Titan submersible సముద్రంలో పేలిపోయిన టైటాన్ సబ్మెర్సిబుల్.. ఐదుగురు పర్యాటకులు చనిపోయినట్లు వెల్లడి
టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన టైటానిక్ సబ్ మెరైన్ కథ విషాదాంతమైంది. అధిక పీడనం వల్ల సబ్ మెరైన్ పేలిపోయి అందులోని ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సహాయంతో జలాంతర్గామి శకలాలను గుర్తించినట్లు పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
టైటానిక్ శకలాలను చూసేందుకు టైటాన్ జలాంతర్గామి(Titan SubMersible)లో ఐదుగురు పర్యాటకులు(బిలీయనీర్లు) ఈ నెల 18న సముద్రగర్భంలోకి వెళ్లారు. ప్రయాణం మొదలుపెట్టిన రెండు రోజులకే దాని ఆచూకీ గల్లంతైంది. దీంతో అమెరికా కోస్ట్ గార్డులు సబ్ మెరైన్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. ఈ క్రమంలోనే గల్లంతయిన జలాంతర్గామిలో పర్యాటకులు మరణించారని నిర్ధారణకు వచ్చారు.

టైటానిక్ నౌక సమీపంలో 488 మీటర్ల దూరంలో జలాంతర్గామి శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ పేర్కొంది. వెంటనే మరణించిన వారి కుటుంబాలకు దీని గురించి సమాచారం అందించినట్లు యూఎస్ కోస్ట్గార్డ్ రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ వెల్లడించారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని యూఎస్ కోస్ట్ గార్డ్, రెస్య్కూ సిబ్బంది తరఫున ఆయన పేర్కొన్నారు.
తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ టీమ్స్ : న్యూఫౌండ్లాండ్ రాజధాని సెయింట్ జాన్స్కు తూర్పున 1,450 కి.మీ మరియు దక్షిణాన 643 కి.మీ దూరంలో టైటాన్ సబ్మెరైన్ ఉన్నట్లు మొదటగా గుర్తించారు. దీనికి సంబంధించిన సంకేతాలు కూడా అందాయి. అయితే వీటిని కనుగొనడంలో రెస్క్యూ టీం విఫలమైంది. అప్పటికే యూఎస్ కోస్ట్ గార్డ్ అంచనాల ప్రకారం, టైటాన్ నౌకలో దాదాపు 20 గంటల ఆక్సిజన్ మిగిలి ఉన్నట్లు అంచనా వేశారు.

సబ్ మెరైన్ రెస్క్యూ ఆపరేషన్ లో కెనడా నౌకాదళం, వైమానిక దళం మరియు కోస్ట్ గార్డ్, అలాగే న్యూయార్క్ స్టేట్ ఎయిర్ గార్డ్ నుండి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమించాయి. ఫ్రెంచ్ పరిశోధనా నౌక మరియు లోతైన సముద్ర పరిశోధన, పునరుద్ధరణ కార్యకలాపాలలో నైపుణ్యం కలిగిన బ్రిటిష్ సంస్థ మాగెల్లాన్ కూడా ఈ మిషన్లో భాగస్వామ్యం అయ్యింది. అయినా కానీ వారి ఆచూకీని కనిపెట్టలేకపోయారు.
నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో 1912లో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో ఈ నెల 18 న న్యూఫౌండ్ల్యాండ్ నుంచి ఈ సబ్ మెరైన్ బయలుదేరింది. ఇందులో ఫ్రెంచ్ నేవీ మాజీ అధికారి పాల్ హెన్రీ (77), ఓషన్గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ (61), పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్ (48), ఆయన కుమారుడు సులేమాన్ (19), బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ (58)లు ప్రయాణించారు.

బయలుదేరిన కొద్ది గంటల్లోనే సబ్ మెరైన్తో రాడార్కు సంబంధాలు తెగిపోయాయి. గల్లంతైన సబ్ మెరైన్ ఆచూకీని గుర్తించడానికి కెనడా, అమెరికా కోస్ట్గార్డ్ దళాలు రంగంలోకి దిగి మూడు రోజుల పాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 13 వేల అడుగుల లోతున్న చోట ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను జారవిడిచారు. పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలోకి దింపారు.
ఇందులో 30 గంటలకు సరిపడే ఆక్సిజన్ నింపారు. అత్యవసర పరిస్థితుల్లో 96 గంటలకు సరిపడేలా ఏర్పాట్లు ఉండటంతో సమయం గడిచే కొద్దీ ఉత్కంఠ నెలకొంది. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 7 గంటల వరకు ఆక్సిజన్ సరిపోతుందని నిపుణులు అంచనా వేశారు.
మంగళవారం నుంచి టైటాన్ సబ్మెరైన్ తప్పిపోయిన ప్రాంతంలో కొన్ని శబ్దాలు వినిపించినట్లు అమెరికా కోస్ట్గార్డ్ వెల్లడించింది. దీంతో రెస్క్యూ సిబ్బంది అక్కడ గాలించినా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అయితే ఆ శబ్దాలు టైటానిక్కు సంబంధించినవి కావని తర్వాత పేర్కొంది. గురువారం సాయంత్రం రిమోట్ ఆపరేటేడ్ వెహికల్ సహాయంతో టైటానిక్ నౌకకు సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్గార్డ్ ప్రకటన విడుదల చేసింది.
కాగా, కార్బన్ ఫైబర్, టైటానియంతో తయారుచేసిన మినీ-జలాంతర్గామి పొడవు 6.7 మీటర్లుగా ఉంది. ఒక పైలట్తో పాటు ఐదుగురు కూర్చునే సామర్థ్యం కలిగిన ఈ జలాంతర్గామి గరిష్ఠంగా 4,000 మీటర్ల లోతు వరకు ప్రయాణించేలా రూపొందించడం జరిగింది. సురక్షితంగా ఉపరితలంపైకి తిరిగి రావడానికి తగినంత సమయంతో ముందస్తు హెచ్చరికలను పైలట్కు అందించింది.
టైటానిక్ నౌక వైపు సబ్మెరైన్ ప్రయాణం ప్రారంభించిన సుమారు 1.45 గంటల తర్వాత ఉపరితలంపై ఉన్న నౌకతో సంబంధాలు తెగిపోయిన తర్వాత ఎటువంటి సందేశాలు అందలేదు. సుమారు 3,800 మీటర్ల లోతులో ఉన్న శిథిలాల వరకు డైవ్లతో సహా ఎనిమిది రోజుల పర్యటన కోసం వారు $250,000 ( ఒక్కో వ్యక్తి ఈ సాహస యాత్ర కోసం రూ. రెండు కోట్లు) టిక్కెట్ ధర చెల్లించారు.
ఈ క్రమంలో టైటానిక్ మునిగిపోయిన ప్రదేశంపై జేమ్స్ కామెరూన్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అనేకసార్లు ఆ ప్రాంతాన్ని సందర్శించిన వ్యక్తిగా.. ఆయన తన అనుభవాన్ని తెలిపారు. ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతం ఒకటని చెప్పారు. మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూడటమంటే తనకెంతో ఆసక్తి అని, అందుకే టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లినట్లు తెలిపారు.
టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలన్న కోరితోనే సినిమాను తెరకెక్కించానని, అంతకుమించి ప్రత్యేకంగా దాన్నొక సినిమాగా తీసే ఉద్దేశం కాదని ఆయన తెలిపారు. 1995లో తొలిసారి ఓ రష్యన్ సబ్మెరైన్లో ప్రయాణించి టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని జేమ్స్ కామెరూన్ వీడియో చిత్రీకరించి తీసుకొచ్చారు. 1912 ఏప్రిల్ 15న నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఐస్ బర్గ్ను ఢీ కొని సముద్రగర్భంలో మునిగిపోయిన ఈ ఘోర ప్రమాదంలో 1500 మంది జలసమాధి అయ్యారు.
తాజాగా జరిగిన టైటానిక్ మినీ సబ్మెరైన్ ప్రమాదంపై ఆయన స్పందించారు. ఈ సబ్ మెరైన్లో భద్రత గురించిన విషయాలను మరచిపోయారని, దాని కారణంగానే ఐదుగురు మరణించారని వెల్లడించారు. ఈ ఘటన 1912లో జరిగిన టైటానిక్ షిప్ ప్రమాదాన్ని గుర్తు చేసిందన్నారు. హెచ్చరికలను పట్టించుకోకుండా జలాంతర్గామిలో టైటానిక్ శకలాల వద్దకు వెళ్లడం కారణంగానే ఇంతటి విషాదం జరిగిందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








