తెలుగు వారికి గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు రద్దు!
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి 100 శాతం మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటన వల్ల రాష్ట్రంలో ఎలక్రిక్ వాహనాల వినియోగం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు, టూవీలర్స్ వినియోగం ఎక్కువ అవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల పెంపు కోసం రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ప్రకటనతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనాలా, వద్దా? అని సంగ్ధిదంలో ఉండే వారు వీటి వైపు చూసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
వాహనాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు.. దేశ రాజధాని ఢిల్లీ వంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత రెండేళ్ల పాటు అమల్లో ఉండే సరికొత్త ఈవీ పాలసీని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. దీంతో పాటు వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఈవీ తయారీదారులను సైతం ఆయన కోరారు.

తాజా నిర్ణయం వల్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 4 వీలర్స్, వాహనాలు, ట్యాక్సీలు, త్రీ సీటర్ ఆటోలు, ఎలక్ట్రిక్ లైట్ గూడ్స్ క్యారియర్లు (మూడు చక్రాల గూడ్స్ క్యారియర్ వాహనాలతో సహా), ట్రాక్టర్లు, బస్సులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. తద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ విరివిగా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. రవాణా రంగంలో ఇవే కీలకం కావడంతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ అమ్మకాలు పెరగనున్నాయి.
దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కోసం ఉపయోగించబోయే ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఏదైనా పరిశ్రమకు చెందిన బస్సులకు ప్రత్యేకంగా (వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదు, కేవలం ఆ సంస్థ ఉద్యోగస్థులను మాత్రమే తరలించాలి) కూడా రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. రిజిస్ట్రేషన్లతో సంబంధం లేకుండా 2026 డిసెంబర్ 31 వరకు రెండేళ్ల పాటు ఈ మినహాయింపు వర్తిస్తుంది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్తో కలిసి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేలా పలు చర్యలు తీసుకుంటున్నట్లు పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాలుష్య స్థాయిలను తగ్గించడంతో పాటు హైదరాబాద్ వంటి మహానగరాన్ని కాలుష్య రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
ఢిల్లీ నుంచి గుణపాఠాలు: దేశంలో సొంతంగా వాహనాలను కొనేవారి సంఖ్య పెరుగుతుండటంతో రోడ్లపై ట్రాఫిక్తో పాటు కాలుష్యం కూడా పెరుగుతోంది. దేశ రాజధానిలో వాహనాల సంఖ్య రెండింతలు కావడంతో న్యూఢిల్లీలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతే స్థాయిలో కాలుష్యం కూడా పెరిగింది. దీంతో అక్కడ ఈవీ కొనుగోళ్లపై ప్రభుత్వం పలు రాయితీలను అందిస్తోంది. దీంతో హైదరాబాద్ వంటి సిటీలో ప్రజలు పడకుండా ఉండేందుకు ఈవీ పాలసీని అమల్లోకి తెచ్చామన్నారు.

ఈ విధానం అమలు కోసం వికాస్ రాజ్, రవాణాశాఖ కమిషనర్ సురేంద్రమోహన్ లతో కలిసి నాలుగు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయశామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర అవసరాలకు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించిందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థలు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సైతం చొరవ చూపించాలని.. తద్వారా వాహన వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేయాలని మంత్రి కోరారు.
రవాణా, హోం, హెచ్ఎండీఏ తదితర శాఖల మధ్య సమన్వయం కోసం 10 రోజుల్లో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన కొన్ని రోజులు విధి విధానాలపై కలిసి పని చేయనున్నారు. ఇక అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.7 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ప్రతీ 100 వాహనాల్లో ఐదు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని చెప్పారు.


Click it and Unblock the Notifications








