మీకు తెలుసా..? ఇథనాల్ కలిసిన పెట్రోల్ వాడితే ఏం జరుగుతుందో..?
మనం నడిపే కార్లు మరియు మోటార్సైకిళ్లలో ఉపయోగించే పెట్రోల్ పూర్తిగా స్వచ్ఛమైనది కాదు, ఇందులో ఇథనాల్ ఇంధన మిశ్రమాన్ని కలుపుతారని మీకు తెలుసా? ఇలా చేయటం వెనుక ఓ కారణం ఉంది. ఆ కారణం ఏంటి మరియు ఇలా పెట్రోల్లో ఇథనాల్ను కలపడం మంచిదా కాదా అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారతదేశంలో పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. దేశంలోని అనేక నగరాల్లో, లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. అటువంటి పరిస్థితిలో, భారత ప్రభుత్వం పెట్రోల్కు ప్రత్యామ్నాయాలను కనుగొనడానికి ప్రయత్నిస్తోంది. కొంతకాలం క్రితమే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశంలో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తామని ప్రకటించిన విషయం తెలిసినదే.

ప్రస్తుతం, మనం ఉపయోగిస్తున్న పెట్రోల్లో 8.5 శాతం ఇథనాల్ను కలుపుతున్నారు. గత 2014లో ఇది కేవలం 1-1.5 శాతంగా మాత్రమే ఉండేది. కాగా, 2022 నాటికి పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 10 శాతానికి మరియు 2025 నాటికి 20 శాతానికి పెంచాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది.

పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని పెంచడం ద్వారా, చమురు దిగుమతులను మరియు వాహన కాలుష్యాన్ని తగ్గించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ, ఇలా చేయడం వలన నష్టపోయేది మాత్రం వాహన యజమానులే. పెట్రోల్తో కలిసే ఇథనాల్ మిశ్రమం ప్రస్తుత వాహనాల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మరి ఇది వాహనాలపై ఎలాంటి ప్రభావాలను చూపుతుంది?

సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు స్టువర్ట్ ఫిల్లింగ్హామ్ అనే యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియోను అప్లోడ్ చేసారు. ఆ వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం, ఇథనాల్ కలిసిన పెట్రోల్ను ఉపయోగించడం వలన వాహనం యొక్క ఇంజన్ను బట్టి దాని సామర్థ్యం మరియు పనితీరులో 3.5 నుండి 5 శాతం తగ్గుదల ఏర్పడుతుంది.

అంటే, దీని అర్థం ఇంజన్ యొక్క పవర్ అవుట్పుట్ తక్కువగా ఉండటమే కాకుండా, ఇంజన్ ప్రతి కిలోమీటరుకు ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. భవిష్యత్తుల్లో పెట్రోల్లో 10 శాతానికి బదులుగా 20 శాతం ఇథనాల్ను మిక్స్ చేసినప్పుడు, అది వాహనాల ఇంజన్లపై మరింత తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంటుంది. ఇది వాహన యజమానులకు ఆందోళన కలిగించే విషయం.
యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ప్రకారం, రెగ్యులర్ పెట్రోల్ కంటే ఇథనాల్ తయారీకి తక్కువ ఖర్చు అవుతుంది. అయితే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఇప్పటికే విక్రయించబడుతున్న దేశాలలో ఇది జరగదు. ఈ దేశాలలో భారతదేశాన్ని కూడా లెక్కించవచ్చు, కాబట్టి, ఇకపై ఇక్కడ బైక్ మరియు కారు నడపడం మరింత ఖరీదైనదిగా మారవచ్చు.

ఎందుకంటే, మనదేశంలో పెట్రోల్ ధరలు ఇప్పటికే అధికంగా ఉన్నాయి మరియు దాని ధర మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. పెట్రోల్తో ఇథనాల్ మిశ్రమం వలన వాహనాల మైలేజ్ మరియు పెర్ఫార్మెన్స్ భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇథనాల్ మిశ్రమం కలిసిన పెట్రోల్తో మరొక సమస్య ఉంది, అదే హైగ్రోస్కోపిక్.

అంటే, దీని అర్థం ఇథనాల్ వాతావరణం నుండి తేమను గ్రహిస్తుంది. అందువల్ల ఇది సాధారణ పెట్రోల్ మాదిరిగా మండించదు. ఇది వాహనం "ఫిజ్ సెపరేషన్" కు కారణమవుతుంది, అంటే ప్రాథమికంగా ఇంధనం వృధా అవుతుందని మరియు ఇంజన్ దెబ్బతినడం ప్రారంభిస్తుందని అర్థం. ఇథనాల్ గ్రహించే తేమ ఇందుకు ప్రధాన కారణం.

కాకపోతే, ఇది సాధారణంగా ఇంధన ట్యాంక్లోని ఇంధనాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు మాత్రమే జరుగుతుంది. మీరు మీ మోటార్సైకిల్ లేదా కారుని క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ, వాటిలో తరచుగా ఇంధనం నింపుతున్నట్లయితే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. తాజా పెట్రోల్ వలన ఇంజన్లో తేమ సృష్టించబడదు.
అయితే, ఇథనాల్ వినియోగంపై ప్రభుత్వం వాదన మాత్రం మరోలా ఉంది. దేశంలో ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని, అంతేకాకుండా రైతులకు మరింత ఆదాయం కూడా లభిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, పునురుత్పాధక ఇంధన వినియోగానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే, దేశంలో ఆటోమొబైల్ కంపెనీలు ఫ్లెక్స్ ఇంజన్లను తయారు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీలో గతంలో సూచించారు. ఫ్లెక్స్ ఇంజన్లు పూర్తిగా 100 శాతం పెట్రోల్తో కానీ లేదా పూర్తిగా 100 శాతం ఇథనాల్తో కానీ పనిచేస్తాయి. ఇలాంటి ఇంజన్లను ఉపయోగించడం వలన పర్యావరణానికి మేలు జరగడంతో పాటుగా పెట్రోల్ దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications








