Water Metro ఇండియాలో మరో అద్భుతం..ట్రాక్ పై కాదు నీటిపై నడిచే మెట్రో రైల్.. టిక్కెట్టు ధర కేవలం రూ.20 మాత్రమే
దేశంలో రోజు రోజుకు టెక్నాలజీ వేగంగా పెరుగుతోంది. అందుకు తగినట్లుగానే వివిధ రంగాల్లో దేశం దూసుకెళ్తుంది. ముఖ్యంగా పర్యాటక రంగంలో దేశం ఊహించని రీతిలో పురోగమిస్తుంది. దేశంలోని చాలా ప్రాంతాలకు వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు వస్తున్నారు. వీటికి తోడు ప్రజా సౌలభ్యం కోసం ఆయా ప్రభుత్వాలు అనేక సౌకరక్యాలను కల్పిస్తున్నాయి.
దేశంలో అధునాతన ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో, ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. అయితే మనం ఇక్కడ తెలుసుకోబోయే ట్రైన్ చాలా స్పెషల్ ఇప్పటి వరకూ ట్రైన్స్ అంటే కేవలం ట్రాక్ పైనే ప్రయాణిస్తాయి. కానీ ఈ మెట్రో ట్రైన్ వాటర్ లో ప్రయాణించనుంది. అవును మీరు విన్నది నిజమే.. నేటి నుంచి (ఏప్రిల్ 25) ఈ వింత మెట్రో అందుబాటులోకి రానుంది.

ఈ అరుదైన ఘట్టానికి కేరళ వేదిక కానుంది. ఆ రాష్ట్ర డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్న ఈ వాటర్ మెట్రో నేడు ప్రజలకు, పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు మనదేశంలో కేవలం వంతెనలపై వెళ్లే మెట్రో రైళ్లు మాత్రమే ఉన్నాయి. తాజాగా ఈ వాటర్ మెట్రో రాకతో దేశ చరిత్రలో ఇది నిలిచిపోనుంది. ఈ మెట్రో సేవల్నీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
ఈ వాటర్ మెట్రో సర్వీస్ వల్ల కొచ్చి చుట్టూ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగునుంది. కొచ్చితో పాటు దాని చుట్టుపక్కల ఉన్న 10 దీవులను కలుపుతూ ఈ వాటర్ మెట్రో అనుసంధానించబడింది. ఈ రూట్లలో దాదాపు 78 ఎలక్ట్రిక్ బోట్లు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. మొత్తం 38 టర్మినల్స్ ఉన్న ఈ వాటర్ మెట్రోను రూ.1,136 కోట్లతో ప్రాజెక్టును పూర్తిచేశారు.
ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలను ట్విట్టర్ లో పీఎం మోదీ పంచుకున్నారు. ఇది గొప్ప మైల్ స్టోన్ గా నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. కొచ్చి వాటర్ మెట్రోను జాతికి అంకితం చేయనున్నట్లు. తెలిపిన ఆయన.. ఇది కొచ్చికి అంతరాయం లేని కనెక్టివిటీని అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు నగరంలోని ట్రావెల్, టూరిజంకు మరింత ఊతమిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. ఏప్రిల్ 22న ఆయన చేసిన ట్వీట్లో దీన్ని 'కేరళ డ్రీమ్ ప్రాజెక్ట్'గా అభివర్ణించారు. రూ.1,136.83 కోట్ల వ్యయంతో నిర్మించిన కొచ్చి వాటర్ మెట్రో.. మొదటి దశలో భాగంగా హైకోర్టు-వైపిన్ టెర్మినల్స్ నుంచి వైటిలా-కక్కనాడ్ టెర్మినల్స్ వరకు నడవనుంది.
మొత్తం 76.2 కిలోమీటర్ల పొడవున్న కొచ్చి వాటర్ మెట్రోలో అత్యవసర సమయాల్లో ప్రధాన బోట్లకు మద్దతుగా రెస్క్యూ కమ్ వర్క్ షాప్ నౌకలు నిరంతరం కాపలాగా ఉండనున్నాయి. ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇవి కాపాడనున్నాయి.
నగర మెట్రో నెట్ వర్క కి చెందిన "కొచ్చి 1" కార్డును ఉపయోగించి ప్రయాణికులు వాటర్ మెట్రోలో ప్రయాణించవచ్చు. అలానే ఆన్ లైన్ లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ వాటర్ మెట్రో టికెట్ ధర రూ.20 నుంచి ప్రారంభమవుతుందని కేరళ ప్రభుత్వం తెలిపింది. వీటితో పాటు రోజు ప్రయాణించే సాధారణ ప్రయాణికుల కోసం వీక్లీ, మంత్లీ పాస్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రాజెక్ట్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఈ వాటర్ మెట్రోలకు చెందిన అన్ని టెర్మినల్స్ లో ఆటోమేటిక్ గా ఛార్జీలు వసూలు ఉంటుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో ప్రయాణికులకంటే ఎక్కువగా టూరిస్ట్ లు దీనికి ఫిదా అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ విజయవంతంగా పూర్తి చేస్తే ఇతర అనువైన ప్రదేశాల్లో దీనిని ప్రవేశ పెట్టే అవకాశం ఉండనుంది.


Click it and Unblock the Notifications








