రన్నింగ్ ట్రైన్లో లోకో పైలట్ నిద్ర పోతే ఏం జరుగుతుందో తెలుసా..? ఆ ఆప్షన్ లేకపోతే అంతే సంగతులు..!!
భారతీయ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్గా పేరుగాంచింది. భారతదేశ రైలు నెట్వర్క్ దాదాపు 68 వేల రూట్ కిలోమీటర్ల పొడవు ఉంది. రైలులో సురక్షిత ప్రయాణంతో పాటు తక్కువ ఛార్జీలతో ప్రయాణించవచ్చు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేల మంది రైలు మార్గంలో ప్రయాణిస్తున్నారు.
భారతీయ రైల్వేలో, ఒక రైలుకు ఇద్దరు లోకోమోటివ్ పైలట్లు ఉంటారు. రైలులో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికుల భద్రత వారి బాధ్యత. కదులుతున్న రైలులో లోకో పైలట్లు ఇద్దరూ నిద్రపోతే ఏం జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.? బస్సు, కారు నడిపేటప్పుడు డ్రైవర్లు పొరపాటుగా నిద్ర మత్తులో తూలినా ఘోర ప్రమాదాలు జరిగిన ఘటనలు చూశాం. కానీ రైలులో పైలట్ నిద్రపోతే.. ఆ తర్వాత ఏం జరుగుతుంది.?

రైలు కదులుతుండగా లోకో పైలట్ నిద్రపోతే.. రైలు దేన్నైనా ఢీకొని, పట్టాలు తప్పేంత వరకు అది కదులుతూనే ఉంటుందా లేక రైలును ఆపడానికి ఏదైనా యంత్రాంగం ఉందా.? అనే అనుమానం మీకు కలుగుతుంది కదా.. ఇది తలచుకుంటేనే మీకు భయంగా అనిపించవచ్చు. కానీ భయపడాల్సిన పనిలేదు. అలాంటి పరిస్థితిలో ఎలాంటి ప్రమాదాలు జరగవు. ఎందుకు అనేది ఈ కథనంలో చదవండి.
రైలులో మెయిన్ పైలట్ను లోకో పైలట్ అంటారు. తనకు సహాయకుడిగా ఉండే మరొకరిని అసిస్టెంట్ లోకో పైలట్ అని పిలుస్తారు. ఒకరు అస్వస్థతకు గురైనప్పుడు లేదా నిద్రపోయినప్పుడు, మరొకరు ట్రైన్ నడిపే బాధ్యత తీసుకుంటారు. ఇద్దరూ ఒకేసారి నిద్రలోకి జారుకునే అవకాశం లేదు. ఒకవేళ అలా జరిగితే రైలును ఆపడానికి ఒక ప్రత్యేక యంత్రాంగం ఉంది. అదేంటంటే..

రైలు ఇంజిన్లో 'విజిలెన్స్ కంట్రోల్ డివైజ్'ని రైల్వే ఏర్పాటు చేసింది. లోకో పైలట్ ఒక నిమిషం పాటు స్పందించకుంటే ఈ పరికరం పని చేస్తుంది. ఆ పై 17 సెకన్లలో ఆడియో విజువల్ సూచన ప్రారంభమవుతుంది. దానికి స్పందనగా బటన్ నొక్కడం ద్వారా లోక్ పైలట్ దానిని అంగీకరించాలి. లోకో పైలట్ ఈ సూచనకు స్పందించకపోతే, 17 సెకన్ల తర్వాత ఆటోమేటిక్ బ్రేకింగ్ ప్రారంభమవుతుంది.
రైలును నడుపుతున్నప్పుడు, లోకో పైలట్ రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచాలి లేదా తగ్గించాలి. హారన్ను ఎప్పటికప్పుడు అప్లై చేస్తుండాలి. ఇలా చేయడం ద్వారా, రైలు ఇంజిన్లోని విజిలెన్స్ కంట్రోల్ డివైజ్.. లోకో పైలట్ మేల్కొని ఉందని గ్రహిస్తుంది. అంతేకాకుండా రైలు పూర్తి భద్రతతో ముందుకు కదులుతుందని గుర్తిస్తుంది. లోకో పైలట్ ఒక నిమిషం పాటు స్పందించకుండా ఉంటే ఇంజిన్లోని గాడ్జెట్ యాక్టివేట్ అవుతుంది.

ఇక ఒక లోకో పైలట్ నిద్రపోయినా, మరొక లోకో పైలట్ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలడు. ఇది కాకుండా, ఏదైనా పెద్ద సమస్య ఎదురైనట్లయితే, అతను తన తోటి లోకో పైలట్ని నిద్రలేపడం ద్వారా పరిస్థితిని నియంత్రించవచ్చు. అయితే డ్యూటీలో ఉండగా కదులుతున్న రైలులో లోకో పైలట్ నిద్రపోవడం చాలా అరుదు.
ఒకవేళ ఇద్దరూ నిద్రపోతే ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి చాలా శక్తివంతమైన టెక్నిక్ కూడా ఉంది. అదే మనం పైన చెప్పుకున్న విజిలెన్స్ కంట్రోల్ డివైజ్. లోకో పైలట్ హారన్ కొట్టినా, బ్రేక్ వేసినా, స్పీడ్ పెంచినా.. లోకో పైలట్ ఉన్నాడనే సందేశం ఇంజిన్కు చేరుతూనే ఉంటుంది. ఎలాంటి స్పందన రాకపోతే ఆటోమేటిక్గా రైలు ఆగిపోతుంది.

ఒక్కోసారి ఒకే వేగంతో రైళ్లు నడపాల్సి వస్తుంది. బ్రేకులు వేయాల్సిన అవసరం రాదు. కొన్నిసార్లు లోకో పైలట్ హారన్ మోగించాల్సిన అవసరం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇంజిన్కు ఎలాంటి సందేశం చేరదు. అలాంటి సందర్భాల్లో లోకో పైలట్ ఇంజిన్లో ఉన్న డెడ్ మ్యాన్స్ లివర్ను ఎప్పటికప్పుడు క్లిక్ చేయాలి.
డెడ్ మ్యాన్స్ లివర్ అనేది డ్రైవర్ యాక్టివ్గా ఉన్నట్లు ఇంజిన్కు సంకేతాలు ఇచ్చే ప్రత్యేక పరికరం. లోకో పైలట్ ప్రతి 2- 3 నిమిషాలకు ఈ పరికరాన్ని నొక్కకపోతే, ఇంజిన్ దానంతట అదే రైలు వేగాన్ని తగ్గిస్తుంది. కొద్ది దూరం వెళ్లాక ఆగిపోతుంది. కాబట్టి మీరు రైలులో ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు జరిగితే అది లోకో పైలట్ నిద్రపోవడం వల్ల జరిగింది కాదు అని తెలుసుకోవాలి.


Click it and Unblock the Notifications








