ఆ రాష్ట్రంలో కొనుగోలు చేసే హైబ్రిడ్ కార్లపై రోడ్ టాక్స్ రద్దు.. రూ. 4 లక్షల వరకు డబ్బు ఆదా!!
ప్రస్తుతం దేశంలో వాయు కాలుష్యం పెరుగుతుంది. ముఖ్యంగా వాహనాలు గాలిని ఎక్కువగా కలుషితం చేస్తాయి. అందుకే భారత్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వాహన ఉత్పత్తి సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకుని పనిచేస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా వినియోగం నుంచి తొలగించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. దీనివల్ల వాహనాల కాలుష్యం తగ్గడమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుని ప్రోత్సాహిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల ద్వారా కూడా ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు.
ప్రస్తుతం కేంద్రం, చాలా రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలను ఆకర్షించడానికి సబ్సిడీలు, పన్ను ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో హైబ్రిడ్ కార్ల కొనుగోలుని ప్రోత్సాహించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లపై 100 శాతం రోడ్ ట్యాక్స్ ను రద్దు చేసింది. దీంతో ఈ హైబ్రిడ్ కార్ల సేల్స్ని ప్రోత్సాంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ రకమైన వాహనాలు తక్కువ వాయు కాలుష్యాన్ని వెదజల్లడంలో మరియు పర్యావరణానికి స్నేహితుడిగా పనిచేయడంలో ఉత్తమమైనవిగా భావిస్తారు. దీంతో హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు యూపీ ప్రభుత్వం పన్ను రాయితీని ప్రకటించింది. స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లకు రోడ్ ట్యాక్స్ రద్దు చేయడంతో ఇలాంటి వాహనాల ధరలు భారీగా తగ్గుముఖం పట్టనున్నాయి.
ఈ చర్యతో రాష్ట్రంలో స్ట్రాంగ్ హైబ్రిడ్ ఫీచర్ కార్ల ధరలు అనేక రెట్లు తగ్గడంతో పాటు వాటి సంఖ్య అనేక రెట్లు పెరగనుంది. టయోటా, మారుతి సుజుకి ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గనున్నాయి. ప్రస్తుతం హైరైడర్ మరియు హైక్రాస్, గ్రాండ్ విటారా మరియు ఇన్విక్టో మాత్రమే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఫీచర్తో భారతదేశంలో అందుబాటులో ఉన్న కార్ మోడళ్లుగా ఉన్నాయి.

వీటి ఆన్ రోడ్ ధరలు సుమారు రూ.4.4 లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ స్థాయిలో ధరలు తగ్గడం వల్ల హైబ్రిడ్ కార్ మోడళ్ల ధర యూపీలో సాధారణ పెట్రోల్ మోడళ్లతో సమానంగా ఉండనుంది. ఫలితంగా సాధారణ పెట్రోల్ కార్ల మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు రాబోయే రోజుల్లో హైబ్రిడ్ టెక్నాలజీ కార్ మోడళ్లు ఆ రాష్ట్రంలో ఎక్కువ విక్రయాలు జరగనున్నాయి.
సంప్రదాయ పెట్రోల్ మోడళ్ల కంటే హైబ్రిడ్ కార్లు ఎక్కువ లాభదాయకంగా ఉండనున్నాయి. ఇవి అధిక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీంతో యజమానులకు కలిసి రానున్నాయి. సాధారణ పెట్రోల్ కార్లు లీటరుకు 16 నుండి 18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుండగా.. ఈ హైబ్రిడ్ కార్లు లీటరుకు 25 కిలోమీటర్ల నుంచి 28 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి.

ఉదాహరణకు టయోటా హైరైడర్ లీటరుకు 28 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ మైలేజీ కారణంగానే ఇప్పుడు చాలా మంది హైబ్రిడ్ టెక్నాలజీతో కార్లను కొనుగోలు చేస్తున్నారు. దీని అమ్మకాన్ని మరింత ప్రోత్సహించడానికి తాజాగా యూపీ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు టాక్స్ని రద్దు చేసింది. ప్రస్తుతం ఈ పన్ను మినహాయింపును కేవలం ఉత్తరప్రదేశ్ వాసులకు మాత్రమే ప్రకటించారు. ఇతర రాష్ట్రాల వాసులకు ఈ రాయితీ లభించదు.
పన్ను మినహాయింపు పొందాలంటే యూపీకి చెందిన అడ్రస్ ప్రూఫ్ కచ్చితంగా ఉండాలి. గతంలోనే దేశవ్యాప్తంగా హైబ్రిడ్ కార్లపై పన్నును 45 % నుంచి 12 % తగ్గించాలని నితిన్ గడ్కరీ సూచిస్తున్నారు. త్వరలోనే దీనిని అమలు చేసే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రోడ్డు పన్నును పూర్తిగా తగ్గించడం కాస్త ఊరటే అని చెప్పాలి. ఇతర రాష్ట్రాలు కూడా చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఇతర రాష్ట్రాలు కూడా ఇదే బాటలో పయనిస్తే భారతదేశం అంతటా హైబ్రిడ్ వాహనాల సంఖ్య పెరుగనుంది. అంతేకాకుండా కాలుష్య ఉద్గారాలను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. యూపీ ప్రభుత్వం ఈ చర్యతో చాలా మందికి ప్రయోజనం చేకూరనుంది. అయితే దీని వల్ల లబ్ది పొందేది ఎక్కువగా ధనవంతులే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఫీచర్ ఉన్న చాలా వాహనాలు చాలా ఖరీదైనవి కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications








