ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులకు టాయోటా ఇన్నోవా కార్లు!
నిన్నటి వరకు స్వంత వ్యాగన్ఆర్ కారులో తిరిగిన సామాన్యుడి పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు విలాసవంతమైన టొయోటా ఇన్నోవా కారును ఉపయోగించనున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులకు ఢిల్లీ సర్కారు టయోటా ఇన్నోవా కార్లను కేటాయించింది.
తొలి రోజున మెట్రో రైలు, ఆటోరిక్షా, ఎలక్ట్రిక్ రిక్షాల్లో అసెంబ్లీకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు మనీష్ సిసోడియా, రాఖీ బిర్లా, సరబ్ భరద్వాజ్లు శుక్రవారం నాడు ఢిల్లీ అసెంబ్లీ కాంప్లెక్స్కు తమ అధికార వాహానాల్లో చ్చారు. విలాసవంతమైన కార్లలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు రావడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది.

దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ, ఎర్ర బుగ్గ కార్లను (రెడ్ బీకాన్ కార్స్) మాత్రమే ఉపయోగించమని చెప్పామని, అధికార వాహనాల్లో తిరగమని తామెన్నడూ చెప్పలేదని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ సహకారంతో విశ్వాస తీర్మాన పరీక్ష నెగ్గిన మరుసటి రోజును ఆ పార్టీ మంత్రులు విలాసవంతమైన కార్లలో అసెంబ్లీకి రావటంపై అనేక విమర్శలు వస్తున్నాయి.
అలాగే, అరవింద్ కేజ్రీవాల్కు కూడా ఢిల్లీ సర్కారు ఐదు పడకల గదిని కేటాయించడం, తొలుత ఆయన దానిని అంగీకరించడం, ఆ తర్వాత విమర్శలు పెల్లుబకడంతో తిరిగి ఆ ఇంటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడం అంతా ఓ పెద్ద నాటకంగా ఉందని కూడా ఆయనపై విమర్శలు వస్తున్నాయి.

ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బస్సులు, మెట్రో రైళ్లు, ఆటోరిక్షాల్లో ప్రయాణించినప్పుడు దేశమంతా హర్షించి వారికి బ్రహ్మరథం పట్టింది. తాజాగా వారు ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాహనాలను ఉపయోగించడంతో ఇప్పుడు సామాన్య మంత్రులు కూడా అందరు రాజకీయనాయకుల మాదిరిగానే మారిపోతున్నారని ప్రజలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








