ఐడియా అదిరింది.. లోకల్ ట్రైన్లో ఫైవ్ స్టార్ హోటల్.. టేస్టీ ఫుడ్కి ఫిదా అవుతున్న ప్రయాణికులు
గత కొన్నేళ్లుగా భారత్లో స్టార్టప్లు చాలా పుట్టుకొచ్చాయి. ఔత్సాహికులు సరికొత్త ఆలోచనలతో ముందుకొస్తూ తమకంటూ ఓ గుర్తింపును తెచ్చిపెట్టుకుంటున్నారు. కాగా మెట్రో పాలిటన్ నగరాల్లో ఫుడ్ లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఎక్కడ చూసినా విచ్చలవిడిగా రెస్టారెంట్లు, స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ దర్శనమిస్తుంటాయి.
కానీ మీరెప్పుడైనా రన్నింగ్ ట్రైన్(Five Star Hotel in Mumbai Local Train)లో రెస్టారెంట్ చూశారా.??.. సర్వీసు అయిపోయిన రైలు బోగీలను రెస్టారెంట్ ఆన్ వీల్స్గా మార్చడం చూసి ఉంటారు. కానీ మీరు ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా రెస్టారెంట్లో కూర్చున్న అనుభూతిని ఫేస్ చేశారా.. లేదు కదా.. అయితే ఈ స్టోరీ మీకోసమే..

మంబయిలోని లోకల్ ట్రైన్లో వినూత్నంగా ఫైవ్ స్టార్ హోటల్ను ఏర్పాటు చేశారు. ఈ హోటల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముంబయి మహానగరం ఎప్పుడూ ఉరుకులు పరుగులతో ఉంటుంది. అక్కడ జనాలకి లోకల్ ట్రైన్లో ప్రయాణించనిదే రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. స్కూల్ పిల్లల నుంచి మొదలుకొని ఆఫీసులకు వెళ్లేవారు, రోజు వారీ కూలీల జీవితంలో లోకల్ ట్రైన్ అంతర్భాగమైపోయింది.
ఈ సమయంలో ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న లోకల్ ట్రైన్లో ఫైవ్ స్టార్ హోటల్ను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు. అయితే లోకల్ రైల్లో ఇలాంటి క్రియేటివిటీని అమలు చేసిన వారెవరంటే ఇద్దరు యువకులు. సాధారణంగా రైల్వే స్టేషన్లలో తిను బండారాలు దొరుకుతాయి. కానీ ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆకలిగా అనిపించినా తినడానికి ఏమీ దొరకదు.

అలాంటి వారి కోసమే.. రైలు ప్రయాణంలో ఉండగానే హోటల్లో తిన్న అనుభూతిని కలిగిస్తున్నారు ఇద్దరు యువకులు.. ఆర్యన్ కటారియా, సార్థక్ సచ్దేవా. ముంబయి లోకల్ రైల్లో ఈ వింత హోటల్ సెటప్ చేశారు. ఈ వీడియోను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వీరి ఐడియాకి ప్రయాణికులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వీడియోను పరిశీలించినట్లయితే ముంబయి లోకల్ ట్రైన్ కంపార్ట్మెంట్లో ఓ ఇద్దరు యువకులు కలిసి చిన్నపాటి ఫోల్డింగ్ టేబుల్ని ఏర్పాటు చేయడాన్ని చూడవచ్చు. కాగా ఈ యువకులు ఇలా చేయడానికి ఓ కారణం ఉంది. వారు ముంబయి లోకల్లో ఫైవ్ స్టార్ రెస్టారెంట్ను ఓపెన్ చేస్తున్నామని చెప్పడానికి ఈ ప్రయత్నం చేశారు.

'టేస్టీ టికెట్'( Tasty Ticket ) పేరుతో ఈ రెస్టారెంట్ గురించి ప్రయాణికులకు తెలుపుతూ ప్రచారం చేపట్టారు. రెస్టారెంట్కి సంబంధించిన వివరాలతో ఒక పోస్టర్ లేదా ఇన్విటేషన్ కార్డులను పంపిణీ చేశారు. అయితే రెస్టారెంట్ ఓపెనింగ్ రోజు ప్రజలకు ఫ్రీ ఫుడ్ అందజేస్తామని యువకులు చెప్పారు.
ఆ రోజు సాధారణ ఫుడ్ కాకుండా ఏకంగా ఫైవ్ స్టార్ రెస్టారెంట్ ఫుడ్ ఆఫర్ చేస్తామని కూడా బంపర్ ఆఫర్ ప్రకటించారు. అనంతరం యువకులు లోకల్ ట్రైన్లోని ఒక కోచ్లో ఫుడ్ టేబుల్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రయాణికులకు భోజనం సర్వ్ చేశారు. రెస్టారెంట్లో ఉన్న అనుభూతి కలిగేలా వారు సర్వెంట్ల మాదిరిగా డ్రెస్ చేసుకున్నారు.

లోకల్ ట్రైన్లో ఇద్దరు ప్రయాణికులకు జిలేబీ, కెచప్తో మ్యాగీ సర్వ్ చేశారు. చివరగా స్వీట్ డెజర్ట్ కూడా ఆఫర్ చేశారు. అనంతరం వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. టేస్టీ ఫుడ్ ఫుడ్ తిన్న ప్రయాణికులు యువకులు అందించిన సర్వీస్తో పాటు ఫుడ్ కూడా బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
వారు చేసిన ఈ ప్రయత్నంపై ప్రయాణికులతో నెటిజన్ల నుంచి మంచి స్పందనలు వస్తున్నాయి. తమకు ఈ కాన్సెప్ట్ ఎంతగానో నచ్చిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియో లక్షకు పైగా లైకులను సంపాదించుకుంది. సూపర్ కాన్సెప్ట్ అంటూ ఫుడ్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








