తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి రానున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్..
తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన శ్రీనివాస సేతు(Srinivasa Sethu) ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది. తిరుమలో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాల నాడు సీఎం జగన్ ఈ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన శ్రీనివాస సేతు(Srinivasa Sethu) ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వే చివరి స్ట్రెచ్ను ఈ నెల 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల తొలిరోజున తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

ఈ నేపథ్యంలో అదే రోజున ఎక్స్ప్రెస్ వే ను ప్రారంభించడంతో పాటు.. తిరుమలలో కొత్తగా నిర్మించిన కొన్ని అతిథి గృహాలను కూడా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. శ్రీనివాస సేతు ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి వస్తే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
తిరుమలలో సెప్టెంబరు 18 నుంచి 26 వరకు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం, అన్ని రకాల ప్రత్యేకాధికార దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 22న గరుడసేవ రోజున జంట ఘాట్రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధిస్తామని వెల్లడించారు.
తిరుమలలో ఇటీవల అలిపిరి వద్ద నడక మార్గంలో ఆరేళ్ల చిన్నారిపై చిరుతపులి దాడి కారణంగా నడక దారులు మరియు ఘాట్ రోడ్లలో యాత్రికుల కదలికలపై విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆంక్షలు ఎత్తివేయాలని అటవీ శాఖ సూచించే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది.
తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే మార్గంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో నేరుగా తిరుమల వెళ్లేందుకు వీలుగా శ్రీనివాస సేతు పేరుతో ఫ్లైఓవర్ నిర్మాణాన్నిప్రారంభించారు. శ్రీవారి దర్శనానికి రోజుకు దాదాపు లక్షన్నర మంది భక్తులు వస్తుంటారు. తానపల్లి క్రాస్ (తిరుచానూరు), నంది సర్కిల్ (కపిల తీర్థం) మధ్య తిరుమల కొండకు వెళ్లే 7 కి.మీ రహదారి రద్దీగా మారింది.
దీంతో శ్రీవారి దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స్థానికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వం శ్రీనివాస సేతు ఎక్స్ప్రెస్వే (ఫ్లైఓవర్) నిర్మాణాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకం కింద ఈ ఫ్లైఓవర్ మంజూరు అయింది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి మొత్తం రూ.680 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. గత మార్చిలో ఈ వంతెన పనులు 90 శాతం పూర్తయ్యాయి.
వేసవిలో అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో మే 15లోగా ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కానీ, వివిధ కారణాలతో ఆలస్యమై ఎట్టకేలకు శ్రీనివాస సేతు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవానికి సిద్ధమవడంతో భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
తిరుపతిలో 7 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు వాహనదారుడికి 40 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో 10 నిమిషాలకు తగ్గడంతో పాటు ట్రాఫిక్ జామ్ సమస్య తీరనుంది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు ఈ శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నుంచి తిరుమల కొండకు సులభంగా చేరుకోవచ్చు. అయితే ఈ ఫ్లై ఓవర్ ద్వారా స్థానికులకు పెద్దగా ప్రయోజనం ఉండదు.


Click it and Unblock the Notifications








