రెండు గంటల్లోనే రూ.29.5 లక్షల జరిమానాలు, పోలీసుల రికార్డ్
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే మోటారిస్టులకు పోలీసులు భారీ జరిమానాలతో సమాధానం చెబుతున్నారు. ఇలాంటి వారి నుండి కేవలం రెండు గంటల వ్యవధిలోనే అత్యధికంగా రూ.29.5 లక్షల జరిమానాలను వసూలు చేశారు బెంగుళూరు పోలీసులు.

బెంగుళూరు నగర వీధుల్లో ‘ఆపరేషన్ సర్ప్రైజ్ చెక్' పేరిట ట్రాఫిక్ పోలీసులు మోటార్ వాహన తనిఖీలను నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను విధించారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్లో కేవలం రెండు గంటల వ్యవధిలో దాదాపు రూ.29.5 లక్షల జరిమానాలను వసూలు చేశారు.

ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చాలా మంది మోటారిస్టులు హెల్మెట్ ధరించకుండా బైక్లు నడపడం, వన్ వే వీధుల్లో వ్యతిరేక దిశలో ప్రయాణించడం, సేఫ్టీ సీట్ బెల్టులు ధరించకుండా డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా రైడ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లో మాట్లాడటం మరియు పేవ్మెంట్లపై ప్రయాణించడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

గత సోమవారం నగరంలోని 178 ప్రదేశాలలో ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య బెంగుళూరు నగర ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఈ ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు.

ఇందులో 44 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొని 6,247 కేసులను నమోదు చేశారు. ఈ కేసుల ద్వారా రూ.29,47,50 జరిమానాలను వసూలు చేసినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) బిఆర్ రవికాంత్ గౌడ తెలిపారు.

బిఆర్ రవికాంత్ గౌడ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రత్యేక డ్రైవ్ను ఇదివరకు ట్రాఫిక్ ఉల్లంఘనలను తనిఖీ చేయని ప్రదేశాలలో నిర్వహించామని, అలాంటి ప్రాంతాల్లో మోటారిస్టులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు కాబట్టే ఇంత అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయని, నగరంలో ఇలాంటివి 178 ప్రదేశాలను గుర్తించామని ఆయన చెప్పారు.

నగరంలో ఉల్లంఘనలను నియంత్రించడానికి రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సర్ప్రైజ్ చెక్లను చేస్తామని, నిబంధనలు అతిక్రిమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రవికాంత్ చెప్పారు.

ఇదిలా ఉంటే, డిసెంబర్ 13 నుండి 19 మధ్య కాలంలో బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులు 78,754 కేసులను నమోదు చేసి, మోటారిస్టుల నుండి వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనల క్రింద రూ.4,02,07,200 జరిమానాలను వసూలు చేశారు.


Click it and Unblock the Notifications