New Vande Bharat Trains ఈ ఏడాది కొత్తగా రాబోతున్న వందే భారత్ రైళ్లు ఇవే.. ఒక్కో రైలులో ఎన్ని ప్రత్యేకతలో.!!
భారత్లో దశల వారీగా వందేభారత్ రైళ్లు విస్తరిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునికంగా భారతీయ రైల్వే శాఖ వీటిని రూపొందిస్తోంది. కాగా వందే భారత్ రైళ్లలోనే స్లీపర్, సాధారణ్, మెట్రో ఇలా రకరకాల మోడళ్లలో రైళ్లు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది రాబోతున్న సరికొత్త వందే భారత్ రైళ్లు ఇవే..
దేశంలో వందే భారత్(Vande Bharat Express) రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరవేస్తుండటంతో ప్రయాణికులు ఎక్కువగా వందే భారత్ రైళ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఈ ఏడాది అనేక కొత్త రకాల రైళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ రైళ్ల ద్వారా ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనుంది.

వందే భారత్ స్లీపర్: కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు(Vande Bharat Sleeper) ఈ ఏడాది త్వరలోనే అందుబాటులోకి రానన్నాయి. ఈ రైళ్లను ఆటో-పైలట్ వ్యవస్థతో రూపొందించారు. అంతే కాకుండా గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించనున్నాయి. అయితే ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లు కేవలం పగటిపూట మాత్రమే సర్వీసులు అందిస్తున్నాయి.

కాగా రానున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు రాత్రి పూట ప్రయాణానికి అనుకులంగా ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందించారు. ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. కుదుపు లేని జర్నీతో పాటు ఫాస్ట్ ట్రావెల్ ఆప్షన్గా రానున్నాయి. ICF చెన్నై వీటిని తయారుచేస్తోంది.
వందే మెట్రో: వందే మెట్రో(Vande Bharat Metro) అనేది 300 కి.మీ.ల వరకు తక్కువ దూరం ప్రయాణించడానికి కొత్త ప్రీమియం రైలుగా ICF చెన్నై నిర్మిస్తోంది. ఎయిర్ కండిషన్డ్ ఫీచర్తో వందే భారత్ మెట్రోను రూపొందిస్తున్నారు. వందే భారత్ రైలు మాదిరిగానే మెట్రోలోనూ మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.

కాగా వందే భారత్ మెట్రో రైలు వేగం గంటకు 130 కి.మీ. ఒక్కో కోచ్లో 100 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం, 200 మంది ప్రయాణికులు నిలబడే సామర్థ్యంతో రూపొందిస్తున్నారు. టెక్నాలజీకి అనుగుణంగా వీటిలో CCTV, కెమెరాలు, LCD డిస్ప్లేలతో PIS సిస్టమ్, వాక్యూమ్ ఎవాక్యూయేషన్ సిస్టమ్తో కూడిన మాడ్యులర్ టాయిలెట్ ఉన్నాయి.
ఇంకా ఏరోడైనమిక్గా డిజైన్ చేయబడిన డ్రైవింగ్ ఎండ్, పూర్తిగా సీల్డ్ గ్యాంగ్వేలు, తక్కువ బరువుతో ఉన్న కుషన్డ్ సీట్లు, డిఫ్యూజ్డ్ లైటింగ్, రూట్ ఇండికేటర్ డిస్ప్లేలు, రోలర్ బ్లైండ్లతో విశాలమైనదిగా వందే భారత్ మెట్రోను రూపొందించారు. పనోరమిక్ సీల్డ్ విండోస్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు, కవాచ్ ట్రైన్ యాంటీ-కొలిజన్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఇక మూడవది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్(Amrit Bharat Express) రైళ్లు. ఈ రైలుకు ముందు మరియు వెనుక ఇంజిన్లు ఉంటాయి. వీటిని పుష్ అండ్ పుల్ టెక్నాలజీతో రూపొందించారు. వీటిలో సెకండ్ క్లాస్ స్లీపర్ మరియు జనరల్ క్లాస్ అన్రిజర్వ్డ్ కోచ్లు ఉంటాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ తరహా వీటిలో సీల్డ్ గ్యాంగ్వేలు, కుదుపు లేని రైడ్లు, మెరుగైన టాయిలెట్లు, కుషన్డ్ సీట్లు తరహా సౌకర్యాలు ఉన్నాయి.
కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. మొదటిది అయోధ్య మీదుగా దర్భంగా మరియు ఢిల్లీ మధ్య సేవలందిస్తుండగా.. రెండవది బెంగళూరు మరియు మాండా పట్టణం మధ్య నడుస్తున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో, భారతీయ రైల్వే మరిన్ని అమృత్ భారత్ రైళ్లను నిర్మించాలని వీటిలో AC కోచ్లను చేర్చాలని యోచిస్తోంది.

అయితే సాధారణ రైళ్లలో మాదిరిగా ముదురు నీలం రంగు సీట్లు కాకుండా, వందే భారత్లో అన్ని తరగతుల్లో వాలుగా ఉండే సీట్లను అందిస్తున్నారు. దీని ద్వారా సుదూర ప్రయాణంలో ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఎగ్జిక్యూటివ్ కోచ్లు 180-డిగ్రీల రొటేటబుల్ సీట్లతో వస్తాయి. ఇంకా సాధారణ శతాబ్ది రైళ్ల కంటే వందే భారత్లో సీటింగ్ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ సెమీ-హై-స్పీడ్ రైలు మొత్తం సీటింగ్ కెపాసిటీ 1,128 మంది ప్రయాణికులుగా నిర్మిస్తున్నారు. ఇంకా వందే భారత్లో ఎంటర్టైన్మెంట్ కోసం 32-అంగుళాల స్క్రీన్లు కూడా ఉన్నాయి. ఇవి ప్రయాణికులకు ఆడియో-విజువల్ సమాచారం మరియు ఇన్ఫోటైన్మెంట్ను అందించనున్నాయి.

ఇంకా రానున్న కొత్త వందే భారత్ రైళ్లలో వికలాంగుల కోసం అనుకూలమైన టాయిలెట్లను రూపొందిస్తున్నారు. ఈ మరుగుదొడ్లు బయో వాక్యూమ్ రకంగా ఉంటాయి. ఇంకా రైలు కిటికీలు వెడల్పుగా ఉండడం వల్ల ఔట్ సైడ్ వ్యూను కూడా మరింతగా ఆస్వాదించవచ్చు. ఇంకా ఈ రైలులో హాట్స్పాట్ Wi-Fi కూడా అందిస్తున్నారు. కోచ్లలో లగేజీకి ఎక్కువ స్థలం ఉండటం కూడా విశేషం.


Click it and Unblock the Notifications








