కారు చోరీ చేసిన దొంగ.. ఏకంగా యాజమానికే బంపర్ ఆఫర్!
సాధారణంగా కార్ల దొంగతనాల గురించి ఇప్పటికే చాలా వినే ఉంటాం. ఒకసారి కారును దొంగతనం చేస్తే, మళ్లీ ఆ కారు అంతే సురక్షితంగా దొరికే అవకాశాలు చాలా తక్కువ. ప్రసుత్తం భారత్లో ఇలాంటి పరిస్థితే ఉంది. ఇలాంటి దొంగతనాల సమయంలోనూ కొన్ని ఆసక్తికర ఘటనలు జరుగుతుంటాయి. ఓ కారును ఎత్తుకెళ్లిన దొంగలు ఏకంగా యాజమానికే ఉత్తరం రాశారు.
అస్సోంలోని దర్రాంగ్ జిల్లా మంగళ్దై పట్టణంలో ఓ ఇంటి వద్ద ఉన్న మారుతి Brezza కారును ఓ దొంగలు తీసుకెళ్లిపోయారు. అంతేకాకుండా ఏకంగా కారు యాజమానికే ఉత్తరం రాశారు. కారును మూడు రోజుల్లో తిరిగి ఇస్తానని రాశారు. అంతవరకు ఈ విషయం ఎవరికీ చెప్పొందని కోరారు. ఈ విషయం పోలీసులకు చెబితే, కారు ఎప్పటికీ తిరిగి ఇవ్వనని బెదిరించారు.

దీంతో బాధితుడు అజీజ్ జనరం చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బెడ్ పక్కనున్న టేబుల్ నుంచి కారు తాళాలు ఎత్తుకెళ్లిన దొంగలు, ఇంటి ముందు ఉన్న కారును చోరీ చేశారని ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలో ఈ ఘటనపై పూర్తివివరాలు వెల్లడిస్తామన్నారు.
ఢిల్లీలోనూ ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి టయాటా ఫార్చ్యూనర్ కార్లను దొంగతనం చేస్తున్న కొందరు దొంగల బృందాన్ని పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. అయితే ఈ దొంగలు కూడా ఎప్పుడుపడితే అప్పుడు దొంగతనాలు చేయరని, అస్సోంలో ఎవరైనా టయాటా ఫార్చ్యూనర్ ఎస్యూవీ కార్లు కొనేందుకు ఆసక్తిచూపితే వెంటనే రంగంలోకి దిగి కార్లు చోరీ చేస్తారని పోలీసులు చెప్పారు. దొంగతనం చేసిన కార్లను తమవద్ద ఉంచుకోకుండా వెంటనే విక్రయిస్తారు. ఇలా మొత్తం 30 టయోటా ఫార్చ్యూనర్ ఎస్యూవీ కార్లు దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే ఈ దొంగల బృందం లక్ష్యం కేవలం టయోటా ఫార్చ్యూనర్ మాత్రమేనని తెలిపారు. ఢిల్లీ మరియు ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) ప్రాంతాల నుంచే ఎక్కువగా చోరీ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పశ్చిమ ఢిల్లీ సమీపంలోని పంజాబీబాగ్లో ఓ కారును దొంగతనం చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు, అక్కడ సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం ఆ కారు ఉత్తమ్నగర్లో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ కారుకు సంబంధించిన లైసెన్స్ ప్లేట్లను దొంగలు మార్చేసినట్లు తెలిపారు.
కారు దొంగలను పట్టుకొనేందుకు ప్రత్యేక పోలీసుల బృందాలను ఏర్పాటుచేశారు. దొంగతనం చేసి ఉత్తమ్నగర్లో దాచిపెట్టిన కారు సమీపంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. కొంత సమయం అనంతరం ఆ కారును తీసుకెళ్లేందుకు ఓలా క్యాబ్లో వచ్చిన దీపక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
సుమారు 15 గంటలపాటు నిరీక్షించిన పోలీసులు ఎట్టకేలకు ఆ దొంగను పట్టుకున్నారు. అనంతరం దొంగ వచ్చిన క్యాబ్ డ్రైవర్ పారిపోతుండగా, ఘటనస్థలానికి సమీపంలో ఉన్న మరో పోలీసుల బృందం అతన్ని కూడా అదుపులోకి తీసుకుంది. ఇద్దరు నిందితుల వద్ద తీసుకున్న సమాచారంతో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications








