హైదరాబాద్- బెంగళూరు రూట్లో పరుగులు పెట్టనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఈ నెలలోనే ప్రారంభం.!!
దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. వేగవంతమైన ప్రయాణంతో పాటు సురక్షిత ప్రయాణాన్ని అందిస్తూ ఈ సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు సేవలందిస్తుండగా.. మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రానుంది.
త్వరలో బెంగళూరు-హైదరాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడవనుంది. ఇది రాష్ట్రంలో ప్రధాన కార్యాలయంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (SCR) నిర్వహిస్తుంది. ప్రస్తుతం 8 కోచ్లతో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రయల్ రన్ జరుగుతోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ఇది మూడో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కానుంది. కర్ణాటకలో మొదటి రెండు వందే భారత్ రైళ్లు మైసూర్-బెంగళూరు-చెన్నై మరియు బెంగళూరు-ధార్వాడ్ మార్గాల్లో నడుస్తున్నాయి. తెలంగాణలోని మొదటి రెండు రైళ్లు సికింద్రాబాద్- విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడుస్తున్నాయి.
కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు బెంగళూరులోని యశ్వంత్పూర్ స్టేషన్ మరియు హైదరాబాద్లోని కాచిగూడ స్టేషన్ మధ్య నడవనుంది. మొత్తం 610 కి.మీ దూరాన్ని ఇది ఏడు గంటల్లో కవర్ చేయనుంది. ఇది ప్రస్తుతం హై స్పీడ్ రైలుగా ఉన్న దురంతో ఎక్స్ప్రెస్ కంటే రెండు గంటలు ముందుగా గమ్యస్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం కాచిగూడ-డోన్ జంక్షన్ మధ్య ట్రయల్ రన్ జరుగుతోంది.

బెంగళూరు- హైదరాబాద్ వందే భారత్ రైలు సర్వీస్పై దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు స్పందించారు. సీనియర్ అధికారులు అనుమతి ఇచ్చిన వెంటనే, వందే భారత్ ఎక్స్ప్రెస్ రెండు ప్రధాన ఐటీ నగరాల మధ్య కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ రైలు బెంగళూరు మరియు హైదరాబాద్ మధ్య 16 కోచ్లతో నడవనున్నట్లు సమాచారం. ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించే అవకాశం ఉంది.
రైల్వే బోర్డు ఆమోదం పొందిన తర్వాతే ఈ రెండు నగరాల మధ్య వందేభారత్ రైలు నడపడానికి సంబంధించిన తేదీ, టికెట్ ధర, స్టాప్లు, ప్రయాణ సమయం తదితర వివరాలు అందుబాటులోకి రానున్నాయని సమాచారం. ఈ రైలు ప్రారంభానికి సంబంధించి బెంగళూరులోని సౌత్ వెస్ట్రన్ రైల్వే డివిజన్ అధికారులకు రైల్వే బోర్డు నుంచి ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ రాలేదని తెలుస్తోంది.
అయితే, ఈ మార్గంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ నెలలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు నైరుతి రైల్వే కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. బెంగళూరు- హైదరాబాద్ మధ్య ప్రయాణించే ఈ సెమీ హై స్పీడ్ రైలు కర్ణాటకలోని ఏ రైల్వే స్టేషన్లోనూ ఆగదని సమాచారం. చాలా వరకు ధర్మవరం, డోన్, కర్నూలు, గద్వాల్, మహబూబ్నగర్, షాద్నగర్లలో ఆగుతాయని తెలుస్తోంది.
కాగా ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు రాయచూర్ స్టేషన్లో ఆగాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి రైల్వే శాఖ ఆమోదం పొందుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. షాద్నగర్లో రైలును ఆపడం వల్ల సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటుందని, అక్కడ సులభంగా కనెక్టివిటీ ఉంటుందని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రైలు ప్రాథమిక నిర్వహణ కాచిగూడలో జరుగుతుందని వెల్లడించారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రత్యేకతల గురించి చెప్పాలంటే, ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే, భద్రత దృష్ట్యా 160 కి.మీకి పరిమితం చేయబడింది. ఈ రైలులో ఒక్క ఇంజిన్ కూడా లేదు. పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడిన ఈ రైలు సీట్లు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా బయో టాయిలెట్ వ్యవస్థను కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








