రోడ్డుపై ఆకతాయితనం ప్రదర్శించిన యువకులు.. వారి ఆటకట్టించిన డ్యాష్బోర్డ్ కెమెరా.. వైరల్ అవుతున్న వీడియో
దేశంలో ప్రతి నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్య వైఖరి, అనుకోని సంఘటనలు ఇలా చాలా కారణాల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ప్రమాద తీరు మనకు తెలుస్తోంది. ఇటీవల కార్లలో ప్రవేశపెట్టిన డ్యాష్బోర్డు కెమెరాల ద్వారా ప్రమాద తీరు కళ్లకు కట్టినట్లుగా మనకు కనబడుతోంది.
రోడ్డు ప్రమాదాలు, అవి మిగిల్చే విషాదం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అనుకోని కారణాల వల్ల జరిగిన యాక్సిడెంట్స్కి ఎవరూ బాధ్యులు కాకపోయినా కొందరు ఆకతాయిలు చేసే పనికి ఏ పొరపాటు చేయని వారు నష్టపోవాల్సి వస్తుంది. తాజాగా బెంగళూరులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో చదివి తెలుసుకోండి.

ఈ ఘటన డీఎస్ఆర్ రివేరా, వర్తుర్లను కలుపుతూ కొత్తగా నిర్మించిన రోడ్డుపై చోటుచేసుకుంది. రోడ్డుపై హ్యుందాయ్ వెన్యూ మరియు 3 ద్విచక్ర వాహనాలు వెళుతున్నాయి. అందుకు సంబంధించిన దృశ్యాలు కారులోని డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి. వీడియోను పరిశీలిస్తే.. కొంతమంది యువకులు మూడు బైక్లపై కారు ముందు వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో కారు డ్రైవర్ బైక్ను ఓవర్టేక్ చేసేందుకు యత్నించారు.
అందుకోసం ముందున్న బైకర్లకు సిగ్నల్ ఇస్తూ హారన్ మోగించారు. కానీ ఆ బైకర్లు దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. అంతే కాకుండా హారన్ ఇస్తున్నా ఆ ముగ్గురిలో మరో బైకర్ కావాలనే బండికి దారి ఇవ్వకుండా అడ్డంగా వచ్చినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఇంకా బైక్ వేగాన్ని తగ్గించారు. ఇలా ముగ్గురూ ఇలాగే ప్రవర్తించడం వీడియోలో గమనించవచ్చు.

ఈ పరిస్థితిలో వెన్యూ డ్రైవర్ ఏం చేయలేక కారును నిలిపివేశాడు. దీంతో యువకులు సైతం తమ ద్విచక్ర వాహనాలను కారు ముందు నిలిపారు. అందులో ఓ యువకుడు కారు డ్రైవర్ వద్దకు వాగ్వాదం పెట్టుకున్నాడు. మరో యువకుడు ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి ఉద్దేశపూర్వకంగానే ఎస్యూవీ బంపర్ను ఢీకొట్టాడు. అంతేకాకుండా ఘర్షణకు దిగుతూ కారు విండ్షీల్డ్ను కూడా పగలగొట్టారు.
ఆ ముగ్గురిలో ఒకరు కారు డోరు తెరవడానికి ప్రయత్నించినట్లు వీడియోలో చూడవచ్చు. డ్రైవర్ వారికి క్షమాపణలు చెప్పినా వారు వినిపించుకోలేదు. ఇక చేసేదేం లేక.. డ్రైవర్ తన వాహనాన్ని రివర్స్ చేసి వెనుకకు మళ్లించారు. ఇదంతా డ్యాష్బోర్డు కెమెరాలో రికార్డవడంతో సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి వికృత ప్రవర్తన, గూండాయిజానికి తమ పరిధిలో చోటు లేదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది.
డ్యాష్బోర్డ్ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. అందులో కారులో వెళ్తున్న వ్యక్తిని రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్లపై కొందరు యువకులు ఓవర్టేక్ చేసేందుకు యత్నించాకు. అంతేకాకుండా కారును ఆపాలని బలవంతం చేయడం, డ్రైవర్పై దాడికి పాల్పడేందుకు యత్నించారు. కారు డ్రైవర్ వారిని అభ్యర్థించినా వారు వినిపించుకోలేదు. ఈ వీడియో వైరల్గా మారింది.

డ్యాష్బోర్డ్ కెమెరాల ద్వారా ఇలాంటి ఘటనలు ఇప్పటివరకూ చాలా వెలుగులోకి వచ్చాయి. ఇవి పబ్లిక్ రోడ్లపై జరిగే ప్రమాదాలే కాకుండా ఎవరు నేరానికి పాల్పడ్డారో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ ఫుటేజ్లు పోలీసులకు తప్పెవరిదో నిరూపించేందుకు అమూల్యమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. బీమా క్లెయిమ్లను దాఖలు చేసే ప్రక్రియను సులభతరం చేస్తుంది. అంతేకాకుండా, అధునాతన డ్యాష్బోర్డ్ కెమెరాలు మోషన్-డిటెక్షన్ టెక్నాలజీతో అమర్చబడి ఉంటాయి.


Click it and Unblock the Notifications








