ఎకానమీ క్లాస్లో విరాట్ కోహ్లీ.. కింగ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా, వైరల్ అవుతున్న వీడియో
భారత్లో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ విరాట్ కోహ్లీ అంటే విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం వరల్డ్ కప్లో తనదైన బ్యాటింగ్ స్టైల్తో క్రికెట్ ఫ్యాన్స్ను అలరిస్తున్నాడు. అంతే కాకుండా ప్రస్తుతం భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కింగ్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా సెలబ్రిటీలు ధనవంతులు.. విమానంలో ప్రత్యేకంగా బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే ఎకానమీతో పోలిస్తే బిజెనెస్ క్లాస్లో సౌకర్యాలు ఎక్కువ. ఎకానమీ క్లాస్లో సెలబ్రిటీలను చూడటం చాలా అరుదు. అయితే కోహ్లీ(Virat Kohli).. ఇండిగో ఫ్లైట్(Indigo Flight)లోని ఎకానమీ క్లాస్లో ప్రయాణిస్తూ ఒక్కసారిగా అందరినీ షాక్కు గురిచేశాడు.

టీ షర్ట్, మాస్క్, క్యాప్, గాగుల్స్, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చాలా సింపుల్గా ఓ వ్యక్తి ఫ్లైట్ ఎక్కాడు. అది ఎకానమీ క్లాస్. అయితే ఆ వ్యక్తి విరాట్ కోహ్లీ అని గుర్తు పట్టగానే అక్కడున్న అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. క్రికెట్ ఫీల్డ్లో టాప్ బ్యాట్స్మెన్గా కింగ్ కోహ్లీ.. ఎకానమీ క్లాస్(Economy Class)లో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట్లోకి చేరింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. కోహ్లీ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ఫ్లైట్లో తనతో పాటు ఉన్న ప్రయాణికులు విరాట్తో ఫొటో దిగేందుకు ఆసక్తి కనబరిచారు. అందులోని ఓ మహిళ కోహ్లీతో ఫొటో దిగడాన్ని చూడవచ్చు. క్రికెట్లో భారీ విజయాలతో లగ్జరీ లైఫ్ను చూస్తున్న ఆటగాడు.. ఇలా ఎకానమీ క్లాస్లో ప్రయాణించడం అతని సింప్లిసిటీకి నిదర్శనమే అని నెటిజన్లు అంటున్నారు.

కాగా విమానంలో ఎకానమీ మరియు బిజినెస్ క్లాస్ మధ్య చాలా తేడా ఉంటుంది. సాధారణంగా బిజినెస్ క్లాస్ ఛార్జీలు ఎకానమీ క్లాస్ కంటే రెండు నుంచి ఐదు రెట్లు ఎక్కువ ఉంటాయి. బిజినెస్ క్లాస్లో మీకు ఎక్స్ట్రా లగేజీ తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.
అంతే కాకుండా అదనంగా ఫ్రీ ఫుడ్, డ్రింక్, లాంజ్ సర్వీస్తో పాటు విశాలమైన సీటింగ్ సౌకర్యం ఉంటుంది. మరోవైపు ఎకానమీ క్లాస్లో ఇలాంటి సౌకర్యాలు ఏమీ ఉండవు. ఈ కారణంగా, క్రికెటర్లు, ఇతర ఫీల్డ్లోని సెలబ్రిటీలు ఎక్కువగా బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తారు.

కోల్కతాలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ముగిసిన తరువాత లీగ్ దశలో టీమిండియా.. నెదర్లాండ్స్తో ఆడనుంది. ఈ చివరి మ్యాచ్ బెంగళూరులో జరగనుంది. ఈ క్రమంలోనే కోహ్లీ బెంగళూరుకు ప్రయాణించినట్లుగా తెలుస్తోంది. కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును కింగ్ సమం చేశాడు.
కాగా ఈ సారి కోహ్లీ తన 35వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ల్లో కోహ్లి 121 బంతుల్లో పది బౌండరీలతో 101 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సాధించాడు. దక్షిణాఫ్రికాపై తిరుగులేని విజయంతో మరిచిపోలేని పుట్టినరోజును తన ఖాతాలో వేసుకోవడంతో పాటు అభిమానులకు ఫీస్ట్ అందించాడు.
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 289 వన్డే మ్యాచులు ఆడాడు. వన్డే మ్యాచుల్లో 13,626 పరుగులు చేయగా 49 సెంచరీలు, 70 అర్ధశతకాలు సాధించి ఘనత సాధించాడు. వన్డేలో ఇప్పటివరకు కోహ్లీ చేసిన అత్యధిక స్కోరు 183 పరుగులు కావడం విశేషం.
ఇక 2023 వన్డే ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచుల్లోనూ గెలిచి సత్తా చాటింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ.. మెగా టోర్నీలో ఓటమి ఎగురని ఏకైక జట్టుగా నిలిచి చరిత్ర సృష్టిస్తోంది. ఈ క్రమంలో లీగ్ దశలో నెదర్లాండ్స్పై విజయం సాధించి ఓటమే లేని టీంగా సెమీస్కు వెళ్లాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications








