వందే భారత్ స్లీపర్ రైలు టెస్ట్ సక్సెస్.. 180 కి.మీ. వేగంతో దూసుకుపోనున్న కొత్త రైలు!
భారతీయ రైల్వేలను ఆధునీకరించే క్రమంలో దూర ప్రయాణాలకు అత్యంత కీలకమైన వందే భారత్ స్లీపర్ రైలు (Vande Bharat Sleeper Train) ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. కోటా డివిజన్ పరిధిలోని సవాయి మాధోపూర్-కోటా-నాగ్డా సెక్షన్లో జరిగిన టెస్టుల్లో రెండవ రేక్ గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకొని అంచనాలను మించిపోయింది.
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) టెక్నాలజీతో BEML అభివృద్ధి చేసిన ఈ సెమీ-హై-స్పీడ్ స్లీపర్ రైలు.. స్పీడ్, సేఫ్టీ సౌకర్యాన్ని మిళితం చేసి, దేశంలో రాత్రి రైలు ప్రయాణాన్ని పూర్తిగా మార్చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త రైలు ప్రత్యేకతలు, భద్రతా ప్రమాణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దూర ప్రయాణాలకు వీలుగా రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైలు రెండవ రేక్, 2025 నవంబర్ 2న ప్రారంభమై నవంబర్ 17 వరకు కొనసాగనున్న ట్రయల్స్లో అద్భుతమైన వేగాన్ని నమోదు చేసింది. రాజస్థాన్లోని కోటా డివిజన్లో జరిగిన పరీక్షలలో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. రోహల్ఖుర్ద్, లబాన్ స్టేషన్ల మధ్య 50 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 180కిమీ వేగంతో స్థిరంగా ప్రయాణించడం ద్వారా, ఇది తన హై-స్పీడ్ సామర్థ్యాన్ని నిరూపించింది.
కొత్తగా వస్తున్న వందే భారత్ స్లీపర్ రైలును నిజమైన రైలు పట్టాలపై టెస్ట్ చేశారు. దీనికి అదనంగా 108 టన్నుల బరువును వేసి, మొత్తం 908 టన్నుల భారీ బరువుతో పరీక్షించారు. బ్రేకులు ఎంత బాగా పనిచేస్తున్నాయి, రైలు ఎంత తక్కువగా అదురుతుంది, సాంకేతికంగా ఎంత నమ్మకంగా ఉంది వంటి చాలా విషయాల్లో ఈ రైలు అద్భుతంగా పాస్ అయింది.

BEML కంపెనీ, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) వాళ్ల టెక్నాలజీతో ఈ రైలును తయారు చేసింది. ప్రయాణీకులకు భద్రతే ముఖ్యమని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రైలులో మన దేశంలోనే తయారుచేసిన కవచ్ (Kavach) యాంటీ-కొలిజన్ సిస్టమ్ ఉంది. అంటే, ఎదురెదురుగా వచ్చే రైళ్లు ఢీకొనకుండా ఈ సిస్టమ్ కాపాడుతుంది. అగ్ని ప్రమాదాలను నివారించే కొత్త టెక్నాలజీ, అలాగే ఎమర్జెన్సీలో మాట్లాడటానికి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
ఈ రైలులో మంటలు అంటుకోకుండా చూసేందుకు ప్రపంచంలోనే అత్యుత్తమమైన EN45545 HL3 ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ పాటిస్తున్నారు. ప్రమాదం జరిగితే ప్రయాణికులను కాపాడటానికి ప్రత్యేకంగా తయారుచేసిన క్రాష్ బఫర్లు (అఘాతం తట్టుకునేవి), కప్లర్లు (కోచ్లను కలిపేవి) కూడా ఉన్నాయి. దీన్ని స్టెయిన్లెస్ స్టీల్తో తయారుచేశారు.

వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్లు ఉన్నాయి. వీటిలో 823 బెర్త్లను అంటే పడుకోవడానికి సీట్లను ఏర్పాటు చేశారు. ఈ 16 కోచ్లలో 11 ఏసీ త్రీ టైర్ బోగీలు, నాలుగు ఏసీ టూ టైర్ బోగీలు, ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి.
ప్రయాణీకులు హాయిగా ప్రయాణించడానికి, ఈ రైలులో శబ్దం లోపలికి రాకుండా ఉండే సౌకర్యం, ఆటోమేటిక్ డోర్లు (వాటికవే తెరుచుకుని మూసుకునే తలుపులు), ఎప్పుడూ కూల్గా ఉండే ఎయిర్ కండిషన్డ్ వాతావరణం వంటి సౌకర్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
వందే భారత్ స్లీపర్ రైలు భారతదేశంలో దూర ప్రయాణాలను చాలా వేగంగా మార్చేయబోతుంది. ఇది ఒక గొప్ప మార్పు తీసుకురానుంది. ఈ రైళ్లను ముందుగా న్యూఢిల్లీ నుండి పాట్నా, న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వంటి ముఖ్యమైన మార్గాలలో నడిపే అవకాశం ఉంది.
భవిష్యత్తులో ఢిల్లీ నుంచి ముంబై, ఢిల్లీ నుంచి శ్రీనగర్ వంటి రూట్లలో కూడా ఈ రైళ్లను నడపాలని భారతీయ రైల్వేలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ రైలు వేగం, భద్రత, సౌకర్యం కలగలిపి ఉంది. రాత్రిపూట ప్రయాణించే ప్రస్తుత రైళ్ల కంటే ఇది చాలా మెరుగైన ఆప్షన్ అవుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది.


Click it and Unblock the Notifications








