తెలంగాణకు భారీ గుడ్న్యూస్.. రూ.3 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్న విన్ గ్రూప్
తెలంగాణ రాష్ట్రానికి వియత్నాంకు చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థ విన్గ్రూప్ (Vingroup) ఒక భారీ శుభవార్త అందించింది. ఈ సంస్థ తెలంగాణలో ఏకంగా 3 బిలియన్ యుఎస్ డాలర్లు (సుమారు రూ.26,952 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో విన్గ్రూప్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక కీలకమైన ఒప్పందం పై సంతకం చేసింది. ఈ భారీ పెట్టుబడి రాష్ట్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధికి, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు పెద్ద బూస్ట్గా నిలవనుంది.
ఈ భారీ నిధులు కేవలం ఒకే రంగానికి కాకుండా అనేక కీలక రంగాలలో ఖర్చు చేయనున్నారు. విన్గ్రూప్ దాదాపు 2,500 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక బహుళ-రంగాల ఎకోసిస్టమ్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ప్రధానంగా స్మార్ట్ సిటీ డెవలప్మెంట్, ఎలక్ట్రిక్ వాహనాల రవాణా, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం వంటి రంగాలు ఉన్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలో, విన్గ్రూప్ తమ అనుబంధ సంస్థలైన జీఎస్ఎమ్ (గ్రీన్ అండ్ స్మార్ట్ మొబిలిటీ), విన్ఫాస్ట్ (VinFast) ద్వారా భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఎలక్ట్రిక్ ట్యాక్సీ సేవను, మొబిలిటీ-యాజ్-ఎ-సర్వీస్ (MaaS) ప్లాట్ఫామ్ను తెలంగాణలో తీసుకురానుంది. భవిష్యత్తులో ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు అవకాశాలను కూడా పరిశీలించనున్నట్లు తెలిపింది.
నగరాభివృద్ధి రంగంలో, విన్గ్రూప్ 1,080 హెక్టార్లలో విన్హోమ్స్ స్మార్ట్ సిటీ అనే మెగా నగర నిర్మాణాన్ని చేపడుతుంది. ఇక్కడ దాదాపు 2 లక్షల మందికి నివాసం కల్పించవచ్చు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 10,000 ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. 70 హెక్టార్ల విస్తీర్ణంలో K-12 (కిండర్గార్టెన్ నుండి 12వ తరగతి వరకు) సమీకృత విద్యావ్యవస్థ కలిగిన విన్స్కూల్స్ను స్థాపిస్తారు.

సామాజిక రంగంలో కూడా విన్ గ్రూప్ పెట్టుబడులు పెడుతోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విన్మెక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తారు. 350 హెక్టార్లలో విన్వండర్స్ పేరుతో థీమ్ పార్క్, జూ, సఫారీతో కూడిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ను నిర్మిస్తారు.
తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కార్లు అందించడానికి, విన్ఫాస్ట్ భారతదేశంలో ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రాయితీలను పొందనుంది. విన్ఫాస్ట్ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో VF6, VF7 మోడళ్లతో పాటు, ఇటీవల 2025 ఆటో ఎక్స్పోలో VF3 అనే మైక్రో ఎస్యూవీని ప్రదర్శించింది.

ఈ VF3 మోడల్ పట్టణ రోడ్లకు అనుకూలమైన పాకెట్ సైజ్ క్రాస్ఓవర్. ఇందులో 18.64 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాల్లో ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ పెట్టుబడితో తెలంగాణ పారిశ్రామిక, ఆర్థిక రంగంలో కొత్త వేగాన్ని అందుకోనుంది.
ఆసియాలో ముఖ్యమైన సంస్థలలో ఒకటైన వియత్నాంకు చెందిన విన్ గ్రూప్, భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ ఏకంగా రూ.26,952 కోట్లు పెట్టుబడి పెడుతోంది. స్మార్ట్ సిటీ డెవలప్మెంట్, ఎలక్ట్రిక్ వాహన రవాణా, ఆరోగ్యం, విద్య, పర్యాటకం వంటి అనేక రంగాలలో 2,500 హెక్టార్లలో ఒక మల్టీ సెక్టార్ ఎకో సిస్టమ్ స్థాపించడమే ఈ పెట్టుబడి లక్ష్యం.


Click it and Unblock the Notifications








