గడచిన ఐదేళ్లలో భారత్ వదలి వెళ్లిపోయిన ఆటోమొబైల్ కంపెనీలు.. ఈ బ్రాండ్లన్నీ మీకు తెలిసినవే!
రెండు దశాబ్ధాల క్రితం భారత ఆటోమొబైల్ పరిశ్రమకు మరియు ప్రస్తుత భారత ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ 20 ఏళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ రాకెట్ వేగంతో వృద్ధిని సాధించింది. ఈ సమయంలో అనేక దేశీయ కంపెనీలు తమ మార్కెట్ పరిమాణాన్ని పెంచుకుంటే, మరికొన్ని అంతర్జాతీయ కంపెనీలు మనదేశంలోకి ప్రవేశించి వ్యాపారం చేయడం ప్రారంభించాయి. ఈ పరిమాణాల నేపథ్యంలో భారత ఆటోమొబైల్ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ కూడా తీవ్రతరమైంది.

ప్రస్తుతం, భారతదేశంలో ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా అవతరించింది. ఇటీవలి పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు యాజమాన్య ఖర్చుల కారణంగా కంపెనీల మార్కెట్ వృద్ధి మందగించినప్పటికీ, వాహనాల కొనుగోలు విషయంలో మాత్రం భారత కస్టమర్లు ఎక్కడా తగ్గడం లేదు. అయితే, భారతదేశంలో అన్ని ఆటోమొబైల్ కంపెనీల పరిస్థితి ఒకేలా ఉండదు. కొన్ని కంపెనీలు పూర్తిగా వృద్ధి బాటలో నడుస్తే, మరికొన్ని కంపెనీలు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయి. ఇంకొన్ని కంపెనీలు నష్టాలు వస్తున్నప్పటికీ, మంచి రోజులు రాకపోతాయా అనే ఆశతో వ్యాపారం చేస్తున్నాయి.

ఉదాహరణకు, దేశీయ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కియా మోటార్స్, ఎమ్జి మోటార్ వంటి కంపెనీలు ఆధునిక టెక్నాలజీతో తీసుకువచ్చిన వాహనాలు మరియు అత్యుత్తమ కస్టమర్ సర్వీస్తో దేశీయ వినియోగదారులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అలాగే, టాటా మోటార్స్ మరియు మహీంద్రా వంటి కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా తమ కస్టమర్ బేస్ను మరింత పెంచుకుంటున్నాయి. అయితే, జనరల్ మోటార్స్, ఫియట్, ఫోర్డ్ మరియు హ్యార్లీ డేవిడ్సన్ వంటి కంపెనీలు మాత్రం ఇక్కడి మార్కెట్లో నిలబడలేక తమ దేశాలకు తిరిగి వెళ్లిపోయాయి.

తాజాగా, ఇప్పుడు జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్కు చెందిన సబ్ బ్రాండ్ డాట్సన్ కూడా భారత మార్కెట్ నుండి నిష్క్రమించింది. గడచిన ఐదేళ్ల కాలంలో మొత్తం ఏడు ఆటోమొబైల్ కంపెనీలు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాయి. ఇందులో కొన్ని ఆటోమొబైల్ కంపెనీల పేర్లు మీకు బాగా సుపరిచితమైనవే, అవేంటో చూద్దాం రండి.

1. డాట్సన్ (Datsun) - ఏప్రిల్ 2022
జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) 2013 సంవత్సరంలో భారత మార్కెట్పై భారీ ఆశలతో తమ తమ చవక కార్ బ్రాండ్ డాట్సన్ (Datsun) దాదాపు 30 సంవత్సరాల తర్వాత తిరిగి రీలాంచ్ చేసింది. అయితే, క్రమంగా ఈ బ్రాండ్కి ఆదరణ తగ్గడం, ఫలితంగా అమ్మకాలు మందగించడంతో, నిస్సాన్ భారతదేశం నుండి డాట్సన్ బ్రాండ్ను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం, డాట్సన్ బ్రాండ్ నుండి మార్కెట్లో లభిస్తున్న ఏకైక మోడల్ డాట్సన్ రెడి-గో (Datsun Redi-GO) ఉత్పత్తిని కూడా నిలిపివేస్తున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే డాట్సన్ రెడి-గో మోడల్ అమ్మకాలు జరుగుతాయని కంపెనీ పేర్కొంది.

డాట్సన్ ఇప్పటికే భారత మార్కెట్లో గో హ్యాచ్బ్యాక్ మరియు గో+ ఎమ్పివి కార్లఉత్పత్తిని కూడా నిలిపివేసింది. ఇకపై ఈ బ్రాండ్ కార్లను తయారు చేయబోమని డాట్సన్ ప్రకటించింది. రష్యా, ఇండోనేసియాలో ఇప్పటికే ఈ బ్రాండ్ను నిలిపివేసిన నిస్సాన్, తాజాగా భారతదేశంలో కూడా నిలిపివేసింది. ఈ మేరకు నిస్సాన్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో డాట్సన్ రెడీ-గో ఉత్పత్తిని నిలిపివేసినప్పటికీ, ఈ బ్రాండ్ కోసం ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కొనసాగుతాయని మరియు స్పేర్ పార్ట్స్ మరియు వారంటీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని డాట్సన్ పేర్కొంది. గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రాటజీలో భాగంగా డాట్సన్ బ్రాండ్ను నిలిపివేస్తున్నట్లు నిస్సాన్ తెలిపింది.

2. ఫోర్డ్ (Ford) - సెప్టెంబర్ 2021
ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు ఫోర్డ్ ఎండీవర్ వంటి ఎన్నో అద్భుతమైన వాహనాలను అందించిన అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ ఇండియా కూడా గతేడాది భారత మార్కెట్ విడిచి తమ స్వదేశానికి వెళ్లిపోయింది. గుజరాత్ మరియు తమిళనాడులో ఉన్న తమ రెండు తయారీ కేంద్రాలలో వాహనాల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఫోర్డ్ గతేడాది ప్రకటించింది. గడచిన పదేళ్ల కాలంలో ఫోర్డ్, భారతదేశంలో భారీ నష్టాలను చవిచూస్తూ వచ్చింది. ఇకపై ఈ నష్టాలను తాము భరించలేమని, అందుకే ఇక్కడి మార్కెట్లో తమ వ్యాపారాన్ని నిలిపివేస్తున్నామని ఫోర్డ్ ఇండియా తెలిపింది.

సమాచారం ప్రకారం, ఫోర్డ్ గత దశాబ్దంలో భారతదేశంలో 2 బిలియన్ల డాలర్లకు పైగా నిర్వహణ నష్టాలను చూసింది. మరోవైపు మార్కెట్లో ఫోర్డ్ వాహనాలకు కూడా డిమాండ్ పూర్తిగా మందగించింది. ఫోర్డ్ ఇండియా కూడా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్కి అనుగుణంగా వాహనాలను అప్డేట్ చేయడంలో విఫలమైంది. ఈ కారణాల వలన ఫోర్డ్ భారత్కు దూరమైంది. ఈ అమెరికన్ కంపెనీ భారతదేశంలో దాదాపు 25 సంవత్సరాలుగా కార్లను తయారు చేస్తూ వచ్చింది. కానీ, మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా కంపెనీ నిలబడలేకపోయింది. భారత్ నుండి నిష్క్రమించినప్పటికీ, తమ వినియోగదారులకు సేవలం అందిస్తూనే ఉంటామని, వీలైతే ఇంపోర్టెడ్ కార్లను ఇక్కడి మార్కెట్లో దిగుమతి చేసుకొని విక్రయిస్తామని కంపెనీ తెలిపింది.

3. హ్యార్లీ డేవిడ్సన్ (Harley Davidson) - సెప్టెంబర్ 2020
హ్యార్లీ డేవిడ్సన్ బ్రాండ్ కూడా అమెరికాకు చెందినదే. భారత మార్కెట్లో ప్రీమియం మోటార్సైకిళ్లకు పెరుగుతున్న డిమాండ్ను చూసిన హ్యార్లీ డేవిడ్సన్ ఇక్కడి మార్కెట్లో అద్భుతాలను సృష్టించాలని భారత్లోకి ప్రవేశించింది. మొదట్లో ఈ బ్రాండ్ అమ్మకాలు జోరుగానే సాగినప్పటికీ, వాటి ప్రీమియం ధర మరియు మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా హ్యార్లీ డేవిడ్సన్ తన భారత వ్యాపారాన్ని త్వరలోనే ముగించాల్సి వచ్చింది. భారతదేశంలో ఇప్పుడు హ్యార్లీ డేవిడ్సన్ కార్యక్రమాలను దేశపు అతిపెద్ద టూవీలర్ బ్రాండ్ అయిన హీరో మోటోకార్ప్ నిర్వహిస్తోంది. హ్యార్లీ డేవిడ్సన్ నిష్క్రమించడంతో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి.

4. ఫియట్ (Fiat) - మార్చి 2019
భారతదేశంలో పురాతన కార్ల తయారీ కంపెనీలలో ఇటలీకి చెందిన ఫియట్ బ్రాండ్ కూడా ఒకటి. ఈ కార్లకు 1990వ దశకంలో మంచి డిమాండ్ ఉండేది. ఫియట్ ఇతర బ్రాండ్ కార్ల కోసం ఇంజన్లను కూడా తయారు చేసేది. అయితే, భారత కార్ మార్కెట్లో పెరిగిన పోటీ ముంది ఫియట్ ధైర్యంగా నిలబడలేకపోయింది. ఫియట్ బ్రాండ్ భారతదేశాన్ని విడిచే సమయానికి లీనియా, అర్బన్ క్రాస్, పుంటో ఇవో మరియు అవెంచురా వంటి అద్భుతమైన కార్లను విక్రయించింది. ఫియట్ జనవరి 2019లో భారతదేశంలో తమ వాహనాల ఉత్పత్తిని నిలిపివేసింది మరియు మార్చి నెలలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది.

5. యూఎమ్ మోటార్సైకిల్స్ (UM Motorcycles) - అక్టోబర్ 2019
అమెరికాకు చెందిన మరొక టూవీలర్ బ్రాండ్ ఇది. యూఎమ్ మోటార్సైకిల్స్ మన మార్కెట్లోకి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిపోయిందో ఇంకా చాలా మందికి తెలియదు. భారత మార్కెట్లో యూఎమ్ రెనెగేడ్ కమాండో, యూఎమ్ రెనెగేడ్ స్పోర్ట్ ఎస్ మరియు యూఎమ్ రెనెగేడ్ క్లాసిక్ వంటి ప్రీమియం మోటార్సైకిళ్లను విక్రయించిన ఈ అమెరికన్ బ్రాండ్, హ్యార్లీ డేవిడ్సన్కి పోటీగా తమ ద్విచక్ర వాహనాలను విక్రయించాలని చూసింది. భారతదేశంలో లోహియా ఆటో సహకారంతో కార్యకలాపాలను ప్రారంభించింది. అయితే, ఇది భారత్కు కొత్త బ్రాండ్ కావడం, విడిభాగాల నాణ్యతపై విమర్శలు, రాయల్ ఎన్ఫీల్డ్ నుండి పెరిగిన పోటీ మరియు నెగిటివ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ కారణంగా యూఎమ్ మోటార్సైకిల్స్కు భారత్లో సుపరిచత స్థానం లభించలేదు.

6. ఐషర్ పొలారిస్ (Eicher Polaris) - మార్చి 2018
నిష్క్రమణకు ముందు భారతదేశంలో విక్రయించబడిన కార్లు- ఐషర్ పొలారిస్ మల్టీక్స్
భారతీయ ఆటోమొబైల్ కంపెనీ ఐషర్తో కలిసి ఇక్కడి వినియోగదారులకు ATV (ఆల్-టెరైన్ వెహికల్) వాహనాలను అందించాలనే ఉద్దేశ్యంతో అమెరికా నుండి ఇండియాకు వచ్చింది పోలారిస్ బ్రాండ్. ఈ మేరకు ఓ జాయింట్ వెంచర్ కూడా ఏర్పాటైంది. ఈ జేవీ ఏటివి విభాగంలో ఓ కొత్త విప్లవాన్ని సృష్టిస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే, ఆ అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. ఏటివిలపై అవగాహన పెంచేందుకు పోలారిస్ ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ, అందరూ చూసి వెళ్లినవారే తప్ప, వీటిని కొన్నవారు లేరు. పెరిగిన ఖర్చులు, తగ్గిన అమ్మకాల నేపథ్యంలో ఐషర్ పొలారిస్ మార్చి 2018లో భారత్లో తమ వ్యాపారానికి స్వస్తి పలికింది.

7. జనరల్ మోటార్స్ (General Motors) - డిసెంబర్ 2017
భారతదేశాన్ని విడిచి వెళ్లిన మరొక అమెరికన్ ఆటో బ్రాండ్ జనరల్ మోటార్స్. ఈ బ్రాండ్ 1996లో ఒపెల్ బ్రాండ్తో భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు, ఆరంభంలో మంచి విజయాలను చూసింది. ఆ తర్వాత 2003లో షెవర్లే బ్రాండ్తో స్వంతంగా కార్లను ప్రవేశపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. ప్రారంభంలో ఈ అమెరికన్ కార్లకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, క్రమేనా అమ్మకాలు తగ్గుతూ వచ్చాయి. ఈ బ్రాండ్ నుండి వచ్చిన ఒపెల్ ఆస్ట్రా, ఒపెల్ కోర్సా, షెవర్లే ఆప్ట్రా, తవేరా, క్రూజ్ మరియు బీట్ వంటి వాహనాలు మార్కెట్లో కస్టమర్లను బాగా ఆకర్షించాయి. తగ్గిన అమ్మకాలు పెరిగిన నష్టాలతో ఈ బ్రాండ్ డిసెంబర్ 2017లో భారత్కు బైబై చెప్పింది.

ఈ జాబితాను గమనిస్తే, డాట్సన్ (జపాన్) మరియు ఫియట్ (ఇటలీ) బ్రాండ్లు మినహా మిగిలిన ఐదు ఆటోమొబైల్ బ్రాండ్లు కూడా అమెరికాకు చెందినవే కావడం గమనార్హం. ఈ ట్రెండ్ చూస్తుంటే, బహుశా భారతదేశం అమెరికన్ ఆటోమొబైల్ బ్రాండ్లకు అంతగా కలిసొచ్చినట్లు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్లోకి ప్రవేశించాలని చూస్తున్న టెస్లా, ఫిస్కర్ మరియు బిలిటీ వంటి కొత్త ఆటోమొబైల్ కంపెనీల భవిష్యత్తు ఏవిధంగా ఉండబోతుందో అనే సందేహాలు తలెత్తుతున్నాయి.


Click it and Unblock the Notifications








