హెలికాఫ్టర్ కొనేసిన కరీంనగర్ వాసి.. యాదాద్రి దేవుని చెంత ప్రత్యేక పూజలు
ఎవరైనా ఒక వాహనం కొంటె దానికి పూజలు చేయడం మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాము. నిజానికి మనం చాలా సందర్భాల్లో బైకులు, కార్లు లాంటి వాహనాలకు పూజలు చేయడం చూసుంటాము, కానీ హెలికాఫ్టర్ వంటివాటికి పూజలు చేయడం చాలా తక్కువ సందర్భాల్లో చూసి ఉండే అవకాశం ఉంటుంది.
ఇటీవల తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో హెలికాఫ్టర్ కి పూజలు నిర్వహించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లాకి చెందిన ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, హైదరాబాద్ ఎయిర్ లైన్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ బోయినపల్లి శ్రీనివాసరావు ఈ హెలికాప్టర్ను కొనుగోలు చేశారు. ఈ కొత్త హెలికాఫ్టర్ కి నిన్న పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా పాల్గొన్నారు.

ఎప్పుడూ చిన్న చిన్న వాహనాలకే పూజలు జరగటం చూసిన చాలా మంది జనం ఒక్క సారిగా హెలికాఫ్టర్ కి పూజలు చేయడం చూడటానికి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రతిమ గ్రూప్ యజమాని బోయిన్పల్లి శ్రీనివాస్రావు కొనుగోలు చేసిన ఈ హెలికాఫ్టర్ ఎయిర్బస్ ఏసీహెచ్-135 అని తెలిసింది. ఈ కొత్త హెలికాఫ్టర్ కి ముగ్గురు పూజారుల మార్గనిర్దేశంతో శ్రీనివాస్రావు కుటుంభ సభ్యులు పూజలు నిర్వహించారు.
పూజలు నిర్వహించిన అనంతరం పుణ్యక్షేత్రం చుట్టూ హెలికాప్టర్ లో షికారు చేశారు. ఈ ఎయిర్బస్ ఏసీహెచ్ 135 హెలికాప్టర్ 500 కిలోమీటర్ల రేంజ్, 20 వేల ఫీట్ల ఎత్తు వరకు ప్రయాణం చేస్తుందని ఫైలట్ వెల్లడించారు. దీని ధర 5.7 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ. 47 కోట్లు కంటే ఎక్కువగా ఉంటుంది.
ప్రతిమ గ్రూప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే దీని గురించి చాలా మందికి తెలుసు. హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రతిమ గ్రూప్ మౌలిక సదుపాయాలు, ఇంధనం, తయారీ, టెలికాం రంగాలలో మాత్రమే కాకుండా మెడికల్ కాలేజీలు మరియు హాస్పిటల్స్ వంటి వాటిని కూడా కలిగి ఉంది. మొత్తానికి ప్రతిమ గ్రూప్ దినదినాభివృద్ధి చెందుతూ అన్ని రంగాల్లోనూ తనదైన శైలిలో ముందుకు వెళుతోంది.
ఇదిలా ఉండగా ఆంద్రప్రదేశ్ లో తిరుమల పుణ్యక్షేత్రం అంత వైభవాన్ని యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామికి తీసుకురావడానికి అక్కడ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తెలంగాణ ప్రభుత్వం యాదాద్రిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించింది. ప్రస్తుతం ఈ దేవాలయానికి దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారు. రోజు రోజుకి ఈ దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
యాదగిరిగుట్టలో హెలికాప్టర్కు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇది మొదటి సారి కాదు. ఎందుకంటే గతంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ప్రభుత్వం కొనుగోలు చేసిన హెలికాప్టర్కు మొదటిసారిగా యాదాద్రి పుణ్యక్షేత్రంలో వాహన పూజ నిర్వహించారు. అప్పట్లో ఆ హెలికాఫ్టర్ కి స్వామి వారి పేరే పెట్టినట్లు సమాచారం. ఆ తరువాత హెలికాఫ్టర్ కి పూజలు చేయడం బహుశా ఇది రెండవ సారి.
నిజానికి భారతీయ సనాతన సంస్కృతి ప్రకారం ఎంతవారైనా ఒక వాహనం కొనుగోలు చేస్తే దానికి పూజ చేసిన తరువాతే వినియోగించడానికి ఆసక్తి చూపుతారు. ఈ సాంప్రదాయం ఒకప్పటి నుంచి కూడా అలాగే వస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ ప్రచార రథం 'వారాహి' కి కూడా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








