సిగ్నల్ లేకుండా హైవే మీద కారు ఆపితే డ్రైవర్ దే తప్పు.. రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రోడ్డుపై వెళ్లేవారు తప్పుకుండా కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. జాతీయ రహదారుల పై కారును నిలిపేటప్పుడు సరైన సిగ్నల్స్ ఇవ్వకపోతే, అది నిర్లక్ష్యంతో వాహనం నడిపినట్లుగా భావించబడుతుందని సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక కీలక తీర్పు ఇచ్చింది. దాదాపు 8 ఏళ్ల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కేసులో ఈ తీర్పు వెలువడింది. ఈ తీర్పు ప్రకారం వాహనదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఈ తీర్పు వివరాలేంటో వివరంగా తెలుసుకుందాం.
2017లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసు వివరాల ప్రకారం.. మహమ్మద్ హకీం అనే విద్యార్థి కారులో వెళ్తుండగా, ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా ఆగింది. దీంతో హకీం కారు ఆ వాహనాన్ని ఢీకొట్టింది. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న ఒక బస్సు హకీం కారును బలంగా ఢీకొట్టింది. దీనిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది.

ఈ కేసు విచారణలో, ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వకుండా అకస్మాత్తుగా జాతీయ రహదారిపై వాహనాన్ని నిలిపివేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కోర్టు గుర్తించింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. జాతీయ రహదారులపై డ్రైవర్లు ఏ అత్యవసర పరిస్థితిలోనైనా సరే, తమ వాహనాన్ని ఆపాలనుకుంటే తప్పనిసరిగా వెనక వస్తున్న వారికి సరైన సిగ్నల్స్ ఇవ్వాలని ఆదేశించింది.
ఇలా సిగ్నల్స్ ఇవ్వకుండా ఆపడం అనేది నిర్లక్ష్యంగా, రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించినట్లుగా భావించబడుతుందని స్పష్టం చేసింది. కోర్టు ఈ సందర్భంగా కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. ఒకవేళ రోడ్డుపై ఏదైనా అడ్డంకి (ఉదాహరణకు స్పీడ్ బ్రేకర్) ఉండి, దాని గురించి హెచ్చరిక బోర్డు లేకపోయినా, డ్రైవర్ దానిని గమనిస్తే వెంటనే వెనక వచ్చే వాహనాలకు సిగ్నల్స్ ఇవ్వాలి.

ముందు వెళ్తున్న వాహనానికి, వెనక వచ్చే వాహనాన్ని హెచ్చరించి, ప్రమాదాన్ని నివారించే బాధ్యత ఉంటుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. జాతీయ రహదారులపై అధిక వేగంతో ప్రయాణించడం సాధారణం. అలాంటి పరిస్థితుల్లో, వాహనాన్ని ఆపేటప్పుడు తక్షణమే వెనక వాహనాలకు సిగ్నల్స్ ఇవ్వడం చాలా ముఖ్యం.
ఈ ప్రమాదం కేసులో, మొదట కారు ఆపిన డ్రైవర్ తన భార్య గర్భవతి అని, ఆమెకు అత్యవసర సాయం అవసరమైనందువల్ల కారు ఆపాల్సి వచ్చిందని కోర్టుకు వివరించాడు. అయితే, అతని అత్యవసర పరిస్థితిని అర్థం చేసుకున్నప్పటికీ, కోర్టు ఈ ప్రమాదానికి బాధ్యతను ముగ్గురిపై విధించింది. మొదట కారు నిలిపిన డ్రైవర్ ది 50% బాధ్యత. సిగ్నల్స్ ఇవ్వకుండా అకస్మాత్తుగా ఆపడం అతని నిర్లక్ష్యం.

వెనక నుంచి వచ్చిన బస్సు డ్రైవర్ ది 30% బాధ్యత. ముందు కారు ఆగిందని గమనించడానికి సమయం ఉన్నప్పటికీ అతను బ్రేకులు వేయడంలో విఫలమయ్యాడు. మహమ్మద్ హకీంది 20% బాధ్యత. తగినంత దూరం పాటించకుండా ముందు వెళ్తున్న వాహనానికి దగ్గరగా వెళ్లడం అతని నిర్లక్ష్యం.
ఈ తీర్పు భారతదేశంలో వాహనదారులందరికీ ఒక పెద్ద హెచ్చరిక అని చెప్పవచ్చు. జాతీయ రహదారులపై వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ముఖ్యంగా ఆపేటప్పుడు ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలో ఈ కేసు స్పష్టంగా తెలియజేస్తుంది.


Click it and Unblock the Notifications








