హుస్సేన్ సాగర్లోకి బైక్ విసిరేసిన యూత్ కాంగ్రేస్ కార్యకర్త.. ఎందుకో తెలుసా?
ఒక వైపు దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తూ అధికంగా విజృంభిస్తూ ఎంతోమంది ప్రజల ప్రాణాలు హరిస్తుంటే, మరో వైపు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అమాంతంగా ఆకాశాన్నంటుతున్నాయా అన్నట్లు విపరీతంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో మరియు పారిశ్రామిక రాజధాని ముంబైలో పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ దాటేశాయి.

ఇప్పుడు ఈ పెట్రోల్ ధరలు దక్షిణ భారతదేశంలో కూడా ఏ మాత్రం తక్కువగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా ఏకంగా 100 రూపాయలు దాటేసింది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్య ప్రజలపై పెనుభారాన్ని మోపనుంది.

ఇందులో భాగంగానే పెట్రోల్ మరియు డీజిలు ధర పెరుగుదలను నిరసిస్తూ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ కార్యకర్త నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సులోకి బైక్ విసిరారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మరియు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ధరల పెంపును ఖండిస్తూ ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు.

ఈ నిరసనలో రాష్ట్ర యూనిట్ ప్రెసిడెంట్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్కా, ఎమ్మెల్యే టి జయప్రకాష్ రెడ్డి, ఎఐసిసి ప్రతినిధి దాసోజు శ్రావన్ తదితరులు పాల్గొన్నారు.

పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా 2021 జూన్ 11 న "సింబాలిక్ ప్రొటెక్ట్" నిర్వహిస్తున్నట్లు జూన్ 9 న కాంగ్రెస్ ప్రకటించింది. అనేక రాష్ట్రాల్లో ఇంధన ధరలు వంద రూపాయలను దాటింది. ఈ కారణంగానే నిరసన వ్యక్తం చేయడానికి వీధుల్లోకి రావాలని నిర్ణయించినట్లు ప్రతిపక్ష పార్టీ తెలిపింది.

పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సామాన్యుడిపై పెనుభారాన్ని మోపుతోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో పెట్రోల్ పెరుగుదల నిజంగా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ప్రస్తుతం రోజురోజుకి చాపకింద నీరులా ప్రవహిస్తున్న పెట్రో బాదుడు, నిత్యావసర వస్తువుల పెరుగుదలకు కూడా కారణమవుతోంది. ఇవన్నీ భవిష్యత్ లో కూడా ప్రజలను మరింత దుర్భర స్థితిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కావున ప్రభుత్వాలు దీనిపై తప్పకుండా స్పందించాలి, లేకుంటే ఈ ప్రభావం మున్ముందు ఎంత వరకు వెళ్తుంది తెలియదు.


Click it and Unblock the Notifications