E20 Petrol: E20 ఇంధన విధానంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ప్రభుత్వానికి పెద్ద ఊరట
ఇండియాలో పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలపాలని ప్రభుత్వం తీసుకున్న E20 ఇంధన విధానంపై పెద్ద చర్చ కొనసాగుతోంది. ఈ విధానాన్ని సవాలు చేస్తూ అక్షయ్ మల్హోత్రా అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే E20 ఇంధన విధానంపై సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు తేలికగా కొట్టివేసింది. ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను నియంత్రించడం వంటి జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకున్న చర్యలు సముచితమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసును విచారించిన ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం, ఈ విధానంలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణం లేదని తెలిపింది.
అక్షయ్ మల్హోత్రా దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో(PIL), E20 పెట్రోల్ వల్ల 2023కి ముందు తయారైన వాహనాలు ప్రమాదానికి గురయ్యే అవకాశముందని వినిపించారు. ఎందుకంటే ఆ కాలం నాటి వాహనాలు అధిక ఇథనాల్ మిశ్రమాన్ని తట్టుకునే విధంగా డిజైన్ చేయబడలేదని ఆయన సూచించారు. అలాగే, ఫ్యూయల్ స్టేషన్ల వద్ద వినియోగదారులకు ఎంపిక ఉండేలా E20 కాకుండా సాధారణ పెట్రోల్ (E0) కూడా అందుబాటులో ఉంచాలని పిటిషన్లో కోరారు.

అంతేకాదు, ప్రతి పెట్రోల్ పంపులో ఇథనాల్ శాతం తప్పనిసరిగా స్పష్టంగా లేబులింగ్ చేయాలని డిమాండ్ చేశారు. పిటిషనర్ అక్షయ్ మల్హోత్రా తన పిటిషన్లో మరో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. ఆయన వాదన ప్రకారం, E20 పెట్రోల్ ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం దాని రిటైల్ ధరను తగ్గించకపోవడం వల్ల వాహన యజమానులు ఎటువంటి ప్రయోజనం పొందడం లేదని స్పష్టం చేశారు.
అంటే, 20 శాతం ఇథనాల్ కలిపిన ఈ ఇంధనం వల్ల కలగాల్సిన ధర తగ్గింపు లాభం వినియోగదారులకు అందడం లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలో, అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి కోర్టులో చేసిన వ్యాఖ్యలు ఈ కేసుకు మరో మలుపు తిప్పాయి. ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ పిటిషన్ వెనుక నిజంగా ప్రజా ప్రయోజనమే ఉన్నదా లేక పెద్ద లాబీ ఉందా అన్న అనుమానం ఉత్పన్నమవుతోందని చెప్పారు.

అంతేకాదు, భారతదేశం ఏ రకమైన ఇంధనాన్ని ఉపయోగించాలో బయటి వ్యక్తులు నిర్ణయించాలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ పిటిషన్ను వ్యతిరేకిస్తున్నట్లు అటార్నీ జనరల్ స్పష్టంచేశారు. ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ విధానాన్ని రూపొందించింది. ఈ నిర్ణయం కేవలం ఇంధన విధానం కోసమే కాకుండా, భారతదేశంలోని చెరకు రైతులకు కూడా పెద్ద ప్రయోజనాలను అందిస్తుందని ఆయన తన వాదనలు వినిపించారు.
ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడటమే ఈ విధానానికి మూల కారణమని ప్రభుత్వం సమర్పించిన వాదనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. E20 విధానంపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చింది. ఈ నేపథ్యంలో, ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, జస్టిస్ కె.వినోద్ చంద్రన్తో కలిసి విచారణ జరిపి, చివరికి ఈ పిటిషన్ను కొట్టివేసింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశవ్యాప్తంగా పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం తప్పనిసరిగా అమలవుతుందని అర్థం. ఈ తీర్పుతో, కేంద్ర ప్రభుత్వ పర్యావరణహిత ఇంధన మార్గదర్శకాలు మరింత బలపడ్డాయి. ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా, స్వదేశీ పంటల ఆధారంగా తయారయ్యే ఇథనాల్ వినియోగం రైతులకు కూడా ఆర్థిక లాభాలు అందించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








