముఖ్యంగా యువత వీకెండ్స్ లేదా సెలవుల్లో టూర్స్ వెళ్తుంటారు.

అయితే, ఒక్క యువత అనే కాకుండా పెద్ద వయస్సుల వారు కూడా బుల్లెట్ బైకులపై హిమాలయ పర్వత ప్రాంతాల్లో లాంగ్ రైడులు వేస్తున్నారు. ఈ బైక్లను నడిపి అసాధారణమైన రికార్డులు సృష్టిస్తున్నారు. పూణేకు చెందిన మాజీ భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోహాన్ రాయ్ (77 ఏళ్లు) అలాంటి వ్యక్తుల్లో ఒకరు. ఆయన సాధించిన ఘనతను చూసి రాయల్ ఎన్ఫీల్డ్ మీదున్న ఆరాధన మరింత పెరుగుతుంది.
వయస్సు పైబడినా కూడా ఆయన సాహసోత్సాహం తగ్గలేదు. ఇటీవల ఆయన ఒంటరిగా తన రాయల్ ఎన్ఫీల్డ్ బైకుపై లడఖ్లోని లేహ్ ప్రాంతానికి వెళ్లి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉమ్లింగ్ లా పాస్ (19,024 అడుగులు) పైకి ఎక్కి రికార్డు సృష్టించారు. ఈ ప్రయాణం సాధారణం కాదు. ఆ ఎత్తులో వాతావరణం కఠినంగా ఉంటుంది, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, రోడ్లు కూడా సవాళ్లతో నిండిపోతాయి.

అయినప్పటికీ సోహాన్ రాయ్ తన దృఢసంకల్పంతో, ధైర్యంతో ప్రయాణాన్ని పూర్తిచేశారు. ఈ విజయంతో ఆయన వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, మనసులో ఉత్సాహం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించారు. ఆగస్టు 20న ప్రారంభమైన ప్రయాణం 30 వరకు మొత్తం 10 రోజుల ఆయన ఎన్నో చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ఆయన ఎంతో ప్రేమతో విజార్డ్ అని పిలిచే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 మోటార్సైకిల్పై ఈ ప్రయాణం చేశారు.
ఈ సాహస యాత్రలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, విద్యుత్తు అంతరాయాలు, కమ్యూనికేషన్ లేకపోవడం వంటి ఎన్నో అడ్డంకులు ఎదురైనా, ఆయన వెనక్కి తగ్గలేదు. ప్రతి మలుపు, ప్రతి కొండచరియ కొత్త సవాళ్లు విసురుతున్నా, ఆయన తన బైక్ని విశ్వాసంతో ముందుకు నడిపించారు.

జమ్మూ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర, శ్రీనగర్, ద్రాస్, కార్గిల్, లేహ్, న్యోమా, హన్లే మీదుగా సాగి చివరికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు రహదారి ఉమ్లింగ్ లా (19,024 అడుగులు) వరకు చేరింది. 10 రోజులపాటు కొనసాగిన ఈ ప్రయాణంలో కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద 1999లో అమరవీరులైన సైనికులకు, అలాగే బుద్గాం యుద్ధ స్మారక చిహ్నం (1947-48) వద్ద వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు.
ఈ ప్రయాణం పూర్తయిన వెంటనే దేశవ్యాప్తంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), ఆయన తోటి సైనికులు, అలాగే బైక్ రైడింగ్ ఔత్సాహికులు అందరూ ఆయన ధైర్యాన్ని అభినందించారు. వయసు 77 అయినా, ఉత్సాహం మాత్రం 27 ఏళ్ల యువకుడిలా ఉందని అందరూ ప్రశంసించారు. ఆయన ఇంతకుముందు కుమావున్ రెజిమెంట్ 15వ బెటాలియన్లో చేరి సైన్యంలో దాదాపు మూడు దశాబ్దాలుగా సేవలందించారు.


Click it and Unblock the Notifications








