కారుని ఏకంగా ఇల్లుగా మార్చేసిన దంపతులు.. మహా కుంభమేళాలో ఇప్పుడు వీరే హాట్ టాపిక్!
ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా... సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తనకు నచ్చిన విభిన్న వీడియోలను, ఫొటోలను 'ఎక్స్' వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ఆయన పోస్ట్ చేసిన తర్వాత వైరల్గా మారిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఓ కన్నడ జంట కూడా చేరిపోయింది. కర్ణాటకకు చెందిన ఈ భార్యాభర్త.. తమ టయోటా ఇన్నోవా ఎంపీవీని ఒక ఇల్లు (మొబైల్ హోమ్)గా మార్చేశారు. హాయిగా అందులో నివసిస్తూ నచ్చిన ప్రాంతానికి వెళ్తున్నారు. మహాకుంభమేళాలో కనిపించిన ఈ కపుల్స్ పాపులర్ అయిపోయారు. వీరి ఇంటర్వ్యూ కోసం కూడా మీడియా ఛానెల్స్ ఎగబడుతున్నాయి. అసలు వీళ్లకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? వీళ్ల ప్లాన్స్ ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.
ఆనంద్ మహీంద్రా తన 'ఎక్స్' ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దానికి ఆయన "అవును.. నేను ఇలాంటి ఆవిష్కరణలకు పూర్తిగా ఆకర్షితుడిని అవుతాను. వాళ్లు మహీంద్రా కారును అలా ఉపయోగించి ఉంటే నేను మరింత ఆకర్షితుడిని అయ్యే వాడిని" అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చారు.

కర్ణాటకకు చెందిన ఈ దంపతులు.. నేపాల్కు రోడ్ ట్రిప్ వేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా వాళ్లు ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళాకు చేరుకుని, కొన్ని రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం వాళ్లు తమ టయోటా ఇన్నోవా ఎంపీవీని రూ.2 లక్షల ఖర్చులో ఇలా ఇంటిలాగా మార్చేశారు.
ఈ కారు వెనుక భాగంలో వాళ్లు ఓ కిచెన్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఓ గ్యాస్ స్టవ్ కూడా అమర్చుకున్నారు. ఈ కారు టాప్ పైన ఓ టెంట్ లాంటిది కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని వీళ్లు బెడ్ రూమ్ తరహాలో వాడుకుంటున్నారు. ఈ కారు ముందు వైపు ఓ సోలార్ ప్యానెల్ను అమర్చి, విద్యుత్తు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ దంపతుల ఐడియాను మెచ్చుకుంటున్నారు. తాము కూడా ఇలా తమ కారును మార్చి, అందులో ట్రావెల్ చేస్తామని కామెంట్లు పెడుతున్నారు. వీళ్ల వీడియోను షేర్ చేసి మురిసిపోతున్నారు. శివరాత్రి వరకు ప్రయాగ్రాజ్లోనే ఉండాలని చూస్తున్నామని ఈ జంట చెబుతోంది.
ఇక టయోటా ఇన్నోవా ఎంపీవీ విషయానికి వస్తే.. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రెండు వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. ఇన్నోవా హైక్రాస్ మోడల్ ధర రూ.19.94 లక్షల నుంచి రూ.31.34 లక్షల మధ్య ఉంది. ఇది 2- లీటర్, హైబ్రిడ్(పెట్రోల్+ఎలక్ట్రిక్)తో వస్తుంది. దీంట్లో నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.. 16.13 నుంచి 23.24 కేఎంపీఎల్ మైలేజీ అందించగలదు.
ఈ కొత్త టయోటా ఎంపీవీ.. 7/8 ఆప్షన్తో వస్తుంది. దీంట్లో 8- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇక దీని సేఫ్టీ విషయానికి వస్తే దీంట్లో 6 ఎయిర్ బ్యాగులు, ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం), 360 డిగ్రీ- కెమెరా వంటివి ఉంటాయి.
టయోటా ఇన్నోవా క్రిస్టా మోడల్ను పరిశీలిస్తే ఇది రూ.19.99 లక్షల నుంచి రూ.26.55 లక్షల ఎక్స్- షోరూమ్ ధరలో అందుబాటులో ఉంది. ఇది 2.4- లీటర్ డీజిల్ ఇంజిన్తో ఉంటుంది. దీంట్లో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇది 8 కేఎంపీఎల్ మైలేజీ అందిస్తుంది.
ఈ ఎంపీవీ మోడల్ కూడా 7/8 సీట్ ఆప్షన్తో వస్తుంది. దీంట్లో 8- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్- ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీంట్లో 7- ఎయిర్ బ్యాగులు, VSC (వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్), ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి.


Click it and Unblock the Notifications








